Friday, May 3, 2024

ఉక్రెయిన్ సంక్షోభాన్ని నివారించేందుకు ప్రపంచ నాయకుల భేటీ

- Advertisement -
- Advertisement -

Meeting of world leaders to avert the crisis in Ukraine

 

మాస్కో: ఉక్రెయిన్ ప్రతిష్టంభనను తగ్గించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మాస్కోలో, జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ వాషింగ్టన్‌లో మంతనాలు జరుపనున్నారు. రష్యా దండయాత్ర భయంతోనే వారు ఈ సమన్వయ చర్చలు జరిపేందుకు పూనుకోబోతున్నారు. ఉక్రెయిన్ వద్ద రష్యా లక్ష దళాలను మోహరించడంతో పాశ్చాత్య దేశాలకు భయం పట్టుకుంది. వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ ఆదివారం, “ఉక్రెయిన్‌పై రష్యా ఏ రోజైనా దాడిచేయగలదు. ఈ దాడి జరిగితే అత్యంత మానవ నష్టం సంభవించగలదు?” అన్నారు. అయితే తన పొరుగు దేశంపై దాడి యోచనలను రష్యా తిరస్కరించింది.

కానీ ‘నాటో’లో చేరకుండా ఉక్రెయిన్, ఇతర సోవియట్ దేశాలను దూరంగా ఉంచాలని అమెరికా, దాని మిత్రదేశాలను రష్యా అభ్యర్థించింది. అక్కడ ఆయుధాలను మోహరించొద్దు, తూర్పు యూరొప్ నుంచి నాటో దళాలను వెనక్కి తీసుకోవాలని రష్యా కోరగా, అమెరికా, నాటో కూటమి ఆ డిమాండ్లను తిరస్కరించాయి. ఇదిలా ఉండగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మాస్కోకు బయలుదేరడానికి ముందు, ఆదివారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మాట్లాడారు. వారు ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సైన్యాన్ని మోహరించడంపై, దౌత్య యత్నాలపై చర్చలు జరిపారు. కాగా ఉక్రెయిన్ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకుమద్దతు ఇచ్చే విషయంలో కట్టుబడి ఉన్నట్లు వైట్ హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది.

“ఉక్రెయిన్ లేక ఇతర యూరొప్ దేశాల భద్రత, సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడేదే లేదు” అని మాక్రాన్ ఫ్రెంచి దినపత్రిక ‘జర్నల్ డు దిమాంచే’కు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ‘మాక్రాన్ సందర్శన చాలా ముఖ్యమైనది’ అని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అభిప్రాయపడ్డారు. ఇదిలావుండగా లిథ్వేనియాకు మరిన్ని దళాలను పంపించే అవకాశం ఉందని జర్మన్ రక్షణ మంత్రి క్రిస్టీన్ లాంబ్రెక్ట్ ఆదివారం తెలిపారు. కాగా పోలాండ్, రొమానియా, జర్మనీల్లో అదనపు అమెరికా బలగాల మోహరింపుకు జో బైడెన్ ఉత్తర్వులు ఇచ్చారు.

కాగా ఇదివరలో 2019 డిసెంబర్‌లో ప్యారీస్‌లో రష్యా, ఉక్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీ నాయకులు సమావేశం అయ్యారు. నార్మండీ ఫార్మంట్‌లో జరిగిన సమావేశం అది. కానీ ప్రధాన వివాద అంశాలను పరిష్కరించడంలో ఆ సమావేశం విఫలమైంది. ఇదిలావుండగా 2015లో చేసుకున్న ఒప్పందం కింద ఉక్రెయిన్ తన విధిని పూర్తిచేసేలా ప్రోత్సహించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆయన ప్రభుత్వ అధికారులు ఫ్రాన్స్, జర్మనీ, ఇతర పాశ్చాత్య కూటమి దేశాలను అభ్యర్థించారు. అయితే జాతీయ ప్రయోజనాల విషయంలో మిన్స్‌క్ ఒప్పందం మోసపూరితం కాగలదని ఉక్రెయిన్ జాతీయ భద్రత, రక్షణ మండలి కార్యదర్శి ఓలెక్సీ దానిలోవ్ గతవారం తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News