హైదరాబాద్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ సంవత్సరం హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 4779 అదనపు బస్సులు నడపుతున్నామని వీటికి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని రంగారెడ్డి రిజినల్ మేనేజర్ బి.వర ప్రసాద్ ట్రాఫిక్
డిసిపి వరప్రసాద్కు విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా రాచకొండ ట్రాఫిక్ డిసిపి దివ్యచరణ్తో ఆయన ఉప్పల్లోని డిసిపి ఆఫీసులో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ట్రాఫిక్లో ప్రయాణికులకు ఎటువంటి అవాంతరాలు కలగకుండా చూడాలని కోరారు. అనంతరం డిసిపి దివ్యచరణ్ మాట్లాడుతూ ఈ నెల 10 నుంచి 13 వరకు అదనపు బస్సులు ఆర్టిసి అధికారులు అదనపు బస్సులను నడుపుతున్న దృష్టా ఎల్బి నగర్ స్పెన్సర్ సమీపంలోని ఖాళీస్థలంలో ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేస్తామని, అక్కడ ఉన్న ప్రైవేట్ వాహనాలను ఇతర ప్రాంతానికి తరలిస్తామని చెప్పారు.
లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఆర్టీసీ, ట్రాఫిక్ విభాగం సమన్వయంతో పని చేసి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామంటున్నారు. ఉప్పల్ పాయింట్లో బస్లు సర్వే పార్క్ వద్ద పార్క్ చేయాలని, బస్సులను ఒకే లైన్లో నిలపడం ద్వారా ట్రాఫిక్ జామ్లు లేకుండా చూడవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు డీసిపి జి.మనోహర్, ఏసీపి.మధుసూదన్, ఇన్స్పెక్టర్ బాబయ్య నాయక్, ప్రదీప్, విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.