సిఎం నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా
ఢిల్లీ చేరుకున్న సిఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు
ధర్నాకు హాజరుకానున్న రాహుల్ గాంధీ
బిసి బిల్లుపై చర్చించాలని లోక్సభలో రాష్ట్ర ఎంపిల ఆందోళన
మనతెలంగాణ/హైదరాబాద్: బిసి రిజర్వేషన్ల పోరాటం దేశ రాజధాని ఢిల్లీ చేరుకుంది. ఎంత జనాభాకు అంత వాటా అనే రాహుల్ గాంధీ నినాదాన్ని ఆచరణలో పెట్టేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు- విద్య, ఉపాధి రంగాల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్లో ఆమోదించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలో జంతర్మంతర్లో బుధవారం ధర్నా చేపట్టనున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో సాగుతున్న సమయంలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కుల గణన చేపడతామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవెర్చే బాధ్యతను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తన భుజాలకు ఎత్తుకున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే చేపట్టి ఆ లెక్కల ఆధారంగా రాష్ట్రంలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. వాటికి ఆమోదముద్ర వేయించాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఉంది.
బిసిలకు రిజర్వేషన్లు దక్కకుండా ముస్లింలను సాకుగా చూపి
రాష్ట్ర శాసనసభలో బిసి రిజర్వేషన్ల బిల్లులకు మద్దతు పలికిన బిజెపి నాయకులు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. బిసిలకు రిజర్వేషన్లు దక్కకుండా ముస్లింలను సాకుగా చూపి భావోద్వేగ రాజకీయాలకు తెరలేపుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జంతర్మంతర్లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలో ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, బిసి సంఘాల నాయకులు పాల్గొననున్నారు. ధర్నాలో పాల్గొనేందుకు పిసిసి అధ్యక్షుడు మహేశ్ గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, వివిధ జిల్లాల నాయకులు ప్రత్యేక రైలులో ఢిల్లీ చేరుకున్నారు. బిసి రిజర్వేషన్ల సాధనకు సంబంధించి జంతర్మంతర్తో పాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
సమాజ్ వాదీ పార్టీ, డిఎంకే, వామపక్షాల మద్ధతు
బిసి రిజర్వేషన్ల సాధనకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగే పోరుకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమిలోని సమాజ్ వాదీ పార్టీ, డిఎంకే, వామపక్షాలు, శివసేన (యూబిటి), ఎన్సీపీ (ఎస్పీ) తదితర పార్టీల నాయకులు హాజరై తమ సంఘీభావం తెలుపనున్నారు.
ఢిల్లీకి వెళ్లిన సిఎం రేవంత్
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు సిఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. 42 శాతం బిసిరిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికై ఛలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా నేడు జంతర్ మంతర్ వద్ద ధర్నాలో సిఎం, మంత్రులు పాల్గొననున్నారు. బిసి రిజర్వేషన్ల ఆర్డినెన్స్ను ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేలా మొత్తం మూడు రోజుల పాటు కాంగ్రెస్, పలు బిసి సంఘాలు ఆందోళన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. దీంతోపాటు బిసి రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపిలు వాయిదా తీర్మానాలను ఇవ్వనున్నారు.
వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని కోరుతూ ఎంపిల నినాదాలు
బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానంపై చర్చించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలు లోక్సభలో ఆందోళనకు దిగారు. దీనిపై చర్చించాలని కోరుతూ పట్టుబట్టారు. వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని కోరుతూ ఎంపిలు నినాదాలు చేశారు. ఈ విషయమై లోక్సభలో చర్చించి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడంతో పాటు రాష్ట్రపతి ఆమోదం పొందేలా కేంద్రం చొరవ తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపిలు డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపిల ఆందోళనలు కొనసాగుతుండగానే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ లోక్సభలో మాట్లాడారు.