Monday, April 29, 2024

టిడిపితో మాదిగలది శాశ్వత బంధం : చంద్రబాబు నాయుడు

- Advertisement -
- Advertisement -

తెలుగుదేశం పార్టీతో మాదిగలది శాశ్వత బంధం అని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాదిగ వర్గ ప్రజల అభ్యున్నతికి మొదటి నుంచీ పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు అన్నారు. టిడిపి విజయంలో మాదిగలు కీలక పాత్ర పోషించాలని చంద్రబాబు అన్నారు. ఏపిలోని ఉండవల్లిలో టిడిపి అధినేత చంద్రబాబుతో మందకృష్ణ మాదిగ, ఎంఆర్‌పిఎస్ నేతలు భేటీ అయ్యారు. చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా పలు అంశాలపై వినతిపత్రం ఇచ్చారు. రేపు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్ట మొదటి సమావేశాల్లోనే ఎస్‌సి వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలని మందకృష్ణ కోరారు. రాజ్యాంగ బద్ద సంస్థల్లో మాదిగ వర్గానికి తగు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అలాగే అన్ని కార్పొరేషన్‌లలో, నామినేటెడ్ పదవుల్లో మాదిగ వర్గానికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం ఎస్‌సిలకు రద్దు చేసిన అన్ని పథకాలు తిరిగి ప్రారంభించాలని విన్నవించారు.

ఎన్‌డియేకు తమ మద్దతు ఉంటుందని మంద కృష్ణ మాదిగ ఈ సందర్భంగా చంద్రబాబుకు తెలిపారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 40 ఏళ్లుగా పార్టీని మాదిగ సామాజికవర్గం ఆదరిస్తోందని అన్నారు. అలాంటి మాదిగ వర్గాన్ని పైకి తెచ్చేందుకు తాను ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ఏపిలో తెలుగుదేశం గెలుపు మాదిగల గెలుపు అవుతుందని అన్నారు. ప్రభుత్వంపై తెలుగు దేశం ఎంత గట్టిగా పోరాడుతుందో….అంతకంటే గట్టిగా ఎంఆర్పిఎస్ పోరాటం చేస్తోందని అన్నారు. మాదిగ సామాజికవర్గాన్ని అధికారంలో భాగస్వాములు చేస్తా అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాదిగ సమస్యలపై చంద్రబాబుతో మందకృష్ణ ప్రత్యేకంగా చర్చించారు. అధికారంలోకి వచ్చిన తరవాత మాదిగ వర్గానికి న్యాయం చేయాలని కోరారు. దళితులపై వైసీపీ ప్రభుత్వ దమనకాండను ఎదుర్కోవడంలో మందకృష్ణ చేస్తున్న పోరాటాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News