Thursday, May 2, 2024

జాహ్నవి మరణం కలచివేసింది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెలుగు యువతి కందుల జాహ్నవిపై అమెరికా పోలీసులు వ్యవహరించిన తీరుపై మంత్రి కెటిఆర్ తీవ్రస్థాయిలో ఎక్స్(ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు. యూఎస్‌ఏలోని ఎస్పీడీకి చెందిన పోలీసు అధికారి చర్యను పూర్తిగా ఖండిస్తూ.. అతడి ప్రవర్తన బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై యూఎస్ ప్రభుత్వ అధికారు లతో ఇండియన్ అంబాసిడర్ కార్యాలయం స్పందించి యువతి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అలాగే భారత విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్‌కు కెటిఆర్ ట్వీట్ చేశారు. ఈ విషయంపై యూఎస్ అధికారులతో సంప్రదించి స్వతంత్ర దర్యాప్తు జరిపేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఆశయాలతో జీవితంలో ముందుకు సాగుతున్న యంగ్‌స్టర్ జీవితం ఇలా ఛిన్నాభిన్నం కావడం విషాదకరమన్నారు. అలాంటి ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టడం మరింత విషాదం, దిగ్భ్రాంతికరమైన విషయమని మంత్రి కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు జాహ్నవి మృతిపై సియాటిల్ పోలీసు అధికారి చులకనగా మాట్లాడిన వీడియోపై భారత ప్రభుత్వం తీవ్రస్థాయిలో స్పందించింది. ఈ దృశ్యాలపై వెంటనే దర్యాప్తు జరపాలని అమెరికాను కోరింది. ఈ మేరకు శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబారి కార్యాలయం ట్వీట్ చేసింది. అమెరికాలో మృతి చెందిన తెలుగు యువతిపై వచ్చిన తాజా కథనాలపై భారత కన్సులెట్ ఆఫీస్ తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సియాటిల్ అలాగే వాషింగ్టన్‌లోని ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామని పోస్టు చేశారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశామని, అలాగే సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని వారు వెల్లడించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని అమెరికా ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ ఘటనపై బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేసింది. భారత రాయబారి కార్యాలయం కోరిన వెంటనే అగ్రరాజ్యం ఈ చర్యలను చేపట్టింది. మరోవైపు శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ ఈ ఘటనపై సైతం తీవ్రంగా స్పందించింది. ఈ కేసు దర్యాప్తును సియాటిల్, ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు కలిసి నిశితంగా పరిశీలిస్తామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News