28, 29 తేదీల్లో ఎన్నికలు
ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 9 డిసిసిబి, 9 డిసిఎంఎస్లకు బ్యాలట్ యుద్ధం
టెస్కాబ్కు వచ్చే నెల
3న నోటిఫికేషన్
హైదరాబాద్: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డిసిసిబి), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డిసిఎంఎస్)లకు ఈ నెల 20వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ వెల్లడించింది. వీటికి ఈ నెల 28,29 తేదీల్లో వీటికి ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే తెలంగాణ సహకార అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్కు మార్చి 3వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి, 5వ తేదీన ఛైర్మెన్ను ఎన్నుకోనున్నారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ఎన్నికలు ముగియడంతో డిసిసిబి, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ డిసిఎంఎస్ ఎన్నికల నిర్వహణపై సహకారశాఖ కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా డిసిసిబి, డిసిఎంఎస్ ఓటర్ల జాబితాను రూపొందించడంపై జిల్లా సహకార అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు సోమవారం జిల్లా సహకార అధికారులతో సహకార శాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఓటర్ల జాబితా రూపకల్పనకు అనుసరించాల్సిన విధానాలపై తగు సూచనలు చేసినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన డిసిసిబి, డిసిఎంఎస్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ర్టంలోని 9 డిసిసిబి, 9 డిసిఎంఎస్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి డిసిసిబిలో 20 మంది డైరెక్టర్లు, డిసిఎంఎస్లో 10 మంది డైరెక్టర్లను ఆయా జిల్లాల్లోని ఫ్యాక్స్ చైర్మన్లు ఎన్నుకుంటారు. డిసిసిబిలో 16 మంది సభ్యుల(డైరెక్టర్లు)ను ఫ్యాక్స్ చైర్మన్లు ఎన్నుకోగా, మరో 6 గురు సభ్యులను జిల్లాల్లోని ఇతర సహకార సంఘాల( చేనేత,గీత, మత్స్యకార లాంటి) ఛైర్మన్లు ఎన్నుకుంటారు.
అదే విధంగా డిసిఎంఎస్లకు 6గురు సభ్యులను ఫ్యాక్స్ చైర్మన్లు, మరో 4గురు సభ్యులను ఇతర సహకార సంఘాల చైర్మన్లు ఎన్నుకుంటారు. డిసిసిబి, డిసిఎంఎస్ల చైర్మన్ల నియామకం అనంతరం రాష్ర్ట స్థాయిలో టెస్కాబ్, మార్క్ఫెడ్ పాలకవర్గాల నియామకానికి ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేస్తారు.అనంతరం డిసిసిబి చైర్మన్లు, డిసిఎంఎస్ల ఛైర్మైన్లు టెస్కాబ్ చెర్మైన్, మార్క్ఫెడ్ పాలకవర్గాలను ఎన్నుకుంటారు.