మన తెలంగాణ హైదరాబాద్ : ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ జిహెచ్ఎంసి పారిశుధ్య కార్మికురాలు భారతమ్మకు ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్య చికిత్స అందించనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. అదివారం ఉదయం సంతోష్ నగర్ సర్కిల్ పరిధిలోని ఐఎస్ సదన్ క్రాస్ రోడ్ వద్ద విధి నిర్వహణలో ఉన్న డి. భారతమ్మను ఆర్టీసీ బస్సు ఢికొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆమెను హూటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీంతో సమాచారం అందుకున్న మేయర్ వెంటనే ఉస్మానియాకు ఆసుపత్రికి చేరకుని గాయపడ్డ భారతమ్మను పరామర్శించారు. అక్కడే ఉన్న ఆమె ఇద్దరు కూతుర్లు, కుమారుడితో మాట్లాడిన మేయర్ ధైర్యం చెప్పారు. భారతమ్మకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించనున్నట్లు వారికి తెలిపారు. ఆ వెంటనే మేయర్ రాంమోహ్మన్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో మాట్లాడి గాయపడ్డ కార్మికురాలు భారతమ్మకు ఆర్టీసీ ఖర్చులతో మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు. ఇందుకు మంత్రి అజయ్ కుమార్ అంగీకరించారని తెలిపారు. కార్పొరేటర్ సామా స్వప్న, సుందర్రెడ్డి, చార్మినార్ జోనల్ కమీషనర్ సామ్రాట్ అశోక్ తదితరులు ఉన్నారు.