Wednesday, August 6, 2025

న్యాయ వ్యవస్థను అవమానిస్తారా?.. హరీష్ పై మంత్రి ఉత్తమ్ ఫైర్

- Advertisement -
- Advertisement -

 నాలుగు కోట్ల ప్రజలకు క్షమాపణలు చెప్పండి
 మోసగాళ్లకు మాట్లాడే నైతిక హక్కు లేదు
 నిజం చెప్పకుండా డూప్ ప్రెజెంటేషన్ మరో సారి ఇచ్చారు
 నిజాలు నిగ్గుతేలిస్తే అది రాజకీయ కక్ష సాధింపా?
 తెలంగాణ ప్రజలను ఇంకెన్ని సార్లు మోసం చేస్తారు
 హరీష్ మాటలపై మండిపడ్డ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్: ప్రజాస్వామ్య వ్యవస్థలపై బీఆర్‌ఎస్‌కు చులకన భావం అని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. చట్టసభలు, న్యాయస్థానాలంటే కూడా గౌరవం లేదని, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదని విమర్శించారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సారధ్యంలో నియమించిన జ్యుడిషియల్ కమిషన్ అంటే కూడా లెక్కలేదని ఆరోపించారు. ప్రజలు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పినా ఇప్పటికీ వాళ్లలో మార్పు రాలేదని, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పుకోవాలనే సోయి కూడా లేకపోయిందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన ఎన్డీఎస్‌ఏ మీద నమ్మకం లేదని, మేడిగడ్డను కుంగబెట్టిన దుర్మార్గులు ఇప్పడు ఏకంగా సీనియర్ జస్టిస్ పీసి ఘోష్ ను అవమానిస్తున్నారా..? అని ప్రశ్నించారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి ఉత్తమ్ మంగళవారం బిఆర్‌ఎస్ నేత హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట గత ప్రభుత్వం ఎన్ని అవకతవకలకు పాల్పడింది..ఎన్ని అక్రమాలకు పాల్పడిందో జ్యుడిషియల్ కమిషన్ విచారణలో బయటపడిందన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు బండారం బట్టబయలైందని, అందుకే తేలు కుట్టిన దొంగల్లా హరీష్ రావు మళ్లీ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని అన్నారు. వాస్తవాలు దాచిపెట్టి ప్రజలను మభ్యపెట్టిన బీఆర్‌ఎస్ నేతల నిజస్వరూపాన్ని జ్యుడిషియల్ కమిషన్ బయటపెట్టిందని, జస్టిస్ పీసీఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాలను మాత్రమే ప్రభుత్వం వెల్లడించిందని, అది రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన రిపోర్టు కాదనే విషయాన్ని హరీష్ రావు మరిచిపోయినట్లున్నారని విమర్శించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు బదులు కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచన మొదలైనప్పటి నుంచి డిజైన్లు, నిర్మాణంలో లోపాలు, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వరకు జరిగిన అవకతవకలన్నింటిపై కమిషన్ సమగ్రంగా విచారణ జరిపిందని, ఎవరెవరు తప్పులు చేశారో, ఎవరెవరు అందుకు బాధ్యులనే వివరాలను కూడా ఈ నివేదికలో వెల్లడించిందని గుర్తు చేశారు.

తెలంగాణ ప్రజలను ఇంకెన్ని సార్లు మోసం చేస్తారు

తామేం తప్పు చేయలేదని పార్టీ ఆఫీసులో తప్పులు మాట్లాడి తెలంగాణ ప్రజలను ఇంకెన్ని సార్లు మోసం చేస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు. అప్పటి సీఎం కేసీఆర్, ఆనాడు మంత్రిగా ఉన్న హరీష్ రావును కూడా పీసీ ఘోష్ కమిషన్ విచారించిందని, వారిద్దరు స్వయంగా జ్యుడిషియల్ కమిషన్ ఎదుట హాజరయ్యారని, ఇప్పుడు పార్టీ ఆఫీసులో పెడబొబ్బలు పెడుతున్న హరీష్ రావు ఆరోజు కమిషన్ ముందు ఎందుకు ఈ వివరాలు చెప్పుకోలేదు..? అని ప్రశ్నించారు. హరీష్ అబద్ధపు సాక్ష్యాలు, బుకాయింపులన్నీ న్యాయ వ్యవస్థ ముందు అబద్ధాలుగా తేలిపోయాయన్నారు. ఆయన చేసిన తప్పులన్ని బయటపడ్డాయని, జ్యుడిషియల్ కమిషన్ విచారణలో కేసీఆర్ పాత్ర ఏమిటో, హరీష్ రావు చేసిన ఘనకార్యాలేమిటో తేలిపోయిందని, ఎవరెవరు ఏమేం తప్పులు చేశారో కూడా బయటపడిందన్నారు.

ఇప్పుడు ప్రభుత్వం ఈ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే భయం వాళ్లను వెంటాడుతోందని అన్నారు. అందుకే పార్టీ ఆఫీసుకు వచ్చి ఏకంగా జ్యుడిషియల్ కమిషన్ ను తప్పుబట్టే దుర్మార్గానికి ఒడిగట్టారని, న్యాయబద్ద కమిషన్ కు అపార్థాలు అంటగట్టే నీచానికి దిగజారటం కూడా మీకే చెల్లిందని ఎద్దేవా చేశారు. ఇంకా ఎన్నిరోజులు ఇలా తెలంగాణ ప్రజల కళ్లుగప్పి, మభ్యపెడతారని, విచారణ కమిషన్ తేల్చిన విషయాలపైనా, ఇచ్చిన నివేదికపైన అసెంబ్లీలో చర్చిస్తామని ప్రజా ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు, చట్ట సభలపై తమ ప్రభుత్వానికి గౌరవముందని, అందుకే అసెంబ్లీలో ఈ నివేదికను చర్చించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కాళేశ్వరంలో దోషులుగా తేలిన బాధ్యులు అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని కూడా ప్రభుత్వం ఆహ్వానించిందన్నారు. ఫాంహౌస్‌లో మామ డైరెక్షన్, పార్టీ ఆఫీస్ లో అల్లుడి యాక్టింగ్ ఇకనైనా ఆపాలని అన్నారు. అసెంబ్లీకి వచ్చి చేసిన తప్పులు ఒప్పుకుని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పుకోవాలన్నారు.

నిజాలు నిగ్గుతేలిస్తే అది రాజకీయ కక్ష సాధింపా

మీరు వేలకోట్ల అవినీతి చేస్తే ఒప్పు.. మేం విచారణ చేసి నిజాలు నిగ్గుతేలిస్తే అది రాజకీయ కక్ష సాధింపా.? అని ఉత్తమ్ ప్రశ్నించారు. కమిషన్ల కక్తుర్తితో ప్రజలను, రైతులను పదేళ్లపాటు మోసం చేశారని, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు హైడ్రాలజీ అనుమతులు ఇస్తే దాచిపెట్టారన్నారు. నిపుణుల కమిటీ మేడిగడ్డ వద్ద బ్యారేజీల నిర్మాణం వద్దని చెపితే తొక్కిపెట్టారని, బ్యారేజీలు ఎక్కడ కట్టాలో మీరే నిర్ణయించుకున్నారని అన్నారు. కుంగి పోయే ప్రాజెక్ట్ కట్టినందుకు సిగ్గుపడాల్సింది పోయి హరీష్ రావు కొత్త రికార్డు సృష్టించారని, అది తమ గొప్పతనం అని జనం చెవిలో పువ్వులు పెట్టె ప్రయత్నం చేశారన్నారు. ఒక్క మాట కూడా నిజం చెప్పకుండా డూప్ ప్రెజెంటేషన్ మరో సారి ఇచ్చారన్నారు.

నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్ కు ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో ఇచ్చారని, తమ ప్రభుత్వం ఒక్క రూపాయి బిల్లు కూడా ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ కు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇక్కడే కాదు..ఎక్కడైనా పనులు జరుగకుండా ఒక్క రూపాయి బిల్లు ఇవ్వకూడదని ముఖ్యమంత్రి స్పష్టమైన అదేశాలు జారీ చేశారని చెప్పారు. చివరకు కేబినేట్ ఆమోదం లేకుండానే మామ అల్లుళ్లు సంతకాలు చేసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ ప్రజలను దగా చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలను పాతరపెట్టి, ఆర్థికంగా లక్ష కోట్ల దుర్మార్గానికి ఒడిగట్టిన బీఆర్‌ఎస్ లీడర్లకు నైతికంగా మాట్లాడే హక్కు కూడా లేదని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News