Saturday, April 27, 2024

ఆధునిక టెక్నాలజీతో మేడిగడ్డకు పరీక్షలు

- Advertisement -
- Advertisement -

నిపుణుల కమిటీకి ప్రభుత్వం
నుంచి పూర్తి సహకారం
అధికారులు ఎవరైనా
సమాచారం దాచి ఉంచితే
కఠిన చర్యలు నిర్మాణ సంస్థ
ఎల్ అండ్ టిని బాధ్యులుగా చేస్తాం
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచంలో ఉన్న అత్యంత అధునాతన సాంకేతికను ఉపయోగించుకుని కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజికి పరీక్షలు నిర్వహించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన నిపుణు ల కమిటి బృందానికి సూచించామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్త మ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం ఢిల్లీనుంచి వచ్చిన నిపుణుల కమిటీతో జలసౌధలో జరిగిన సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకే నిపుణుల కమిటి బృందం ఇక్కడికి వచ్చిందని , కమిటీ బృందానికి వారు కోరిన సమాచారం అందజేయటంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా సంపూర్ణ సహకారం అందజేస్తుందని తెలిపారు.

ఎవరైనా అధికారులు తమ వద్ద ఉన్న సమాచారం ,ఇతర రికార్డులు కమిటీ సభ్యులకు అందజేయకుండా దాచి ఉంచితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల పథకంలో కీలకమైన మేడిగడ్డ , అన్నారం సుందిళ్ల బ్యారేజిల డాక్యుమెట్లు, ఇతర రికార్డులను కమిటికి అందజేసి వారు కోరిన విధంగా సహకరించాలన్నారు. నిపుణుల కమిటి ఇచ్చే ప్రాథమిక నివేదిక ఆధారంగానే బ్యారేజీ మరమ్మతులతో పాటు, ప్రాజెక్టుల నిర్మాణంలో తప్పు చేసిన వారిపై చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమారెడ్డి స్పష్టం చేశారు. తాము కోరిన వెంటనే కేంద్ర జలశక్తి శాఖ కమిటీ వేసి పరిశీలనకు పంపినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.మోదీ విధానాల కారణంగానే దేశంలో నీటిపారుదల ప్రాజెక్టుల్లో అవినీతి పేరుకుపోయిందని మంత్రి ఉత్తమ్ విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్‌ఎస్‌కు ఏటీఎంగా మారటానికి ప్రధాన కారణమే మోదీ ప్రభుత్వమని మంత్రి ఆరోపించారు. కేంద్ర సహకారంతోనే కార్పొరేషన్ల ద్వారా, అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 84 వేల కోట్ల రుణం తీసుకుందని ఆయన గుర్తు చేశారు. తమని విమర్శించే అర్హత బీజేపీకి లేదని పేర్కొన్నారు. మెడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి గల కారణాలు చెప్పాలని నిపుణుల కమిటీని కోరినట్లు తెలిపారు. వర్షాలు రాకముందే ఎలాంటి చర్యలు తీసుకోవాలి. బ్యారేజీలను మరమ్మతులు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు కమిటీతో స్పష్టం చేసినట్లు తెలిపారు. బ్యారేజీని రిపేర్ చేసి అందుబాటులోకి తీసుకురాగలిగితే రాష్ట్రానికి మంచిదేనని, వర్షాకాలంకు ముందే అందుబాటులోకి వస్తే మరీ మంచిదని మంత్రి అన్నారు. గురువారం ఉదయం ఎన్డీఎస్‌ఏ కమిటీ ఉదయం మేడిగడ్డ, అనంతరం అన్నారం,బ్యారేజిలను పరిశీలించనుందని తెలిపారు. రాత్రికి రామగుండం పర్యటించనున్నట్లు తెలిపారు. 8న సుందిళ్ల బ్యారేజీ పర్యటన ఉంటుందన్నారు. ఈఎన్సీ నాగేందర్ ఆధ్వర్యంలో అయ్యర్ కమిటీ పర్యటన ఉంటుందన్నారు. మేడిగడ్డ బ్యారేజిని నిర్మించిన ఎల్ అండ్ టీ కంపెనీ రాష్ట్రంలో అనేక వ్యాపారాలు చేస్తోందని,ఈ నిర్మాణ సంస్థకు భాధ్యత ఉండాలన్నారు. జుడిష్యల్ ఎంక్వైరీపై త్వరలోనే ముందడుగు ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

మేడిగడ్డను ఉపయోగంలోకి తెస్తాం
మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయిన ఘటనలో సాంకేతిక పరీక్షలు నిర్వహించి నిజాలు నిగ్గు తేల్చేందుకు కేంద్రజల్‌శక్తి శాఖ నియమించిన డ్యామ్‌సేఫ్టీ నిపుణుల కమిటి బుధవారం జలసౌధలో తొలిసమావేశం నిర్వహించింది. రాష్ట్ర నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించిన సంయుక్త సమావేశంలో మంత్రిఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. నిపుణుల కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌కు నీటిపారుదల శాఖ అధికారులను పరిచయం చేశారు. అనంతరం కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పధకంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ ,అన్నారం ,సుందిళ్ల బ్యారేజిలు ,వాటిలో తలెత్తిన సమస్యలను వివరించారు.

మేడిగడ్డ బ్యారేజి గత అక్టోబర్ 21న భారీ శబ్దాలతో కుంగిపోయన ప్రాంతాన్ని ప్రత్యేకంగా వివరించారు. పిల్లర్లు నిలువునా చీలిపోవటం, బ్యారేజి కుంగిపోటం ,ఎగువన ఉన్న అన్నారం , సుందిళ్ల బ్యారేజిల అడుగుబాగం నుంచి నీటి బుంగలు ఏర్పడటం తదితర అంశాలను సమగ్రంగా సచిత్రాలతో నిపుణుల కమిటీకి వివరించారు. బ్యారేజిలను క్షున్నంగా అధ్యయనం చేసి లోపాలను గుర్తించాలని కోరారు.వీటిని పునరుద్దరించేందుకు తగిన సలహాలు సూచనలతో సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కోరారు. నిపుణుల కమిటీ ఇచ్చే సలహాలు సూచనలు పాటిస్తామని తెలిపారు. మేడిగడ్డ ,అన్నారం సుందిళ్ల బ్యారేజిలను తిరిగి ఉపయోగంలోకి తచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నిపుణుల కమిటీ సభ్యులకు వివరించారు. సంయుక్త సమావేశంలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్‌తోపాటు ఈఎన్సీలు,చీఫ్ ఇంజనీర్లు , ఎస్‌ఇలు పాల్గొన్నారు.

నేడు మేడిగడ్డకు నిపుణుల బృందం
ఢిల్లీ నుంచి వచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టికమిటి నిపుణుల బృందం గురువారం మేడిగడ్డ బ్యారేజిని పరిశీలించనుంది.ఢిల్లీ నుంచి బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్న బృందం జలసౌధలో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం అనంతరం రాత్రికి హనుమకొండకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేసింది. గురువారం ఉదయం హనుమకొండ నుంచి బయలు దేరి 9గంటలకు మేడిగడ్డకు చేరుకుంటుంది. మధ్యాహ్నం రెండు గంటల వరకూ మేడిగడ్డ బ్యారేజిని పరిశీలించనుంది. అనంతరం మూడు గంటలకు అన్నారం బ్యారేజికి చేరుకుంటుంది. ఈ బ్యారేజి పరిశీలన ముగించుకుని రాత్రికి రామగుండం చేరి ఎన్టీపీసి గెస్ట్‌హౌస్‌లో విడిది చేయనుంది. శుక్రవారం ఉదయం రామగుండం నుంచి బయలు దేరి 9గంటలకు సుందిళ్ల బ్యారేజికి చేరుకుంటుంది. ఈ బ్యారేజి పరిశీలన అనంతరం తిరిగి రామగుడం చేరుకుని సాయంత్రానికి హైదరాబాద్‌కు రానుంది.శనివారం ఉదయం జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మలివిడత సమావేశం కానుంది. ఈ సమావేశం ముగిశాక నేరుగా ఢీల్లీకి వెళ్లనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News