Sunday, April 28, 2024

అసెంబ్లీలో కెటిఆర్, హరీశ్‌రావుల ప్రవర్తన దారుణం: మల్లు రవి మండిపాటు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే అంశంపై శనివారం జరిగిన శాసనసభ సమావేశంలో మాజీ మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావుల ప్రవర్తన ప్రజాస్వామ్య విలువలను దిగజార్చే విధంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజా స్వామ్య విలువలను కాపాడుతూ ప్రభుత్వం నాయకులకు అసెంబ్లీలో సంపూర్ణంగా మాట్లాడే అవకాశం కల్పించిందన్నారు. తొలి రోజునే ప్రతిపక్ష నాయకులు ఎదురు దాడికి దిగడం, ఏడాదిలో ప్రభుత్వం పడిపోతుందని బిఆర్‌ఎస్ నాయకులు పిల్లి శాపాలు పెట్టడం చూస్తుంటే ప్రభుత్వం పోయి వాళ్లు ఎంత బాధలో ఉన్నారో అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పది రోజులలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన విషయాలను బిఆర్‌ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయనొక ప్రకటనలో దుయ్యబట్టారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చేశారని, ఇనుప కంచెలను తొలగించారన్న ఆయన తొలిరోజే ఒక వికలాంగురాలికి ఉద్యోగం ఇచ్చారని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలు ఇప్పటికే అమలు చేశామన్న ఆయన నిరంతరం సిఎం రేవంత్ రెడ్డి అనేక సమస్యలపై సమీక్షలు చేసి పరిష్కారాలు చూపుతున్నారన్నారు.

ఇలాంటి ప్రభుత్వం ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుం టుంటే బిఆర్‌ఎస్ నాయకులు భరించలేకపోతున్నారని విమర్శించారు. బిఆర్‌ఎస్ నాయకులు ఇంకా అధికారంలో ఉన్నామన్న భ్రమలో ఉన్నార న్నారు. ప్రజలు బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వ పది రోజుల పరిపాలనలో తమ ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలనను చూసి చాలా సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. ఇప్పటికైనా బిఆర్‌ఎస్ నాయకులు భ్రమలు వదిలి వాస్తవంలో బతికి ప్రభుత్వానికి సహకరించాల న్నారు. మేడిగడ్డ అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ పట్ల ప్రజల హర్షం

పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్

మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ల కుంగుబాటు అందులో జరిగిన అవినీతిపై సిఎం రేవంత్ రెడ్డి, సిట్టింగ్ జడ్జితో విచారణ ప్రకటించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ వెల్లడించారు. మేడిగడ్డ ఘటన జరిగి సుమారు 2 నెలలు గడుస్తున్నా గత ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీనే పునరుద్ధరణ చేస్తుందని అక్టోబర్ 28న కెటిఆర్ ఎలా చెప్పారని, ఇప్పుడు ఆ సంస్థ చేతులెత్తివేస్తే ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు.

బాధ్యత వహించాల్సిన ఇరిగేషన్ అధికారులు పునరుద్ధరణ చర్యలు చేయకుండా ఎందుకు అచేతనముగా ఉన్నారని ఆక్షేపించారు. రాబోయే వర్షాకాలం లోపల మేడిగడ్డ పునరుద్ధరణ సాధ్యం కాదని, పునరుద్ధరణ చేయకపోతే మరింత నష్టం అవుతుందన్నారు. అందుకు వీరందరూ బాధ్యులు కారా? అంటూ ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే నిపుణుల సమావేశము ఏర్పాటు చేసి అసలు పునరుద్ధరణ అవకాశాలున్నాయా? లేదా? అనే అంశంపై ఒక స్పష్టత ఇవ్వాలని నిరంజన్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News