Thursday, May 2, 2024

ప్రకృతి పరిరక్షణ అభినందనీయం : కైలాష్ సత్యార్ధి

- Advertisement -
- Advertisement -

ఐఐఐటి క్యాంపస్‌లో మొక్కలు నాటిన కైలాష్ సత్యార్థి, ఎంపి సంతోష్‌కుమార్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలను నాటిన ప్రముఖులు

హైదరాబాద్ : ప్రకృతి పరిరక్షణ కోసం, భవిష్యత్ తరాల బాగు కోసం యువ పార్లమెంటేరియన్ పనిచేయడం చాలా గొప్ప విషయం అని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్ధి అన్నారు. బచ్‌పన్ బచావో ఆందోళన్ వంటి సంస్థలను స్థాపించి వేలాదిమందికి విద్యానందించడంతో పాటు.. దేశంలో బాలల హక్కుల కోసం నిరంతరంగా కృషిచేస్తూ.. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న కైలాష్ సత్యార్థి శనివారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్‌లో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ప్రకృతి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తీసుకువచ్చిన వృక్షవేదం హరితహారం పుస్తకాలను కైలాస్ సత్యార్ధికి ఎంపి సంతోష్‌కుమార్ అందజేసి సత్కరించారు. అనంతరం కైలాష్ సత్యార్థి మాట్లాడుతూ.. పచ్చని ప్రపంచం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిర్విరామంగా కృషిచేస్తున్నారు. ఈ దేశంలో ఒక యువ పార్లమెంటేరియన్ ఈ విధంగా ప్రకృతి పరిక్షణ కోసం, భవిష్యత్ తరాల బాగుకోసం పనిచేయడం చాలా గొప్ప విషయం అన్నారు.

ఈ నేలను, సమాజాన్ని ప్రేమించే వ్యక్తులు నాయకులుగా మారితే ప్రపంచం సుఖ సంతోషాలతో ఉంటుందని.. ఆ కోవలో ప్రథముడు జోగినిపల్లి అంటూ సంతోష్ కుమార్ పై ప్రశంసలు కురిపించారు. అనంతరం జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 6.0 ప్రారంభంలోనే కైలాష్ సత్యార్థి లాంటి గొప్ప వ్యక్తి పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హక్కుల ఉద్యమకారులందరికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేరువవుతుందన్నారు. కార్యక్రమంలో ఐఐఐటి విద్యార్ధులతో పాటుగా.. డైరెక్టర్ ప్రొఫెసర్ పిజె నారాయణన్, గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్ మెంబర్స్ రాఘవ, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మొక్కలను నాటిన జడ్పీ చైర్‌పర్సన్
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదినం సందర్భంగా శనివారం జడ్పీ ఛైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి మొక్కలను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆమె మొక్కలను నాటారు. కార్యక్రమంలో జడ్పీటిసిలు కత్తెరపాక ఉమ కొండయ్య, గట్ల మినయ్య, జిల్లాపరిషత్ సిఈఓ గౌతమ్ రెడ్డి, డిప్యుటీ సిఈఓ గీత, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మొక్కలు నాటిన నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి
ఎంపి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సమీకృత జిల్లా సముదాయ కార్యాలయంలో మొక్కలను శనివారం నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి నాటారు. అనంతరం ఆదిలాబాద్ కలెక్టర్, మంచిర్యాల కలెక్టర్, పెద్దపల్లి కలెక్టర్ ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను కలెక్టర్ వరుణ్ రెడ్డి విసిరారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టరేట్ సిబ్బంది, జిల్లా అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News