Sunday, April 28, 2024

జమిలిగా ‘జై’ కిసాన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి జమిలి పోరాటాలు సాగించడం ద్వారా మాత్రమే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యలకు పరిష్కారం సాధ్యమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుసరించిన జమిలి పంథానే దేశ రైతాంగ సమస్యల పరిష్కారానికి అనుసరించడం ద్వారానే గమ్యాన్ని చేరుకోగలమని స్ప ష్టం చేశారు. తెలంగాణ వ్యతిరేకులతో నాడు ‘జై తెలంగాణ’ నినాదాన్ని అనిపించినట్టే.. నేడు రైతు వ్యతిరేకులతో ‘జై కిసాన్ నినాదాన్ని పలికించాలన్నారు. ఆ దిశగా దేశంలోని రైతు నేతలంతా ఐక్య సంఘటన కట్టి, ప్రతినబూనాల్సిన అవసరం ఉన్నదని సిఎం అన్నారు. ఈ దేశ రైతుకు వ్యవసాయం ఒక జీవన విధానం అని, రైతు బాగుంటేనే వ్యవసాయం బాగుంటదని, వ్యవసాయం బాగుంటేనే సమాజం బాగు పడతదని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో రైతు మర్యాదను నిలబెట్టి, ఆత్మ గౌరవం కాపాడేందుకు కలిసి పనిచేద్దామని జాతీయ రైతు నేతలకు సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం నాడు జాతీయ సంఘాల నేతలతో ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన రెండోరోజు సమావేశం జరిగింది. జాతీయ స్థాయిలో రైతుల ఐక్య వేదిక ఏర్పాటు చేయాలని శనివారం నాటి తీర్మానాన్ని అనుసరించి చర్చ కొనసాగింది. జరిగిన ఈ సమావేశంలోనూ రైతు అంశాలపై ప్రధానంగా చర్చించారు. రైతుల పట్ల, వ్యవసాయ రంగం పట్ల కేంద్రంలోని బిజెపి సర్కార్ అనుసరిస్తున్న వైఖరిని సిఎం కెసిఆర్ తీవ్రస్థాయిలో గర్హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వజ్రోత్సవ భారతంలోనూ అపరిష్కృత రైతాంగ సమస్యలెన్నో ఉన్నాయన్నారు. దేశంలో దశాబ్దాల కాలం నుంచీ రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ సమస్యలకు వజ్రోత్సవ స్వతంత్ర భారతంలో ఇంకా పరిష్కారాలు దొరకకపోవడం దురదృష్ణకరమన్నారు. దేశాన్నేలుతున్న కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక అసంబద్ద విధానాలను తిప్పికొట్టి వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామన్నారు.

ఐక్యం చేసే బాధ్యత కెసిఆర్‌కు అప్పగింత

కేంద్రం అనుసరించిన వ్యవసాయ విధానాలను వ్యతిరేకంగా రైతుల పక్షాన జాతీయ రైతుల సంఘం నేతలంతా ఏకమై కేంద్రంపై పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో దేశ రైతాంగాన్ని గ్రామస్థాయి నుంచి ఐక్యం చేసేందుకు నాయకత్వం వహించాలని సిఎం కెసిఆర్‌ను సమావేశం ముక్తకంఠంతో కోరుతూ తీర్మానించింది. త్వ రలో మరో సమావేశం ఏర్పాటు చేసి, విధి విధానాలను రూపొందించాలని సమావేశం తీర్మానించింది. వ్యవసాయ రంగ సమస్యలు – పరిష్కారాలపై సుదీర్ఘ చర్చ ఈ సమావేశంలో జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాల వల్ల భవిష్యత్ దేశీయ వ్యవసాయ రంగం కునారిల్లిపోనున్న ప్రమాదకర పరిస్థితుల్లో ఈ సమస్యలకు కారణాలు, వాటి పరిష్కార మార్గాలపై సుదీర్ఘ చర్చ జరిగింది.

ఈ సందర్భంగా పలు రాష్ట్రాలకు చెందిన జాతీయ రైతు సంఘాల నేతలు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. స్వాతంత్య్ర కాలం నుంచి నేటి వరకూ దేశంలో జరిగిన రైతాంగ పోరాటాలను, అందుకు నాయకత్వం వహించిన నేతలు, వారు అవలంభించిన విధానాలు, పోరాట రూపాలను చర్చించారు. నాటి వ్యవసాయ పరిస్థితులకు, మారిన నేటి పరిస్థితులకు అవలంభించాల్సిన ఉద్యమ కార్యాచరణ విధి విధానాలను, పోరాట రూపాల బ్లూ ప్రింట్ ను తయారు చేసి దేశ రైతాంగాన్ని సంఘటితం చేసే దిశగా చర్యలు ప్రారంభించాలని, అందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్దం చేయాలని సిఎం కెసిఆర్‌ను కోరుతూ సమావేశంలో సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

జట్టుకట్టి, పట్టు పడితే.. సాధించలేనిది ఏమీ లేదు.

వ్యవసాయం ఈ దేశ ప్రజల జీవన విధానమని, వ్యవసాయాన్ని ఈ దేశం నుంచి ఎవరూ వేరు చేయలేరని కెసిఆర్ అన్నారు. రైతన్నలో గొప్ప శక్తి దాగి ఉంటుందన్నారు. దాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మన సమస్యలకు పరిష్కారాన్ని మనమే అన్వేషించాలన్నారు.. జట్టు కట్టి పట్టు పడితే సాధించలేనిది ఏమీ లేదన్నారు. ఇది తాను స్వయంగా ప్రారంభించిన తెలంగాణ ఉద్యమం, లక్ష్యాన్ని సాధించి రుజువు చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తనకంటే ముందు తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు జరిగాయన్నారు. కానీ నిర్దిష్ట పరిస్థితులకు అనుసరించాల్సిన నిర్దిష్ట కార్యాచరణ కొరవడటంతో ఆనాడు లక్ష్యం నెరవేరలేదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు పలు రంగాలకు చెందిన మేధావులతో కొన్ని వేల గంటల మేధో మధనం చేశానని వివరించారు. తెలంగాణ పోరాటాలు విఫలం చెందడానికి కారణాలను అన్వేషించానని పేర్కొన్నారు. ఆఖరి పోరాటం ఆగం కాకూడదనే దృఢ సంకల్పంతో, మొహమాటాలకు, బేషజాలకు తావు లేకుండా అటు రాజకీయ పంథాకు,ఇటు ఉద్యమ పంథాను సమన్వయం చేసుకుంటూ జమిలి పోరాటాలతో ముందుకు సాగాలనే తుది నిర్ణయం తీసుకోవడం ద్వారా గమ్యాన్ని ముద్దాడినమని అని సిఎం స్పష్టం చేశారు.

శాంతియుత పంథాలో పార్లమెంటరీ పోరాటం చేద్దాం

ఆనాడు తెలంగాణ ప్రజలను ఇంటింటికీ ఒక యువకుడిని పంపమని అడిగానని సిఎం కెసిఆర్ తెలిపారు. ఓటు వేయడం ద్వారా తమ శక్తిని చాటే పార్లమెంటరీ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చానని అన్నారు. వివిధ ఉద్యమ రూపాల ద్వారా ప్రజలను చైతన్య పరిచామన్నారు. ఓటు అనే ఆయుధాన్ని ప్రజా ఆకాంక్షలకు ప్రతిరూపంగా మార్చి లక్ష్యాన్ని చేరుకోగలిగామన్నారు. రాజకీయాలతో అయితదా? అని తనను అడిగారన్నారు. కానీ వారి అనుమానాలను పటా పంచలు చేస్తూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిజం చేసి చూపించానని సిఎం అన్నారు. రాజకీయ నిర్ణయాల ద్వారానే ప్రజా జీవితాలు ప్రభావితమవుతాయని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకు అసెంబ్లీలు, పార్లమెంటులే వేదికలన్నారు. కేవలం ఉద్యమాలు, ఆందోళనల పేరుతో చట్టసభలకు దూరంగా జరిగే పోరాటాలు సఫలీకృతం అయిన చరిత్ర స్వతంత్ర భారతంలో కనిపించదన్నారు. ఆయా సందర్భాలను బట్టి, నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట కార్యాచరణను అనుసరిస్తూ, అవసరమైన చోట ఉద్యమ పంథాను కూడా కొనసాగిస్తూ సాగే ప్రజాస్వామిక పార్లమెంటరీ పంథా ద్వారా మాత్రమే ప్రజాస్వామిక దేశాల్లో ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందన్నారు. ఇందుకు తెలంగాణ రాష్ట్ర సాధనే నిదర్శనమని సిఎం పునరుద్ఘాటించారు.

నామోషి అని భావించడం తప్పు

రాజకీయాలు చేయడం అంటే నామోషీ అని భావించడం తప్పు అని కెసిఆర్ అన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతులు చట్టసభల్లోకి ఎందుకు వెళ్లకూడదు? అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో రైతు నేతలు భాగస్వాములు కావాలన్నారు. రాజకీయాలంటే అయోమయం అవసరం లేదని, మొహమాటాల నుంచి రైతు నేతలు బయటపడి రాజకీయాలనే పవిత్ర యజ్ఞంలో భాగస్వాములై, దేశ రైతాంగ సమస్యల పరిష్కారానికి పాటుపడాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. ఎక్కడ ఆందోళన అవసరమైతదో అక్కడ ఆందోళన చేద్దామన్నారు. అలాగే – ఎక్కడ రాజకీయాలు అవసరమైతయో అక్కడ రాజకీయాలు చేద్దామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులన్నారు. మన శక్తిని మనం గుర్తించడంలో వెనుకబడి ఉన్నామన్నారు. రాజకీయాల్లో ఉండటం అపవిత్రం అనుకోవడం సరికాదు అని సిఎం అన్నారు.

జాతీయస్థాయిలో ఐక్య సంఘటనను నిర్మిద్దాం

రైతు సంఘాల నాయకులందరూ మీమీ ప్రాంతాలకు చేరుకొని, మనం తీసుకున్న నిర్ణయాలను, అంశాలను మీ సంఘాల నేతలు, రైతులతో చర్చించాలని సిఎం సూచించారు. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోండన్నారు. మరికొద్ది రోజుల్లో మరోసారి సమావేశమవుదామన్నారు. జాతీయస్థాయిలో ఐక్య సంఘటనను నిర్మిద్దామన్నారు. దేశవ్యాప్తంగా గ్రామగ్రామానికి చేరుకునేలా రైతుల ఐక్యత చాటుదామన్నారు. దేశం నలుమూలల నుంచి రైతుల డిమాండ్లను విందామన్నారు. ఈ నేపథ్యంలో జాతీయస్థాయిలో వ్యవసాయ రంగానికి చెందిన శాస్త్రవేత్తలను, ఆర్థికవేత్తలను, పలు రంగాలకు చెందిన మేధావులను, జర్నలిస్టులను పిలిచి వారందరితో లోతైన చర్చలు, విశ్లేషణలు చేద్దామన్నారు. ఆ సమావేశంలో దేశ రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని సమస్యల నుంచి కాపాడుకునేందుకు అనుసరించాల్సిన విధి విధానాలను, కార్యాచరణ బ్లూ ప్రింట్ ను సిద్ధం చేసుకుందామని సిఎం కెసిఆర్ సూచించారు. రాష్ట్ర, జిల్లా, తాలూకా, గ్రామస్థాయిలో ఫెడరల్ స్ఫూర్తితో సంఘ నిర్మాణాలు చేద్దామన్నారు. రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిద్దామని, అలాగే తెలంగాణ సాధన కోసం సాగిన భావజాల వ్యాప్తిలాగా, రైతుల సమస్యల పరిష్కార సాధన కోసం కావాల్సిన భావజాలాన్ని దేశంలోని అన్ని గ్రామాల్లో వ్యాప్తి చేద్దామని అన్నారు.

మీ మార్గంలోనే నడుస్తాం…

పంజాబ్, ఉత్తర ప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన సీనియర్ రైతులు మాట్లాడుతూ “మనం ఇన్నాళ్లూ రైతు సమస్యల పరిష్కారానికి కేవలం ఆందోళనలు, ఉద్యమాలే శరణ్యం అనుకొని మన జీవితాలను మార్చే రాజకీయాలను విస్మరించామన్నారు. ఇక నుంచి మీరు ( కెసిఆర్) అనుసరించిన మార్గంలోనే కలిసి నడుస్తామన్నారు. ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి, దేశ రైతాంగ సమస్యలకు పరిష్కారాలను సాధించుకుందామని దేశ రైతాంగానికి వారు పిలుపునిచ్చారు.

దేశ రైతు ఒక్క ఎకరం భూమి కూడా కోల్పోవద్దు

నూతన వ్యవసాయ చట్టాల పేరుతో, కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టి, రవాణా చార్జీలను పెంచి, ధాన్యం కొనుగోళ్లను నిలిపివేస్తూ, రైతు పంటల ఎగుమతులు, దిగుమతుల్లో అసంబద్ధ విధానాలను అవలంభిస్తూ, కేంద్ర ప్రభుత్వం అత్యంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నదని సమావేశం అభిప్రాయపడింది. వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి, సన్నకారు రైతుల నోళ్లు కొట్టి, కార్పొరేట్ గద్దలకు దేశీ వ్యవసాయ రంగాన్ని అప్పజెప్పేందుకు కుట్ర జరుగుతున్నదని….. దీన్ని తిప్పికొట్టాలని, ఒక్క ఎకరం కూడా దేశ రైతు తన భూమిని కోల్పోకుండా కాపాడుకుంటామని సమావేశం తీర్మానం చేసింది. రైతు పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని నమ్మబలుకుతూ.. మండీలను ఖతం చేయాలనే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టి, దేశ ప్రధాని నరేంద్ర మోడీతో స్వయంగా క్షమాపణలు చెప్పించిన ఘనత భారత దేశ రైతాంగానికి చెందుతుందని పంజాబ్ కు చెందిన సీనియర్ రైతులు ఈ సందర్భంగా అభిప్రాయ పడ్డారు.

తెలంగాణ రైతు పథకాలు దేశమంతటా రావాలి

దళిత బంధు సహా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు తదితర వ్యవసాయ అభివృద్ధి, రైతాంగ సంక్షేమ కార్యక్రమాలు కేంద్రంలోని పాలకుల్లో భయాన్ని సృష్టిస్తున్నాయని, కానీ వీటిని దేశవ్యాప్తంగా అమలు పరచడం అనేది చిత్తశుద్ధి ఉంటే సాధ్యమయ్యేదేనని వివిధ రాష్ట్రాల రైతు సంఘాల నాయకులు అభిప్రాయ పడ్డారు.

కెసిఆర్ దార్శనికతతోనే ప్రశాంతంగా రాష్ట్రం

సిఎం కెసిఆర్ దార్శనికత, కృషి వల్లనే శాంతి ఫరిఢవిల్లుతున్నదని, ఇటీవల పెచ్చరిల్లుతున్న మత విద్వేషాల ప్రభావం తెలంగాణ పైన, హైదరాబాద్ పైన పడలేదనే విషయాన్ని తాము గ్రహించామని, ఇది నిజంగా బీజేపీ మతతత్వ శక్తులకు సరైన గుణపాఠంగా నిలిచిందని సమావేశంలో పాల్గొన్న రైతులు స్పష్టం చేశారు. అనంతరం జాతీయ రైతు సంఘాల నేతలను సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా శాలువాలతో సత్కరించారు. ఈ సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపి దీవకొండ దామోదర్ రావు, ఎంఎల్‌సి సిరికొండ మధుసూదనాచారి, శాసనసభ్యులు ఎ.జీవన్ రెడ్డి, బాల్క సుమన్, టిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, సిఎం కార్యదర్శి భూపాల్ రెడ్డితోపాటు దేశంలోని 26 రాష్ట్రాలకు చెందిన 100 మంది రైతులు పాల్గొన్నారు. కాగా, మూడు రోజులపాటు తెలంగాణలో సాగిన ‘జాతీయ రైతు సంఘాల నేతల పర్యటన’ ఆదివారం నాటితో ముగిసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News