Sunday, April 28, 2024

HarishRao: ఆరు నెలల్లో 80 వేల ఉద్యోగాలు..

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: పేపర్ లీకేజీని గుర్తించి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం నారాయణరావుపేట మండలం బంజేరుపల్లి బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో జరిగిన బిఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి పక్షాలు నిరుద్యోగులను రెచ్చ గోట్టె విధంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. నిరుద్యోగులు వారి మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. ఆరు నెలల్లోపు 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఈ సంవత్సరం ఆసెంబ్లీ బడ్జెట్‌లో రూ. 1000 కోట్ల నిధులను కేటాయించామన్నారు. దేశ వ్యాప్తంగా 16 లక్షల ఉద్యోగాలను కేంద్రంలో ఉన్న బిజెపి సర్కార్ ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు.

మాయ మాటలు తప్ప బిజెపి సర్కార్ ప్రజల కోసం చేసింది ఏమి లేదన్నారు. సిఎం కెసిఆర్ పట్టుదల కృషితోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి ప్రతి పంటకు గోదావరి జలాలు అందుతుండడంతోనే ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. వానల కోసం ఒకప్పుడు రైతులు ఆకాశం వైపు చూసేవారని ప్రస్తుతం కెసిఆర్ వైపు చూస్తున్నారన్నారు. కాలంతో పని లేకుండా గోదావరి జలాలతో పంట సాగు అవుతుందన్నారు. కాళేశ్వరంలో పెట్టిన పెట్టుబడి ఎప్పుడో ఎల్లిపోయిందన్నారు. ఢిల్లీ, హైదరాబాద్‌లో కూర్చోని కాళేశ్వరంపై మాట్లాడడం కాదు ఈ ప్రాంతంలో వచ్చి పర్యటిస్తే కాళేశ్వరం ఫలితాలు తెలుస్తాయని బిజెపి, కాంగ్రెస్ నాయకులకు సూచించారు. బిఆర్‌ఎస్ సర్కార్ చేస్తున్న అభివృద్ధ్దిని జీర్ణించుకోలేకనే ప్రతి పక్షాలు ఆరోపణలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు.

ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా కొత్త సెక్రటేరియట్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు సెక్రటేరియట్ పేరును అంబేద్కర్ పేరుగా నామకరణం చేసుకోవడం జరిగిందన్నారు. మరోవైపు అమర వీరుల స్థూపం సెక్రటేరియట్ ఆవరణలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. యావత్తు దేశం చూపు కెసిఆర్ వైపు ఉందని తెలంగాణ పాలన తరహా ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం కోరుకుంటున్నారన్నారు. మహరాష్ట్రకు చెందిన 150 మంది రైతులు సిద్దిపేట జిల్లాలో పర్యటించి మండుటెండల్లో మత్తడులు దుక్కడం, పంట పోలాలకు సాగు నీరు అందడం చూసి ఆశ్యర్యపోయారన్నారు. తెలంగాణ రైతులు పండించిన పంటను కొనుగోలు చేయమంటే మొండికేసిన మోడీ సర్కార్ అదానికి వేల కోట్ల రుణాలను మాఫీ చేయడం సిగ్గు చేటన్నారు. రైతులకు అన్ని విదాలుగా అండగా నిలుస్తుంది.

సిఎం కెసిఆరే అన్నారు. ఈ సమ్మేళనంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జడ్పీచైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మ, ప్రజాప్రతినిధులు, నాయకులు మారెడ్డి రవీందర్‌రెడ్డి, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, ఎల్లారెడ్డి, బాలమల్లు, హరీశ్, ఆంజనేయులు, బాస్కర్, పెద్దన్న పంతులు, ఎల్లయ్య, బాలకృష్ణ, సంతోష్, నరేందర్‌రెడ్డి, లక్ష్మి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News