Wednesday, May 8, 2024

మాట తప్పని మంత్రి

- Advertisement -
- Advertisement -

భైంసా : ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గతంలో చేసిన ఆందోళనలో ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్ అయిన రావాలని పట్టుబట్టారు. అప్పట్లో ఎట్టకేలకు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వచ్చి విద్యార్థులతో మాట్లాడి ఆందోళన విరమింప జేశారు. తాము పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని తరచూ విద్యార్థులు ఆందోళనకు దిగడం పరిపాటిగా మారింది. అయితే ఊహించని విధంగా సెప్టెంబర్ నెలలో మంత్రి కెటిఆర్ బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు. ఆయన ట్రిపుల్ ఐటీని సందర్శించడమే గాకుండా విద్యార్థుల ఉద్యమాన్ని, ఆందోళనను, స్వాతంత్రోద్యమంలో జరిగిన పోరాటంతో పోల్చారు. ఆయన విద్యార్థుల డిమాండ్లతో పాటు వారు అడగకుండానే ఎన్నో హమీలిచ్చారు.

సమస్యలన్నీ పరిష్కరించి దూరం చేస్తానని కుండ బద్దలుకొట్టినట్లు చెప్పారు. అందుకు అనుగుణంగా రెండవ సారి మళ్లీ ఆయన శనివారం బాసర ట్రిపుల్ ఐటీలో అడుగుపెడుతున్నారు. పేరుకే స్నాతకోత్సవానికి హాజరవుతున్నా గతంలో విద్యార్థులకు ఇచ్చిన హమీ ప్రకారం ఆయన శనివారం నాటి పర్యటన ఖరారైనట్లు తెలుస్తుంది. అంతే కాకుండా విద్యార్థుల ప్రధాన డిమాండ్ అయిన లాప్‌టాప్‌ల పంపిణీ సైతం జరగనుంది. మంత్రి కెటిఆర్ ట్రిపుల్ ఐటీ 5వ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఆయన పర్యటనకు అనుగుణంగా ట్రిపుల్ ఐటీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9.30 గంటలకు మంత్రి బాసరకు చేరేలా షెడ్యూల్ ఖరారైంది.

అధికారుల స్వాగతం, తదనంతరం విశ్వవిద్యాలయంలో గల కాన్ఫరెన్స్ హాల్‌లో యూనిఫామ్స్, లాప్‌టాప్, షూలను విద్యార్థులకు మంత్రి అందజేయనున్నారు. అంతేగాకుండా ఆయన విద్యార్థులతో మాట్లాడనున్నారు. గతంలో ఆందోళన సందర్బంగా విమర్శలు రాగ మంత్రి కెటిఆర్ విద్యార్థుల్లో తన మొదటి పర్యటనతోనే అందుకు రెట్టింపు ఊత్సాహన్ని నింపారు. అంతేగాకుండా రెండవ సారి మంత్రి పర్యటన ఉండడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో హార్షతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో ఆశలతో ట్రిపుల్ ఐటీకి ఎంపికైన పిల్లలను తల్లిదండ్రులు చదువులకు పంపుతున్నారు.

ట్రిపుల్ ఐటీ సమస్యలతో వారి ఆశలు ఆవి కాగా మంత్రి కెటిఆర్ హమీలతో ఎంతో ఊరటనిచ్చాయి. అందుకు అనుగుణంగా ట్రిపుల్ ఐటీకి వైస్ చాన్సలర్‌గా వెంకటరమణతో పాటు డైరెక్టర్ సతీష్ కుమార్ సైతం రెగ్యులర్‌గా ఉంటూ సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ నిర్వాహణ గాడిలో పడుతుండగా సమస్యలు సైతం దశలవారీగా దూరం కానున్నాయి. దీంతో విద్యార్థుల భవిష్యత్తుపై బెంగ వీడగా మళ్లీ ట్రిపుల్ ఐటీలో సీట్లపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆశలు పెంచుకుంటున్నారు.

తమ పిల్లల కలలు నెరవేరడం కేవలం మంత్రి కెటిఆర్‌తోనే సాధ్యమవుతుందన్న అభిప్రాయం సైతం వ్యక్తమవుతుంది.  ఆ దిశగా మంత్రి దృష్టి సారిస్తే ట్రిపుల్ ఐటీ చదువుతున్న పిల్లల భవిష్యత్తుకు బెంగ ఉండదంటున్నారు. తమ కలలు నెరవేర్చేలా కెటిఆర్ అడుగులు పడుతున్నాయని సైతం అభిప్రాయం వినిపిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News