Sunday, April 28, 2024

వీటోలతో ఇజ్రాయెల్‌కు అమెరికా దన్ను!

- Advertisement -
- Advertisement -

ప్రచ్ఛన్న యుద్ధం వలన ప్రపంచంలో శాంతి కొరవడిందని అనేక మంది చెబుతారు, దానికి సోవియట్ యూనియనే అని కూడా నిందించేవారు లేకపోలేదు. దాన్ని 1990 దశకంలో విచ్ఛిన్నం చేశారు. అప్పటికి వివిధ ప్రాంతాల్లో పదకొండు వేల మంది శాంతి పరిరక్షణ దళాలు ఉన్నాయి. పదహారు చోట్ల 2014 నాటికి లక్షా 30 వేలకు పెరిగారు. దీనికి అమెరికా దాని మిత్రదేశాలే కారణం. ఆఫ్రికా, ఆసియా, ఐరోపా, మధ్యప్రాచ్య ప్రాంతంలో పన్నెండు సమస్యాత్మక ప్రాంతాల్లో 87 వేల మంది పని చేస్తున్నారు. ఘోరమైన వైఫల్యాలుగా చెప్పుకోవాల్సి వస్తే 1994లో ఆఫ్రికా దేశమైన ర్వాండాలో టుట్సీ హుటు తెగల మధ్య తలెత్తిన హింసాకాండను నివారించడంలో చేతులెత్తేసింది. ఫలితంగా ఎనిమిది లక్షల మంది ప్రాణాలు పోయాయి. ఐరోపాలో 1995లో జరిగిన బోస్నియా దాడుల్లో ఎనిమిది వేల మంది ముస్లింలను చంపివేసినా చేసిందేమీ లేదు.1950 దశకంలో ఉత్తర కొరియా మీద జరిపిన దాడుల్లో పదిహేను లక్షల మందికి పైగా మరణించగా ప్రతిదాడుల్లో దాదాపు పది లక్షల మంది దక్షిణ కొరియన్లు చనిపోయారు.

దీనికి ఐరాస చేసిన నిర్ణయమే కారణం. కమ్యూనిస్టుల పాలనలో ఉన్న చైనాకు బదులు కొద్ది మంది తిరుగుబాటుదార్లతో తైవాన్‌లో తిష్ట వేసిన ప్రభుత్వానికి బదులు ప్రధాన భూభాగంలో అధికారంలో వున్న ప్రభుత్వాన్నే గుర్తించాలని కోరుతూ సోవియట్ యూనియన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భద్రతా మండలి తిరస్కరించింది. దాంతో తాము 1950 జనవరి 13 నుంచి ఐరాసను బహిష్కరిస్తున్నట్లు సోవియట్ ప్రకటించింది. సరిగ్గా ఆ సమయంలో ఉత్తర కొరియా దురాక్రమణకు పాల్పడిందనే సాకుతో అమెరికా, దాని మిత్రదేశాలు ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందటంతో ఉత్తర కొరియా మీద దాడి జరిగింది. దాంతో సోవియట్,చైనా రెండూ ఉత్తరకొరియా రక్షణకు రంగంలోకి దిగాయి. 1953లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కొనసాగుతోంది తప్ప సాంకేతికంగా యుద్ధ విరమణ జరగలేదు. ఉభయ కొరియా విలీనానికి ఇంకా తగిన తరుణం రాలేదనే పేరుతో అమెరికా ఇతర దేశాలు అడ్డుపడుతున్నాయి.

చైనాలో తైవాన్ ఒక రాష్ర్టం తప్ప దేశం కాదంటూ ఐరాస గుర్తించి అంతకు ముందు దానికి ఉన్న గుర్తింపును రద్దు చేసి కమ్యూనిస్టు చైనాను గుర్తించి నాలుగు దశాబ్దాలు దాటినా తైవాన్ విలీనం బలవంతంగా జరగకూడదు అంటూ దానికీ అడ్డుపడుతున్నారు. ఒక దేశంగా పరిగణించి ఆయుధాలు పెద్ద ఎత్తున అందచేస్తూ చైనా మీద తిరుగుబాటుకు మద్దతు ఇస్తున్నారు. ఇలా తాను చేసిన తీర్మానాలను అమలు జరిపేందుకు తరువాత తానే వెనక్కు తగ్గటం లేదా అసమర్ధంగా ఉండటం, ఇతర అనేక అంశాల పరిష్కారంలో ఐరాస విఫలమైంది. వర్తమాన అంశం పాలస్తీనాలో జరుగుతున్నది కూడా అదే.ఆత్మరక్షణ పేరుతో గాజాలో సాధారణ పౌరుల మీద వైమానిక, టాంకులతో ఇజ్రాయెల్ సాగిస్తున్న హత్యాకాండ నివారణను అడ్డ్డుకొనే వారే లేరా అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ప్రతి రోజూ పిల్లలు, మహిళలతో సహా వందలాది మందిని చంపివేయటాన్ని ఆపాలని భద్రతామండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాలను అమెరికా ఇప్పటికే వీటో చేసి మరోసారి తానేమిటో ప్రపంచానికి వెల్లడించింది. శనివారం ఉదయానికి అందిన సమాచారం మేరకు గాజాలో 3,826 మంది పిల్లలు, 2,405 మంది మహిళలతో సహా మొత్తం 9,227 మందిని ఇజ్రాయెల్ చంపింది.

దీనికి పశ్చిమగట్టులో చేసిన హత్యలు అదనం. ఒక నిర్వాసిత శిబిరం, ఒక ఆసుపత్రి అని లేదు, జనం ఎక్కడ ఉంటే అక్కడ బాంబులు వేస్తూ మారణకాండ సాగిస్తున్నది. దానికి అమెరికా కూడా ప్రత్యక్షంగా పాల్గొని సాయం చేస్తున్నది. గాజా ప్రాంతం మీద దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ మిలిటరీకి అవసరమైన సమాచారం అందించేందుకు గాజా ప్రాంతం మీద మానవ రహిత డ్రోన్లను అమెరికా ఎగురవేస్తున్నది. హమస్‌వద్ద బందీలుగా ఉన్న వారి కోసమే అలా చేస్తున్నట్లు అమెరికా రక్షణశాఖ పెంటగన్ నిర్ధారించింది. మానవతా పూర్వక చర్యగా కాల్పులను విరమించాలన్న తీర్మానాన్ని వీటో చేసిన అమెరికా ఏ అధికారంతో ఈ పని చేస్తున్నది. దానికి భద్రతా మండలి తీర్మానం లేదా మరొకటి లేదు. ఇది అడ్డగోలు వ్యవహారం తప్ప మరొకటి కాదు. బందీలను విడుదల చేయించాల్సిన బాధ్యతను తీసుకోవాల్సింది ఐరాస. రోజూ వందలమందిని హతమారుస్తుంటే అది తీసుకున్న చర్యలేమీ లేవు. బందీల ప్రాణాలెంత విలువైనవో పాలస్తీనా అమాయక పౌరుల ప్రాణాలు కూడా అంతే విలువైనవి కాదా!

డ్రోన్లతో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తే పరిస్థితి మరింత విషమిస్తుంది తప్ప మెరుగుపడుతుందా?
ఐరాస చేసిన తీర్మానం మేరకు ఏర్పడాల్సిన పాలస్తీనాను అడ్డుకోవటమే గడచిన ఏడున్నర దశాబ్దాలుగా అక్కడ సాగుతున్న అణచివేత ప్రతిఘటనకు మూలం. దీనిపై భద్రతా మండలి ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు శాంతి నెలకొనేందుకు, ఇజ్రాయెల్‌ను ఖండిస్తూ, పాలస్తీనాకు మద్దతుగా ప్రవేశపెట్టిన 42 తీర్మానాలను అమెరికా వీటో చేసింది. ఇప్పటి వరకు భద్రతా మండలి చరిత్రలో అమెరికా చేసిన మొత్తం వీటోలే 83 కాగా సగానికి పైగా ఇజ్రాయెల్‌ను కాపాడేందుకు ప్రయోగించిందంటే అమెరికా దుర్మార్గం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. యూదు దురహంకారులను సమర్ధిస్తూ ప్రవేశపెట్టిన మరో రెండింటిని రష్యా, చైనా అడ్డుకున్నాయి. లెబనాన్‌పై దాడి, సిరియా గోలన్ గుట్టలను ఆక్రమించుకోవటంతో సహా ఇజ్రాయెల్ ప్రమేయం ఉన్న మొత్తం 46 తీర్మానాలను అమెరికా అడ్డుకున్నది.

దుర్మార్గం ఏమంటే జరూసలెం నగరాన్ని తటస్థంగా వుంచుతూ ఐరాస చేసిన నిర్ణయాన్ని ఉల్లంఘించి ఆక్రమించుకొని తమ రాజధాని అని ఇజ్రాయెల్ ప్రకటించుకుంది.దాన్ని అమెరికా 2017లో గుర్తించింది. ఐరాస తీర్మానాలకు అనుగుణంగా దాని భవిష్యత్ నిర్ణయం జరగాలని భద్రతా మండలిలో 14 దేశాలు ఓటు వేస్తే అమెరికా వీటో చేసింది. 19912011 కాలంలో అమెరికా 24 వీటోలు చేయగా వాటిలో 15 ఇజ్రాయెల్‌కు కాపు కాసేందుకే. పాలస్తీనా ప్రాంతాల్లో మారణకాండకు పాల్పడుతున్నది ఇజ్రాయెల్ మిలిటరీ, ఉగ్రవాదులు అయినప్పటికీ వారిని వెనుక ఉండి నడిపిస్తున్నది అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు అక్కడ చిందే ప్రతి రక్తపు బొట్టుకూ బాధ్యతనుంచి తప్పించుకోలేవు.
గతం, వర్తమాన పరిణామాలను చూస్తున్నపుడు ఐరాసను ఒక ప్రజాస్వామిక సంస్థగా మార్చేందుకు సమగ్ర సంస్కరణలు అవసరమన్నది స్పష్టం. లక్ష మంది జనాభా వున్న కరేబియన్ ప్రాంత దేశమైన సెయింట్ విన్సెంట్, నూట నలభై కోట్ల జనాభా వున్న భారత, చైనాలు ఐరాస సాధారణ అసెంబ్లీలో ఒక్కో ఓటును మాత్రమే కలిగి ఉంటాయి. అది ప్రజాస్వామ్యబద్ధ్దమే అయినప్పటికీ అక్కడ చేసే తీర్మానాలకు ఎలాంటి విలువా ఉండదు.

పదిహేను మంది ప్రతినిధులు ఉండే భద్రతా మండలిలో ఏదైనా ఒక తీర్మానాన్ని 14 మంది ఆమోదించినా ఐదు శాశ్వత సభ్య దేశాలలో ఏ ఒక్కటి కాదన్నా దానికీ అదే గతి పట్టడం పెద్ద లోపం. ఇజ్రాయెల్ దుర్మార్గం, క్యూబాపై అమెరికా అమలు జరుపుతున్న అష్ట దిగ్బంధనాన్ని ఖండిస్తూ ప్రతి సంవత్సరం అత్యధిక మెజారిటీ దేశాలు తీర్మానాలు చేస్తున్నా జరుగుతున్నదేమీ లేదు. గాజా లో జరుపుతున్న దాడులను మానవతా పూర్వకంగా నిలిపివేయాలని సాధారణ అసెంబ్లీలో121 దేశాలు అనుకూలంగా, 14 వ్యతిరేకంగా ఓటు చేయగా మనతో సహా 44 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన నాలుగు తీర్మానాలను అమెరికా వీటో చేసింది.ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ దాడులు చేసే హక్కుందని అమెరికా తెచ్చిన తీర్మానాన్ని రష్యా, చైనా అడ్డుకున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ఏర్పడిన నానాజాతి సమితిలో భద్రతా మండలి మాదిరి వ్యవస్థలో వున్న 15 సభ్యదేశాలకూ వీటో హక్కు ఉండడంతో ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేక అది ఘోరంగా విఫలం కావడమే కాదు, రెండవ ప్రపంచ యుద్ధాన్ని కూడా అడ్డుకోలేకపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత విజేతలుగా వున్న దేశాల ప్రమేయంతో ఏర్పడిందే ఐరాస.

1945లో అది ఉనికిలోకి వచ్చినపుడు అమెరికా, సోవియట్ యూనియన్, చైనా, బ్రిటన్, ఫ్రాన్సులకు వీటోహక్కు కల్పించారు.తొలి రోజుల్లో ఐరాస సాధారణ అసెంబ్లీ, భద్రతా మండలిలో అమెరికా, పశ్చిమ దేశాల అనుకూలురే ఎక్కువ. దాంతో వారికి అనుకూలమైన తీర్మానాలను సోవియట్ అడ్డుకుంది. 2022 మే నెల వరకు సోవియట్, తరువాత దాని వారసురాలిగా ఉన్న రష్యా 121 సార్లు, అమెరికా 83, బ్రిటన్ 29, చైనా 17, ఫ్రాన్సు 16 సార్లు వీటోను ప్రయోగించాయి. వీటో హక్కు ప్రజాస్వామ్యబద్ధం కాదన్నది నిజమే అయినప్పటికీ అది లేకపోతే తొలి రోజుల్లో తమ కూటమికి వున్న బలంతో మొత్తం ప్రపంచాన్ని అమెరికా తనపెత్తనం కిందకు తెచ్చుకొని ఉండేది. ఇప్పుడు మెజారిటీ దేశాలు దాన్ని వ్యతిరేకిస్తున్నందున ప్రజాస్వామిక అభిప్రాయాన్ని అడ్డుకొనేందుకు వీటోను ఆయుధంగా చేసుకుంటోంది. అందుకే పైకి ఏమి చెప్పినప్పటికీ ఆచరణలో ఐరాస సంస్కరణలకూ అది ససేమిరా అంటున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News