Friday, May 3, 2024

ఎమ్మెల్సీ కవితకు ఏడు రోజుల కస్టడీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఏడు రోజుల కస్టడీకి అనుమతించింది.
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీ కవితను శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు శనివారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. ఎమ్మెల్సీ కవిత ప్రధాన నిందితురాలని కనీసం 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. అయితే వారం రోజుల కస్టడీకి మాత్రమే జస్టిస్ నాగపాల్ అనుమతించారు. సుదీర్ఘ వాదనల తర్వాత మార్చి 23 వరకు కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 23న తిరిగి కోర్టులో హాజరు పర్చాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి రోజు కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు, ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఆమె తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించగా, ఈడీ తరపున ఎన్.కె మట్టా, జోయబ్ హుసేన్ వాదించారు.

కవిత కేసులో ఊహించని ట్విస్ట్…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడి అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. సోదాలు అని చెప్పి ఈడీ, ఐటీ రంగంలోకి దిగడం తర్వాత సడన్‌గా అరెస్ట్ చేయడం, రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా ఈడీ కస్టడీకి ఇవ్వడం, ఈ వరుస షాకులతో సతమతమవుతున్న కవితకు మరో ట్విస్ట్ ఇచ్చింది ఈడీ. కవిత భర్త అనిల్ , కవిత పీఆర్వో రాజేష్‌తో సహా మరో ముగ్గురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం వీరంతా విచారణకు హాజరు కావాల్సిందేనని నోటీసుల్లో ఈడీ ఆదేశించింది. ఇప్పటికే ఈ ఐదుగురికి సంబంధించిన ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఎమ్మెల్సీ కవతి అరెస్టు కావడంతో ఆమె భర్త అనిల్ ఢిల్లీకి వెళ్లారు.

కీలక సమాచారం సేకరించిన ఈడీ…
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారుల్లో కవిత ఒకరని, స్కామ్‌లో కవిత కుట్రదారు, లబ్ధిదారు అని ఈడీ తేల్చేసింది. దీంతో ఈ పరిస్థితుల్లో కవిత భర్త విచారణకు వెళ్తే ఎలా ఉంటుంది? అని న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఫోన్లు సీజ్ చేసిన ఈడీ కీలక సమాచారం సేకరించిందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ వేదికగా చెల్లి కోసం న్యాయ పోరాటం చేసేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమయంలోనే కవిత భర్తకు నోటీసులు రావడంతో అనిల్‌ను వరుసగా రెండు రోజుల పాటు విచారణ చేస్తారని, తర్వాత అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవితకు సంబంధించిన కవిత కస్టడీకి సంబంధించి సంచలన విషయాలను ఈడీ విడుదల చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితనే కీలక వ్యక్తి ఆమె కుట్రదారు, లబ్ధిదారు అని ఈడీ తేల్చి చెప్పేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో ఎమ్మెల్సీ కవిత ఒప్పందం కుదుర్చుకున్నారని ఈడీ స్పష్టం చేసింది.

కస్టడీ రిపోర్టులో…
‘ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారుల్లో కవిత ఒకరని, శరత్‌చంద్రా రెడ్డి, మాగుంట రాఘవరెడ్డితో కలిసి ఆప్ నేతలకు రూ. 100 కోట్లు లంచం ఇచ్చారు. మార్జిన్ మనీని 12శాతానికి పెంచి అందులో సగం ముడుపుల రూపంలో చెల్లించారని తెలిపారు. లిక్కర్ కేసు జాప్యం చేయడానికి తప్పుడు కేసులు దాఖలు చేశారు. సమ్మన్లు జారీచేసిన తర్వాత 4 ఫోన్ల డేటాను ఫార్మాట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితనే కీలక వ్యక్తి, కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నిబంధనలు తనకు అనుకూలంగా ఉండేలా చూసుకోగలిగారు. అరుణ్ పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో కవిత వాటా పొందారు. ఢిల్లీ లిక్కర్ బిజినెస్ కోసం కవిత తనను సంప్రదించారని. కేజ్రీవాల్ తనతో చెప్పినట్లు మాగుంట స్టేట్‌మెంట్ ఇచ్చారు’ అని కస్టడీ రిపోర్టులో ఈడీ పేర్కొంది.

కోట్లు సంగతి ఇదీ…
‘కవిత టీం లిక్కర్ బిజినెస్‌లో ప్రవేశించేందుకు చూస్తున్నందున ఆమెతో కలిసి ముందుకు వెళ్లాలని కేజ్రీవాల్ సూచించినట్లు.. మాగుంట చెప్పారు. హైదరాబాద్‌లో కవితతో భేటీలో ఆప్ నేతలకు రూ.100 కోట్లు ఇవ్వాలి, వెంటనే రూ.50 కోట్లు ఇవ్వాలని కవిత చెప్పారని మాగుంట స్టేట్‌మెంట్‌లో చెప్పారు. కవిత సూచనతో రూ.25 కోట్లు రాఘవకు ఇచ్చినట్టు మాగుంట స్టేట్‌మెంట్‌లో క్లియర్ కట్‌గా చెప్పారు. రూ.25 కోట్లను అభిషేక్ బోయినపల్లి చెప్పిన అడ్రస్‌లో ఇచ్చినట్టు మాగుంట రాఘవ కూడా స్టేట్‌మెంట్ ఇచ్చారు. కవితను పిలిచి ప్రశ్నించినప్పుడు ఇండో స్పిరిట్‌లో వాటా గురించి ప్రశ్నిస్తే ఖండించారు. కానీ మాగుంట రాఘవ, బుచ్చిబాబుల మధ్య వాట్సాప్ చాట్‌లో కవిత కు 33% వాటా ఉన్నట్లుగా ఉంది. మొబైల్ ఫోన్స్ విషయంలోనూ కవిత తప్పుడు సమాచారం ఇచ్చారు. కవిత ప్రకటన రికార్డ్ చేసే సమయంలో ప్రత్యేకించి అడిగిన ప్రశ్నలకు కవిత అసంబద్ధ, రాజకీయ సమాధానాలు ఇచ్చారు. సాక్షాలను కూడా కవిత ధ్వంసం చేశారు. కవిత ఇచ్చిన మొబైల్స్‌ను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపిస్తే. పది ఫోన్లలో కనీసం నాలుగు ఫోన్లను ఈడీ సమన్లు వచ్చే ముందు ధ్వంసం చేశారు. విచారణలోనూ అసంబంద్ధ సమాధానాలు ఇవ్వడంతో అరెస్ట్ చేశాం’ అని కవిత రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News