ధర్మపురి: దక్షిణ కాశిగా ఖ్యాతి గాంచిన ధర్మపురి క్షేత్రంలో ముక్కోటి ఏకదశి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్బంగా సోమవారం ఉదయం 2:30 గంటలకు శ్రీలక్ష్మిసమేత ఉగ్రలనరసింహస్వామి, శ్రీవేంకటేశ్వరస్వామి వారల మూల విరాట్లకు మహాక్షీరాభిషేకం నిర్వహించారు. ఉదయం 4ః00 గంటలకు వైకుంఠ ద్వారము వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్పవేదికపై ఆసీనులైన మువ్వురు స్వాములకు ప్రత్యేక పూజలు, సహస్రనామార్చనలు నివేదనలు, సప్తహారతులు సమర్పించారు.
అనంతరం ఉదయం 5:00 గంటలకు మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోఛ్చారణల మద్య ధర్మపురి పీఠాధిపతి శ్రీమత్ పరమ హంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి, శ్రీశ్రీశ్రీ సద్గురు విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ల కరకమలముచే వైకుంఠ ద్వారా దర్శనపూజ నిర్వహించి వైకుంఠద్వారాన్ని తెరిచారు. అనంతరం స్వామి వారల దర్శనానికి భక్తులను అనుమతించారు. ఈ సందర్బంగా నిర్వహించిన ఒగ్గు డోలు కళాకారుల నృత్యాలు, మహిళల కోలాటాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ముక్కోటి వేడుకలో పాల్గొన్న మంత్రి ఈశ్వర్
ముక్కోటి ఏకాదశి వేడుకలో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. పెద్దపెల్లి ఎంపి వెంకటేష్నేత, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ వసంత, జగిత్యాల కలెక్టర్ డాక్టర్ శరత్లు వేడుకకు హాజరై వైకుంఠ ద్వారం గుండా స్వామి వారలను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారికి ఆలయ వేద పండితులు ఆశిర్వచన పూజలు జరిపి స్వామి వారి లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటరమణ, ఎఎస్పీ దక్షిణమూర్తి, దేవస్థాన ఈఓ శ్రీనివాస్, ధర్మపురి ఎంపిపి ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటిసి బత్తిని అరుణ, వైస్ ఎంపిపి గడ్డం మహిపాల్రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ అయ్యోరి రాజేష్లతో పాటు వివిద స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.