Saturday, April 20, 2024

రాజన్న బిడ్డవైతే మునుగోడులో పోటీ చేయాలి: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Nirajanjan Reddy comments on YS Sharmila

హైదరాబాద్: 10 లక్షల మందికి కొత్త ఫించన్లు ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఊర్లో ఎవరయినా చస్తే తప్ప ఫించను రాని పాలన నుంచి బతికున్న మనుషులకు ఫించన్లు ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. పాలన రాదన్న స్థితి నుంచి దేశ పాలనకు దిక్సూచిలా నిలిచామని ప్రశంసించారు. గోపాల్ పేట మండల కేంద్రంలో 16 గ్రామపంచాయతీలకు చెందిన 1331 మందికి నూతన అసరా ఫించను లబ్దిదారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి  గుర్తింపుకార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో కొందరు అహంకారంతో పాదయాత్రలు చేస్తున్నారని,  అడ్డగోలుగా దోచుకున్న అక్రమ సొమ్ముతో కిరాయికి పూలు చల్లించుకుంటున్నారని దుయ్యబట్టారు. కిరాయి మనుషులతో కిరాయి యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ నాయకత్వంలో 80 లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్లిచ్చి 50 లక్షల మందికి ఫించన్లు ఇచ్చుకుంటున్నామని, తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక దేశంలోని కొన్ని శక్తులు తెలంగాణ మీదకు కొందరిని ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. 22 ఏండ్లుగా తెలంగాణ జెండా పట్టుకుని ప్రజల మధ్యన ప్రజల ఆకాంక్ష కోసం కొట్లాడిన ఉద్యమకారులం తాము అని తెలిపారు.

వైఎస్ ఆదాయపు పన్ను కట్టకముందే న్యాయవాదిగా తాను ఆదాయపు పన్ను కట్టిన వ్యక్తిని అని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. వనపర్తి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు తీసుకరావడంతో పాటు ప్రతీ ఎకరాకు నీళ్లు పారించిన వ్యక్తిని తాను అని, రక్తపు కూడు తిని పెరిగిన చరిత్ర వైఎస్ కుటుంబానిదని, రాజన్న బిడ్డవైతే రేపు మునుగోడులో పోటీ చేసి సత్తా ఏంటో చూపించాలని నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడే తన బిడ్డలను విదేశాల్లో చదివించానని, తెలంగాణ గడ్డ మీద అహంకారంతో యాత్ర చేస్తూ తెలంగాణ వారిని దూషిస్తున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తి పరిధిలో ఉన్న పొలికెపాడు గ్రామవాసి అచ్చంపేట దళిత ఎమ్మెల్యే గువ్వల బాలరాజును అవహేళన చేసింది ఎవరు అని ప్రశ్నించారు.

గువ్వల బాలరాజు అచ్చంపేట ఎమ్మెల్యే ఆయన అక్కడ అభివృద్ధి చేస్తున్నారని, తాము ఇక్కడ అభివృద్ధి చేశామని, పొలికెపాడు గ్రామానికి సాగునీరు తెస్తే ఒకే ఒక్క యాసంగిలో 20 కోట్ల రూపాయల పంట పండించామని గుర్తు చేశారు. అక్రమాస్తుల అహంకారంతో వ్యక్తిగతంగా దూషిస్తే ఊరుకోమని, ఒక్కమాటకు వందమాటలు అంటామని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. అహంకారంతో మాట్లాడితే ఆత్మవిశ్వాసంతో చీల్చి చెండాడుతామన్నారు. ఎక్కువ మంది పేదలకు లబ్ది జరగాలనే 57 ఏండ్లకు ఫించన్లు ఇస్తున్నామని, అర్హులయిన అందరికీ ఫించన్లు ఇస్తామని స్పష్టం చేశారు.

ఒక్క గోపాల్ పేట మండలంలోనే నెలకు రూ.కోటి 16 లక్షల 64 వేల విలువగల ఫిన్షన్లు ఇస్తున్నామని, రాష్ట్రంలో 65 లక్షల మందికి ఏటా రెండుసార్లు రైతుబంధు ఇస్తామని, 92.5 శాతం మంది భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులకు ఒక్క కారుకు రూ.7 వేల కోట్ల నిధులు ఇస్తున్నామని, గత రెండేళ్లుగా కరోనా మూలంగా ప్రపంచమే స్థంభించిపోయిందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న అభివృద్ధి పనులను ఆపలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News