Sunday, April 28, 2024

బుల్‌డోజర్‌తో కూల్చడం ఫ్యాషన్‌గా మారింది : మధ్యప్రదేశ్ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

భోపాల్ : క్రిమినల్ కేసులు నమోదైన వారి ఇళ్లు, ఆస్తులను బుల్డోజర్‌తో పడగొట్టించడం పై మధ్య ప్రదేశ్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి విధి విధానాలు లేకుండా చర్యలు తీసుకోవడం పురపాలక అధికారులకు ఫ్యాషన్‌గా మారిందని వ్యాఖ్యానించింది. ఓ కేసుకు సంబంధించి నిందితుడి భార్య హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన రాహుల్ లంగ్రి అనే వ్యక్తి ఓ ఆస్తి వివాదంలో ఒక వ్యక్తిని బెదిరించి దాడి చేశాడు. దీంతో ఆ బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో రాహుల్ అరెస్ట్ అయ్యాడు. తరువాత పురపాలక అధికారులు , పోలీస్‌లు కలిసి రాహుల్ కు చెందిన రెండు అంతస్తుల భవనాన్ని కూలగొట్టారు. దీనిపై రాహుల్ భార్య రాథ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. భవనాన్ని కూల్చే ముందు దాని మాజీ యజమాని రైసాబీ పేరిట అధికారులు నోటీస్‌లు జారీ చేశారని ఆమె ఆరోపించారు.

తమ గృహం అక్రమ నిర్మాణం కాదని వాదించారు. ఆ ఇళ్లు హౌసింగ్ బోర్డులోనమోదైందని, బ్యాంకు రుణం కూడా పొందామని పేర్కొన్నారు. ఈ కేసుపై విచారణ తరువాత జస్టిస్ వివేక్ రుసియా తీర్పు వెలువరించారు. ఇంటిని కూల్చి వేయడాన్ని తప్పు పట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లను కూల్చడం , ఆ తర్వాత వాటిని పేపర్లో పబ్లిష్ చేయించుకోవడం ఫ్యాషన్‌గా మారిందని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆ ఇంటిని కూల్చే బదులు రెగ్యులరైజ్ చేయించుకోవాల్సిందిగా సూచించాలని అభిప్రాయ పడ్డారు. అన్ని అవకాశాలు ఇచ్చాక ఆఖరి అవకాశంగా కూల్చివేతను ఎంచుకోవాలని సూచించారు. రాథకు రూ. లక్ష, ఆమె అత్త విమలా గుర్జర్‌కు మరో లక్ష పరిహారం కింద ఇవ్వాలని ఆదేశించారు. ఇంటిని కూల్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని తీర్పులో పేర్కొన్నారు. మరోవైపు ఈ తీర్పులో తమకు మంజూరు చేసిన పరిహారంపై బాధిత మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై అప్పీలు చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News