Tuesday, May 14, 2024

మున్నూరుకాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు తథ్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గతంతో పోల్చిన పక్షంలో కెసిఆర్ ప్రభుత్వంలో మున్నూరుకాపులకు గౌరవప్రదమైన పదవులు లభించాయని, ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు కూడా తథ్యమని రాజ్యసభ సభ్యులు రవిచంద్ర అన్నారు. మున్నూరుకాపు సంఘం 33 జిల్లా శాఖల అధ్యక్షులతో కొండా దేవయ్య ఆధ్వర్యంలో రవిచంద్ర నివాసంలో ఆదివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం గౌరవాధ్యక్షులు, ఎంపి రవిచంద్ర మాట్లాడుతూ, మున్నూరుకాపులకు సిఎం కెసిఆర్ సముచిత గౌరవం ఇచ్చారు…ఇస్తున్నారని చెప్పారు. ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు గతంలోనే సిఎం సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. తాను,మంత్రి గంగుల కమలాకర్,ఎంపి కేశవరావుల ఆధ్వర్యంలో మున్నూరుకాపు ప్రజాప్రతినిధులను వెంట తీసుకుని త్వరలోనే సిఎం కెసిఆర్ కలుస్తామని తెలిపారు.

కార్పోరేషన్ ఏర్పాటుతో పాటు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాల్సిందిగా, మున్నూరుకాపు ప్రముఖులు పలువురికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో కొండా దేవయ్య అధ్యక్షోపన్యాసం చేయగా, సంఘం ప్రముఖులు చల్లా హరిశంకర్,మరికల్ పోత సుధీర్ కుమార్,ఆకుల గాంధీ,పారా నాగేశ్వరరావు,ఊసా రఘు, వద్దిరాజు దేవేందర్, జిల్లా శాఖల అధ్యక్షులు వాసుదేవుల వెంకటనర్సయ్య,బాదినేని రాజేందర్,ఆర్వీ మహేందర్,ప్రకాష్ రావు, నాయకులు జెన్నాయికోడే జగన్మోహన్, హరీష్,వాసాల వెంకటేష్,మురళి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు, కొండా దేవయ్యలు సంఘం జిల్లా శాఖల అధ్యక్షులను శాలువాలతో సత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News