మిస్బా, వకార్ నాపై దుష్ప్రచారం చేశారు
పాక్ పేసర్ అమిర్ ఆరోపణ
కరాచి: తాను 28 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించడానికి పాక్ జట్టు యాజమాన్యమే కారణమని ఆ జట్టు పేస్ బౌలర్ మహమ్మద్ అమిర్ ఆరోపించాడు. మూడు రోజుల క్రితమే అంతర్జాతీయ క్రికెట్కుగుడ్బై పలికిన అమిర్ తాజాగా ఓ యూ ట్యూజ్ చానల్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రధాన కోచ్ మిస్బావుల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనస్ జట్టులో తనపై తప్పుడు ప్రచారం చేశాడన్నాడు. తనకు టెస్టు క్రికెట్ ఆడడంలో ఆసక్తిలేదని, డబ్బుకోసమే టి20మ్యాచ్లు ఆడుతునాన్ననే విషప్రచారం చేశారని వాపోయాడు. ఏ ఆటగాడైనా పేరు సంపాదించడం చాలా కష్టమన్నాడు. తాను ఇలా బయటికి రావడం మంచిది కాదని, కానీ భరించలేకే ప్రజల ముందుకు వచ్చానని చెప్పాడు.
తనకు మిస్బా, యూనిస్లతో వివాదం నెలకొందని, ఈ క్రమంలోనే అసలేం జరుగుతోందనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలనుకున్నట్లు తెలిపాడు. న్యూజిలాండ్ పర్యటనకు 35 మందిలో తనను ఎంపిక చేయలేదని, ఒక వేళ తాను నిజంగా టి20లీగ్ల మీదే ఆసక్తి చూపిస్తే ఈ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదని అన్నాడు. ఒక సీనియర్ ఆటగాడిగా జట్టులో తనను కొనసాగించాలా, వద్దా అనే విషయమై స్పష్టమైన సమాచారం ఇవ్వలేకపోయారన్నాడు. తాను ఆసియా కప్, చాంపియన్స్ ట్రోఫీ, గత ఏడాది ప్రపంచకప్లోను అత్యుత్తమ ప్రదర్శన చేశానని, ఇప్పటికీ ఐసిసి ర్యాకింగ్స్లో కొనసాగుతున్నానని అమీర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతకు మించి ఏం చేయాలని ప్రశ్నించాడు. తనని జాతీయ జట్టుకు ఎంపిక చేయనప్పుడు లీగ్ మ్యాచ్లు ఆడకుండా ఏం చేయాలని ప్రశ్నించాడు. ఈ రకంగానైనా తన ప్రతిభను చాటాలనుకుంటున్నానన్నాడు.