Tuesday, April 30, 2024

పట్టపగలే అడ్డంగా దొరికిన దొంగ బండి సంజయ్: హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

మెదక్: బిఆర్‌ఎస్ పార్టీని కెసిఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేక, చేతగాక చేస్తూ విద్యార్థులను అడ్డం పెట్టుకుని దిగజారుడు రాజకీలయాలకు పాల్పడుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం మెదక్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధ్ది కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. రాజకీయంగా ఎదుర్కొండం చేతగాకే విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతూ దిగజారుడు రాజకీయాలకు బిజెపి పాల్పడుతుందన్నారు. నిన్న పేపర్ లీకేజీలో పట్టపగలు అడ్డంగా దొరికిన దొంగ బండి సంజయ్ అండ్ బిజెపి అని అన్నారు. పిల్లల భవిష్యత్తును అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం బిజెపికి ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్రంలో బిజెపి ఉంది, రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ఉంది.

మన ప్రభుత్వాలు భవిష్యత్తు తరాల కోసం పనిచేయాలని కానీ రాజకీయాల కోసం వారి జీవితాలతో అడుకోవద్దని అది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మొన్న వరంగల్‌లో బిజెపి పార్టీ వారు పేపర్ లీకేజీ అయ్యిందని ధర్నా చేశారు. సాయంత్రమెమో పేపర్ లీకేజీలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని ధర్నా చేశారు. దీన్ని బట్టి అరెస్టు అయిన వారు పక్క బిజెపి వాడేనని తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. అంటే బిజెపి పార్టీ ఒక పథకం ప్రకారం పేపర్ లీకేజీలకు పాల్పడుతూ దానిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ రాజకీయంగా వాడుకొని మాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బిజెపి అంటేనే ఒక విచ్చిన్నం, విద్వేశం చేసే కుట్ర అని రాజకీయం, అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారని ఆరోపించారు. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరు గమనించి బిజెపిని తిప్పికొట్టాలన్నారు.

పదవ తరగతి ప్రశ్నాపత్రాలు ఎక్కడ కూడా లీకేజీ కాలేదని విద్యార్థుల తల్లితండ్రులకు ఆందోళనకు గురికావద్దని సూచించారు. బిజెపి నాయకులకు చదువు విలువ తెలియదని ఆ పార్టీలో అందరు ఫేక్ సర్టిపికెట్లు గాళ్లేనని, ఈ పేపర్ లీకేజీ వెనకాల సూత్రదారి, పాత్రదారి బండి సంజయ్ అని తాండూర్‌లో, వరంగల్‌లో జరిగిన పేపర్‌లీకేజీ వెనకాల పక్కా బండి సంజయ్ హస్తం ఉందని అర్థమవుతుందన్నారు. లీకేజీ కేసులో అరెస్టు అయిన బిజెపికి చెందినవారేనని ఇదంతా కూడా బిజెపి చేసిన కుట్రలో భాగమేనన్నారు. ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్‌కు ఎంత దగ్గరి వ్యక్తో అని మీడియా ముందు ప్రశాంత్, బండి సంజయ్‌ల ఫోటోలతోపాటు పలువురు బిజెపి ప్రముఖలతో ప్రశాంత్ ఉన్న ఫొటోలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. గతంలో జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఆత్మహత్యల పేరిట డ్రామాలాడారు. తర్వాత ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరంలో అడ్డంగా దొరికిపోయారు.

చివరికి ప్రశ్నాపత్రాల లీకేజీలు చేసి పసిపిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతూ దిగజారుడు రాజకీయాలకు దిగారని అన్నారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ చేసిన ప్రశాంత్ బిజెపి కార్యకర్తనా..కాదా..? ప్రశాంత్ ప్రశ్నాపత్రాన్ని బండి సంజయ్‌కు పంపించింది నిజమా.. కాదా..? రెండు గంటల్లో 142 సార్లు ఫోన్‌లలో మాట్లాడుతూ బండి సంజయ్‌కు ఫోన్ ద్వారా సంభషించింది వాస్తవమా కాదా అంటూ ఈ అంశాలపై సమాధానం ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు బిజెపిని సూటిగా ప్రశ్నించారు. ప్రశ్నాపత్రం లీకేజీలో బండి సంజయ్ ప్రమేయం లేకుంటే నీకు నిందితుడు ఇచ్చిన సమాచారాన్ని ఎందుకు దాచావని నిలదీశారు. రోజుకో ప్రశ్నాపత్రాన్ని లీక్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం నిజం కాదా అంటూ బిజెపికి సూటి ప్రశ్నాను విసిరారు. పదో తరగతి హీంది పేపర్ ఎగ్జామ్ పరీక్ష నిర్వహణలో ఉన్నప్పుడే మరో ఎమ్మెల్యే రఘునందన్‌కు ఎలా చేరిందంటూ ప్రశ్నించారు. ఇది పంపింది కూడా ప్రశాంత్‌నేనని మీఅందరికి ప్రశాంత్‌తో ఏం సంబందమని అన్నారు.

ఇదంతా ఒక పథకం ప్రకారమే చేస్తున్నారని బట్టబయలైందని తెలంగాణ ప్రజలకు తెలిసిపోయిందన్నారు. గుజరాత్‌లో 16 సార్లు పేపర్ లీకేజీ అయితే మోడీ, నడ్డాలు మాట్లాడారని, తెలంగాణలో ప్రశ్నాపత్రాలు లీకేజీ కాకున్న మీడియా హౌజ్‌ల్లో ప్రచారం చేస్తూ బిజెపి కుట్రకు పాల్పడుతుందన్నారు. నేడు పట్టపగలు నగ్నంగా దొరికిపోయిన పార్టీ బిజెపియేనని, నిందితుడు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించేవిధంగా సమగ్రమైన విచారణ చేపట్టాలని పోలీసు శాఖ వారిని కోరారు. బిజెపి రాజకీయాల కోసం ఎంతకైన దిగజారుతారనే ఈ పేపర్ లీకేజీలే కారణమని తెలిపారు. ఒకపక్క మతాలను రెచ్చగొడుతూ, నకిలీ యుద్ధ్దాలను చేస్తూ రక్తపాతాన్ని సృష్టిస్తూ పసిపిల్లల జీవితాలతో రాజకీయం చేసే ఏకైక పార్టీ బిజెపియేనన్నారు. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నేడు బిజెపికి ఏర్పడిందని తెలంగాణ సమాజం ఛీ కోడుతూ తెలంగాణ ప్రజానికం అసహ్యించుకుంటుందన్నారు.

ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదని అలాంటి వారిని అరెస్టు చేసి లోతైన విచారణ జరిపి ఎంతటి వారినైనా శిక్షిస్తుందని హెచ్చరించారు. ఒక బాధ్యతయుతమైన పార్లమెంట్ సభ్యుడే ఈ రకంగా ప్రవర్తించడం పట్ల లోక్‌సభ స్పీకర్ అతనిపై అనర్హత వేటు వేయాలని, పార్లమెంట్ సభ్యత్వం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బిజెపి నాయకులకు చీము నెత్తురు ఉంటే తెలంగాణ విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు క్షమాపణ చెప్పాలని సూచిస్తూ అలా చేయని యెడల తెలంగాణ ప్రజలు ఎన్నటికి మిమ్మల్ని క్షమించరని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News