Thursday, May 2, 2024

జాతీయ రాజకీయాలను శాసిస్తాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో పురుడుపోసుకున్న ఒక జాతీయ పార్టీ హైదరాబాద్ కేంద్రంగా జాతీయ రాజకీయాలను శాసించే పరిస్థితి కూడా రావచ్చు. ఈ దేశంలో ప్రజల దయ ఉంటే ఏదైనా సాధ్యమే అని భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కేంద్రంగా జాతీయ రాజకీయాలు చేయవద్దనే నియమం కూడా ఎక్కడా లేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయాలని ప్రకాశ్ అంబేద్కర్ గుర్తు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ పార్టీకి అపూర్వ స్పందన లభిస్తోందని, జిల్లా పరిషత్ చైర్మన్లు, మాజీ ఎంఎల్‌ఎలు చేరుతున్నారని చెప్పారు. ఒక్క మహారాష్ట్రలోనే కాదు దేశంలో నే రాజకీయ శూన్యత ఉందని తెలిపారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ బుధవారం విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడా రు. ప్రధాన ప్రతిపక్షం విఫలమైంద ని, దాంతో ఎవరైనా సరైన నాయకుడు వస్తారా..అని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు.

మోడీ కాకపోతే ఎవరని బిజెపి నా యకులు అడుగుతుంటారని, అయితే 2010 లో మోడీ ఎవరు..? అని ప్రశ్నించారు. అప్పు డు ఆయనెవరికి తెలుసని అడిగారు. గుజరాత్ మోడల్ అని ఊదరగొట్టి ప్రధాని గద్దెనెక్కి కూ ర్చుకున్నారని విమర్శించారు. టిఆర్‌ఎస్ పార్టీ బిఆర్‌ఎస్‌గా ఎందుకు మారింది…ఏం అవసరమొచ్చింది అని కొంతమంది విమర్శిస్తున్నారని, మా పార్టీ పేరు మారవచ్చు కానీ మా డి ఎన్‌ఎ మారలేదని అన్నారు. మా పార్టీ జెం డా…ఎజెండా
మారలేదు…మా ఫిలాసఫీ మారలేదు…మా పనితీరు మారలేదు… మా నాయకుడు మారలేదు…మా ఎన్నికల గుర్తు కూడా మారలేదని చెప్పారు. ఒక మొక్కను పెట్టినప్పుడు దానిని మొక్క అని అంటామని, అలాగే ఒక లేగదూడ పుట్టినప్పుడు లేగదూడ అంటా…21 ఏళ్లు దాటితే దానిని కోడె గిత్తె అంటాం..పేరు మారుతుంది కానీ లక్షణం మారదని చెప్పారు. మొక్క ఎదిగి వృక్షంగా మారినట్లు…లేగదూడ కోడె గిత్తెగా మారినట్లు టిఆర్‌ఎస్ పార్టీ బిఆర్‌ఎస్‌గా మారిందని వివరించారు. మహారాష్ట్రను మొదటి మైదానంగా చూసుకున్నామని, భవిష్యత్తులో మహారాష్ట్రలో జరిగినట్లుగానే ఇతర రాష్ట్రాలలో కూడా అదే తరహాలో స్పందన రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

22 ఏళ్ల ప్రస్తానంలో ఉద్యమాన్ని, ప్రభుత్వాన్ని, పరిపాలనను కెసిఆర్ సజావుగా తీసుకెళ్తున్నారని చెప్పారు. కెసిఆర్ ఉద్యమకారునిగా, పరిపాలనదక్షుణిగా రుజువు చేసుకుని బిఆర్‌ఎస్ రూపంలో ఇతర రాష్ట్రాలలో అడుగుపెడుతున్నారని వెల్లడించారు. కెసిఆర్ దక్షత, పరిపాలన సమర్థతను ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా గుర్తిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ మోడల్‌ను దేశానికి ఎందుకు పరిచయం చేయకూడదని ప్రశ్నించారు. ఒకచోట మొదలైన విప్లవం…క్రమంగా మహారాష్ట్ర, తర్వాత ఆంధ్ర, ఆ తర్వాత కర్ణాటక అడుగుపెడతామని పేర్కొన్నారు. జాతీయ పార్టీగా మారినంత మాత్రాన వెంటనే 543 లోక్‌సభ స్థానాలు పోటీ చేయాలన్న నియమం ఏమీ లేదని కెటిఆర్ అన్నారు. రెండు స్థానాల నుంచి 303 రాత్రికిరాత్రే రాలేదు కదా..? అని ప్రశ్నించారు. దేనికైనా సమయం పడుతుందని, ప్రజల మూడ్‌ను బట్టి, నాయకులను బట్టి ఆచితూచి పోతున్నామని చెప్పారు. ప్రణాళికాబద్దంగా ముఖ్యమంత్రి కెసిఆర్ వెళుతున్నారని అన్నారు…బిఆర్‌ఎస్‌గా ఇది మొదటి వార్షికోత్సవమని అన్నారు.

2023లో తెలంగాణ గెలిచితీరాలి

బిఆర్‌ఎస్ పార్టీ ముందున్న లక్ష్యం 2023లో తెలంగాణ గెలిచితీరడం అని కెటిఆర్ పేర్కొన్నారు. అందుకు మేము చేసిన పని సరిగ్గా చెప్పు కంటే చాలని అన్నారు. చేసిన పనిని గడపగడపకు తీసుకుని వెళితే ప్రజలకు గుర్తుచేయగలిగితే కచ్చితంగా కెసిఆర్ దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ కొట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. నాలుగైదుసార్లు ముఖ్యమంత్రులుగా చేసినవాళ్లు ఉన్నారు కానీ హ్యాట్రిక్ ఎవరు కొట్టలేదని తెలిపారు. కెసిఆర్ తప్పకుండా ఆ ఘనత సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో సరిస్థితులను బటి మేము ఎన్ని సీట్లలో పోటీ చేయగలిగలిగితే దాన్ని బట్టి పోతామని చెప్పారు. వ్యూహాత్మక సర్ధుబాట్లు ఉంటాయని తెలిపారు. అయితే కాంగ్రెస్, బిజెపి రెండు జాతీయ పార్టీలు ఈ దేశాన్ని ముంచినయి…విఫలమైనయని అన్నారు. ఈ రెండు పార్టీలతో మాత్రం ఎలాంటి సర్దుబాటు, అవగాహన ఉండదని స్పష్టం చేశారు. అలాంటి ఆలోచన కూడా లేదని అన్నారు.

రాహుల్‌గాంధీ ఎవరు అడిగారు..?
బిఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ అన్నారని, పొత్తు గురించి అయనను ఎవరు అడిగారని ప్రశ్నించారు. ఆయనే వచ్చి ఆయనే ప్రకటన చేసి లేనిపోని కన్ఫూజన్ సృష్టిస్తున్నారని అన్నారు. రెండు జాతీయ పార్టీలు విఫలమయ్యాయి కాబట్టే దేశంలో రాజకీయ శూన్యత ఉందని స్పష్టం చేశారు. ప్రజలకు విశ్వాసం కల్పించడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. 2024 ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు.

జూన్‌లో యువజన సమ్మేళనాలు
రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీ సమ్మేళనాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని కెటిఆర్ తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు నుంచి విశేష స్పందన వస్తుందని అన్నారు. జూన్ నెలలో రాష్ట్రంలో యుజనవ సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు కెటిఆర్ వెల్లడించారు. జూన్‌లో విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందని,విద్యార్థులకు తెలంగాణ వచ్చిన తర్వాత ఒనగూరిన ప్రయోజనాలు వివరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో గురుకులాలు ఏర్పాటు చేసిన తీరు, జిల్లాకో మెడికల్ కాలేజీ,నర్సింగ్ కాలేజీల ఏర్పాటు, రాష్ట్రంలో విద్యావ్యాప్తికి, విస్తృతికి పెద్దపీట వేస్తున్న తీరు, ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్న తీరు, తెలంగాణ పురోగమన ప్రగతిశీల విధానాలు విద్యార్థులకు వివరిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్కటంటే ఒక్క విద్యాసంస్థను తెలంగాణ ఇవ్వని తీరు, ఒక్క పరిశ్రమను పెట్టలేదు…ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోగా, తెలంగాణ రాష్ట్రాన్ని హింసించే ప్రయత్నం చేస్తున్న కేంద్రం తీరును విద్యార్థులు, యువత దృష్టిలో పెడతామని వివరించారు.

అలాగే మే 1న కార్మిక దినోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకువచ్చి ఏ విధంగా కార్మికులకు అన్యాయం చేస్తున్నది…బిఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసి వంటి సంస్థల గొంతు ఎలా నులుముతున్నది, అసంఘిత రంగంలో ఉండే కార్మికులకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నది కార్మికులకు చెబుతామని చెప్పారు. గీత కార్మికులు, నేత కార్మికులు, బిడి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులతో కార్మికులందరికీ కెసిఆర్ ప్రభుత్వం ఏ విధంగా అండగా నిలబడిందో చెబుతామని అన్నారు.

3 శాతం జనాభా ఉన్న రాష్ట్రం..30 శాతం అవార్డులు గెలుచుకుంది
దేశంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం..తలసరి ఆదాయం జాతీయస్థాయిలో 28 రాష్ట్రాలలో అత్యధికంగా ఎదుగుదల కలిగిన రాష్ట్రంగా చూపడం తెలంగాణ మోడల్ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. రూ.1.24 లక్షలు ఉన్న తలసరి ఆదాయాన్ని రూ.3.17 లక్షలకు అనతికాలంలో పెంచడం…ఐటి రంగంలో అత్యధికంగా ఉద్యోగాలు కల్పించడం, దేశంలో 4.50 లక్షల ఐటీ ఉద్యోగాలు ఉంటే 33 శాతం ఉద్యోగాలు… 1.50 లక్షలు తెలంగాణ నుంచి రావడం …ఇంటింటికీ నీరు ఇవ్వడం….విద్యుత్ సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని విద్యుత్ మిగులు రాష్ట్రంగా…100 శాతం ఒడిఎఫ్ గ్రామాలు చేయడం తెలంగాణ మోడల్ అని అన్నారు. సమతుల్యమైన సమగ్ర సమీకృత సమ్మిళిత రాష్ట్రంగా తెలంగాణ సాధిస్తున్నదని కెటిఆర్ వివరించారు. 3 శాతం కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం.. దేశంలో 30 శాతం పంచాయతీ అవార్డులు గెలుచుకుందని గుర్తు చేశారు.

150 మున్సిపాలిటీలు ఉన్న తెలంగాణ, 350 మున్సిపాలిటీలు ఉన్న మహారాష్ట్రతో పోటీపడి సమానస్థాయిలో అవార్డులు సాధించి దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు. ఏకకాలంలో పల్లెప్రగతి, పట్టణ ప్రగతి జరుగుతోందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అంటే గిట్టని కేంద్రం అనివార్యంగా అవార్డులు ఇస్తోందని, ప్రభుత్వ పని తీరుకు ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుందని చెప్పారు. ఐటీ ఎగుమతులు 57 వేల కోట్ల నుంచి 1.83 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. అదేసమయంలో అదేస్థాయిలో వ్యవసాయ విస్తరణ కూడా జరిగిందని వివరించారు. వ్యవసాయ దిగుబడులు పెరుగుతున్నాయి…పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. గ్రీన్‌కవర్‌లో అత్యధికం తెలంగాణ ఉన్నదని, పచ్చదనం 7.7 శాతం పెరిగిందని, 5.13 లక్షల ఎకరాల అటవీ వైశాల్యాన్ని పెంచామని తెలిపారు.

సింగిల్ ఇంజన్ ఉన్న తెలంగాణలో అద్భుతాలు జరుగుతున్నాయి
తెలంగాణ ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మారిందని కేంద్రం జలవనరుల శాఖ మంత్రి పార్లమెంట్‌లో ప్రకటించారని కెటిఆర్ గుర్తు చేశారు. జిల్లాలకు జిల్లాకే మానవ రహితగా మారే పరిస్థితి నుంచి ఈరోజు ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మారిందని మేం అంటే ఇష్టం లేని కేంద్రం ప్రకటించడం తమ విజయం కాదా..? అని ప్రశ్నించారు. కచ్చితంగా ఇది తమ ప్రభుత్వం దర్శతకు, పనితనానికి నిదర్శనం కాదా..? అని పేర్కొన్నారు. 75 ఏళ్లలో వ్యవసాయ సంక్షోభం గురించి, రైతులు, రైతు కూలీల ఆత్మహత్యల గురించి వార్తలు చూశాం కానీ, రైతుల వికాసం గురించి వార్తలు చూస్తున్నామని చెప్పారు. తొమ్మిదన్నర ఏళ్లలో వ్యవసాయం కోసం 4.50 లక్షల ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. రైతులను సంక్షోభం నుంచి బయటపడేయడం ప్రభుత్వ బాధ్యత కాదా..? అని ప్రశ్నించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్న దగ్గర రైతు ఆత్మహత్యులు జరుగుతుంటే…సింగిల్ ఇంజన్ ఉన్న తెలంగాణలో అద్భుతాలు జరుగుతున్నాయని తెలిపారు.

అయితే తెలంగాణలో అసలు సమస్యలు రావడం లేదని అనడం లేదని అన్నారు. అమెరికా అయినా, ఇంకా ఎక్కడైనా ఎక్కడ ఉంటే సమస్యలు అక్కడ ఉంటాయని చెప్పారు. ఎంత అభివృద్ధి చేసినా మనిషి ఉన్నంత కాలం సమస్యలు ఉంటేనే ఉంటాయని, వాటిని పరిష్కరించుకుంటూ పోవడమే గవర్నెన్స్ అని తెలిపారు. 22 ఏళ్లలో 14 సంవత్సరాలు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన పార్టీ…ఒక అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని గాడిలో పెడతాం..మంచి పునాది వేస్తాం అని చెప్పి దానిని ఆ పార్టీ నాయకుడు కెసిఆర్ రుజువు చేశారని తెలిపారు. ఒకప్పుడు తెలంగాణ వాళ్లను పరిపాలన వాళ్లను ఎక్కిరించారని, కానీ ఇప్పుడు భారతదేశంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని చెప్పారు. ప్రతి రోజు ఇతర రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చి తెలంగాణ పథకాలు పరిశీలిస్తున్నారని వివరించారు. గోల్‌మాల్ గుజరాత్ అని చెప్పి ఓ గుజరాత్ అయిన వచ్చి దేశాన్ని ఆగం చేసి..ఇంకా ఆగం చేస్తున్నారని కెటిఆర్ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News