త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నాటకమాడుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ నష్టం ఏమిటీ, ఎంత నష్టం జరుగుతుందనే వివరాలను చెప్పమంటే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద సమాధానం లేదని అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ పేరుతో డైవర్షన్ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్వింద్ మాట్లాడుతూ బీజేపీ మీద బురద చల్లేందుకే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టుకు కేసీఆర్ హయాంలోనే అనుమతులు లభించాయని, అప్పట్లో జగన్, కేసీఆర్ కలిసి తీసుకున్న నిర్ణయమని చెప్పారు.
ఇప్పుడు కాంగ్రెస్ ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. అసలు తెలంగాణకు ఎంత నీరు కావాలో మంత్రి ఉత్తమ్కే అవగాహన లేదని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి ఎలా ఉందంటే సగం కాంగ్రెస్, సగం బీఆర్ఎస్ వ్యక్తిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి దర్శకత్వంలోనే తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకు ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ వంటి కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు ఈ వివాదాన్ని తెరపైకి తెస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ ప్రాజెక్టు సముద్రంలో వృథాగా పోయే 3,000 టీఎంసీ గోదావరి నీటిలో కేవలం 200 టీఎంసీ నీటిని రాయలసీమకు తరలించడానికి ఉద్దేశించిందని, ఇది తెలంగాణ హక్కులకు హాని కలిగించదని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోందని, దిగువ రాష్ట్రంగా తమ హక్కులను వినియోగించుకుంటోందని అరవింద్ స్పష్టం చేశారు.
‘సిట్’ నుంచి నాకెలాంటి పిలుపు రాలేదు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అర్వింద్ మాట్లాడుతూ తనను సిట్ విచారణకు పిలిచినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. తనకెలాంటి నోటీసులు అందలేదని అన్నారు. టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఫోన్ను అసలు ఎందుకు ట్యాపింగ్ చేశారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. మహేశ్ కుమార్ గౌడ్ ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారో ఆయనే చెప్పాలంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి సారించాలని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు. బిజెపి రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన బీజేపీ భరోసా కార్యక్రమం ద్వారా ఎన్నో వినతిపత్రాలు స్వీకరించామని అర్వింద్ తెలిపారు. ముఖ్యంగా చాలా మంది దివ్యాంగులు వచ్చి వారి సమస్యలను తమతో పంచుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారికిచ్చిన హామీలను కూడా నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. దీనివల్ల ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దెబ్బతిందని పేర్కొన్నారు.