Sunday, April 28, 2024

దేశ భక్తి, ఐక్యత గుర్తు చేసేది జాతీయ పతాకము: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Patriotism and unity in National Flag

మహబూబాబాద్: తొర్రూర్ జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో 100 అడుగుల ఎత్తుతో జాతీయ జెండా ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద 100 అడుగుల జాతీయ జెండాను మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు లో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు.  ఈ జాతీయ జెండా 20 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో రెపరెపలాడుతుందని,  ఈ జాతీయ జెండా కోసం సుమారు 20 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు.  డాక్టర్ సోమేశ్వర్ రావు, ఇతర దాతలు కలిసి కమిటీగా ఏర్పడి జాతీయ సమైక్యతా కోసం ఈ బృహత్ కార్యాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. దీని నిర్మాణం కోసం డిఆర్డిఒ, ఇస్రో వారి సాంకేతిక సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ జెండా ఫ్లాట్ ఫారం 30X30 అడుగులు పొడువు, వెడల్పుతో నిర్మాణం చేయడం జరిగిందని,  దీని భద్రతా కోసం ఫెన్సింగ్, గార్డెనింగ్, సిసి కెమెరాల ఏర్పాటు పోలీస్ ఆధ్వర్యంలో ఉందన్నారు.  దీని నిర్మాణం కోసం కేవలం 15 రోజుల్లో రాత్రి, పగలు కష్టపడి నిర్మాణం చేయడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇదే ప్రధమం…

స్వాతంత్ర్య సమర యోధుడు, గాంధేయవాది పింగిలి వెంకయ్య 1921 సంవత్సరంలో జాతీయ పతాకన్ని రూపకల్పన చేశారని, జాతీయ పతాకంలో ఉన్న మూడు రంగులు కాషాయం ధైర్యము, ధృడత్వాన్ని తెలుపు శాంతిని, సత్యమును, ఆకుపచ్చ ఉత్పత్తి, సంపద పెరుగుదల, శుభమును సూచిస్తుందన్నారు. దేశ భక్తి, ఐక్యత గుర్తు చేసేది జాతీయ పతాకము అని, ఇతర దేశాలలో వారి జెండాను పెట్టుకుంటున్నారని, దండయాత్రలు జరిగినప్పుడు మన సంస్కృతి, సంస్కారాలను వినాశనం చేశారని మండిపడ్డారు.  విద్యార్థులకు స్వాతంత్ర సంగ్రామం గురించి, దేశభక్తి భావాలను తెలియజేయాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి పై జెండా ఎగరవేసే అవకాశం కల్పించడం హర్షణీయమన్నారు. భారత స్వాతంత్ర సంగ్రామం, తదనంతరం జాతి నిర్మాణంలో మువ్వన్నెల పతాక పోషించిన పాత్ర స్ఫూర్తిదాయకమన్నారు.  దేశ స్వాతంత్ర్యం కోసం, ఐక్యత కోసం తన, మన, ధన, ప్రాణత్యాగాలు చేసిన వారందరినీ గుర్తుచేసుకుని, వారి త్యాగాల స్ఫూర్తితో నవ భారత నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలనే గొప్ప సంకల్పంతో తొర్రూరులో భారీ జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎర్రబెల్లి తెలిపారు.

భారత దేశానికి స్వాతంత్ర్య సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను అడుగడుగునా దేశ భక్తి భావన, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో మేల్కొలిపే విధంగా సమున్నత స్థాయిలో, అంగరంగ వైభవంగా మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నిర్వహించుకున్నామన్నారు. ఇప్పటివరకు దేశంలో అతిపెద్ద జెండా జమ్ము కాశ్మీర్ లో లేహ్ లో వుందని,  తెలంగాణ వచ్చాక మన రాష్ట్రంలో హైదరాబాద్, సంజీవయ్య పార్కులో 291 అడుగుల జెండా ను ఏర్పాటు చేశామన్నారు. ఆ తరువాత ఇప్పుడు రాష్ట్రంలో రెండవది, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటిది మనం ఏర్పాటు చేసుకున్న పెద్ద జెండా అని ఎర్రబెల్లి ప్రశంసించారు.

సిఎం కెసిఆర్ ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా భారత స్వతంత్ర వజ్రోత్సవాలు నిర్వహించి అందరిలో జాతీయ భావాన్ని పెంచారని, ఆనాటి స్వాతంత్ర్య యోధుల స్ఫూర్తి ని మనం మనసు నిండా నింపుకున్నామని, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి ఇప్పటికే మన ఐకమత్యాన్ని చాటామన్నారు. ఈ రోజు జాతీయ పెద్ద జెండా ఆవిష్కరణ చరిత్రలో నిలిచిపోతుందని, సిఎం కెసిఆర్ గాంధీజీ అహింస మార్గం ద్వారా తెలంగాణను సాధించామని,  సాధించిన తెలంగాణను గాంధీ, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అభివృద్ది చేస్తున్నారన్నారు.  మన రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ది పరుచుకున్నమో దేశాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. మనమంతా ఐక్యతను చాటి మన రాష్ట్ర, దేశ అభివృద్ధిలో పాలుపంచుకుందామన్నారు. మన మధ్య విద్వేషాలు పెంచుతున్న అరాచక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఐకమత్యంగా ఉండి అరాచక శక్తులను ఎదుర్కొందామని ఎర్రబెల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అధికారులు, స్ధానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News