రావల్పిండి: సొంత గడ్డపై బంగ్లాదేశ్తో చారిత్రక టెస్టు సమరానికి పాకిస్థాన్ సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య రావల్పిండి వేదికగా టెస్టు మ్యాచ్ జరుగనుంది. శుక్రవారం ఈ మ్యాచ్ ప్రారంభమవుతోంది. ఇటీవలే శ్రీలంకతో స్వదేశంలో పాకిస్థాన్ రెండు టెస్టుల్లో తలపడిన విషయం తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్తో కూడా సొంత గడ్డపై ఓ టెస్టు మ్యాచ్ పాకిస్థాన్ ఆడనుంది. ఈ మ్యాచ్ జరుగడంపై పలు సందేహాలు నెలకొన్నా చివరికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్టును పాకిస్థాన్కు పంపించేందుకు అంగీకరించింది. దీంతో టెస్టు మ్యాచ్ నిర్వహణపై నెలకొన్న సందేహాలకు తెరపడింది. ఇక, ఈ చారిత్రక మ్యాచ్ కోసం ఇటు పాకిస్థాన్ అటు బంగ్లాదేశ్లు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి.
రెండు జట్లు కూడా గెలుపుపై కన్నేశాయి. కెప్టెన్ అజహర్ అలీ, అసద్ షఫిక్, ఫవాద్ ఆలమ్, బాబర్ ఆజమ్, ఆబిద్ అలీ, ఇమాముల్ హక్ వంటి ప్రతిభావంతులైన బ్యాట్స్మెన్ ఉన్నారు. అంతేగాక హారిస్ సోహైల్, షాన్ మసూద్, బిలాల్ వంటి అగ్రశ్రేణి ఆల్రౌండర్లు కూడా మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు షాహిన్ అఫ్రిది, మహ్మద్ అబ్బాస్, యాసిర్ షాలతో బౌలింగ్ కూడా బలంగానే ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ కూడా గెలుపే లక్షంగా బరిలోకి దిగనుంది. కెప్టెన్ మోమినుల్ హక్, తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, మహ్మద్ మిథున్, లిటన్ దాస్ తదితరులతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ కూడా చాలా బలంగా ఉంది. తైజుల్ ఇస్లామ్, నయీం, రుబేల్ హుస్సేన్లతో బౌలింగ్ కూడా బాగానే కనిపిస్తోంది. దీంతో ఈ ఏకైక టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.
pakistan bangladesh test series 2020