Thursday, May 2, 2024

ఎవరితోనూ పొత్తులు ఉండవు : అమిత్ షా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తులు ఉండబోవని రాష్ట్ర బిజెపి ముఖ్యనేతలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఖమ్మంలో ఆదివారం ‘రైతు గోస..- బిజెపి భరోసా’ బహిరంగ సభ తర్వాత.. సభా వేదిక వద్ద రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ సభ్యులతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్, ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్ జావదేకర్‌తో పాటు దాదాపు 20 మంది ముఖ్యనేతలు పాల్గొన్నారు. అరగంట పాటు కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఎన్నికల సన్నద్ధతపై కీలక సందేశాన్ని ముఖ్య నేతలకు అమిత్ షా ఇచ్చినట్లు తెలిసింది. తమిళనాడులో డిఎంకె, కేరళలో కమ్యూనిస్టులతో దూరం ఉన్నట్లే.. తెలంగాణలో బిఆర్‌ఎస్‌తో బిజెపికి ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసినట్లు సమాచారం.

రాష్ట్ర నేతలకు పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో పార్టీ ప్రస్తుత పరిస్థితి, బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల కార్యాచరణపై ముఖ్య నాయకుల అభిప్రాయాలను అమిత్ షా తీసుకున్నట్లు సమాచారం. బిఆర్‌ఎస్ సర్కారును ఓడించడమే లక్ష్యంగా అంతా కలిసికట్టుగా పని చేయాలని రాష్ట్ర ముఖ్యనేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరింత దూకుడుగా ఎన్నికల కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను ఓడించేలా ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బిజెపి మాత్రమే అన్న నినాదం ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని నేతలకు గుర్తుచేశారు.
అమిత్ షా సమక్షంలో చేరిన పలువురు ప్రముఖులు..
ఖమ్మంలో జరిగిన బహిరంగ సభ వేదికంగా హాంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బిజెపిలో పలువురు ప్రముఖులు చేరారు. వారిలో మాజీ విశ్రాంత ఐఎఎస్ అధికారి రామచంద్రుడు, డాక్టర్ కాళీప్రసాద్ (పరకాల నియోజకవర్గం), డాక్టర్ రఘునందన్ (మంచిర్యాల నియోజకవర్గం), గడ్డం సాయి కిరణ్ -(ఉప్పల్ నియోజకవర్గం), సంగీత (జడ్పీటీసీ – నెల్లికుదురు), పుప్పాల స్వప్న.(ఓయూ), గుగులోతు స్వరూప, అమిత్ కుమార్, బోడ పుణ్యనాయక్, కృష్ణ రాథోడ్, పిచ్చారెడ్డి, మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ శ్యామ్‌రావు తదితరులు బిజెపిలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News