Monday, April 29, 2024

శాసనోల్లంఘన ఉద్యమం

- Advertisement -
- Advertisement -

గాంధీ నాయకత్వంలో ప్రారంభమైన రెండో అతిపెద్ద ప్రజా పోరాటం శాసనోల్లంఘన ఉద్యమం.
ఉద్యమానికి కారణాలు..
1927 బ్రిటీష్ ప్రభుత్వం సైమన్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రకటన చేసింది.
1919 రాజ్యాంగ సంస్కరణలను సమీక్షించుటకు గాను నియమించబడిన కమీషన్ నిర్ణీత గడువు కన్నా ముందుగానే నియమించబడటం భారత రాజకీయ పార్టీలలో అనుమానాలకు దారి తీసింది.
కమిషన్‌లో 7 మంది సభ్యులు ఆంగ్లేయులే కావడం అభ్యంతరకరమైంది.
జస్టిస్ పార్టీ, కొన్ని దిగువ కులాలు తప్పించి మిగిలిన రాజకీయ పార్టీలన్ని సైమన్ కమిషన్ వ్యతిరేకించాలని తీర్మానించాయి.
సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా మద్రాస్‌లో టంగుటూరి ప్రకాశం, లాహోర్‌లో లాలా లజపతిరాయ్ గొప్ప ప్రదర్శనలు నిర్వహించారు.
పోలీసుల లాఠీ చార్జ్‌కి గురై లజపతిరాయ్ మరణించడంతో భారత జాతీయత భావాలు మరింతగా ప్రభావితమయ్యాయి.
ఆర్థిక మాంద్యం ప్రభావం వలన భారతదేశంలో సంక్షోభం ఏర్పడింది.
రైతాంగ సమస్యల పట్ల సర్ధార్ వల్లబాయ్‌పటేల్ బార్డోలి సత్యాగ్రహానికి పూనుకున్నాడు.
ఫలితంగా రైతాంగంలో ఉద్యమచైతన్యం చోటుచేసుకుంది. సైమన్ కమిషన్ పర్యటనను రాజకీయ పార్టీలు భహిష్కరించడాన్ని సెక్రటరీ స్టేట్ ఫర్ ఇండియా లార్డ్ బెర్కిన్ హెడ్ తప్పుపట్టాడు.
అన్ని రాజకీయ పార్టీలకు ఆమోద యోగ్యమైన రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని సవాలు చేశాడు.
ఫలితంగా అన్ని రాజకీయ పార్టీలతో కూడి న అఖిల పక్షం రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యతను మోతిలాల్ నెహ్రూ కమిటి అను ఉప సంఘానికి అప్పగించారు.
మోతీలాల్ నెహ్రూ కమిటి తన నివేదికలో ముస్లింలకు మతపరమైన నియోజక వర్గాలకు బదులు సాధారణ నియోజకవర్గాలలోని 1/౩ వంతు స్థానాలను కేటాయించింది.
నివేదికను తిరస్కరిస్తూ ముస్లింలీగ్ నాయకుడైన జిన్నా14 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టినాడు.
నివేదికను అమలు చేసి తీరాలని పట్టుబడుతూ కాంగ్రెస్ డిసెంబర్ 31, 1929 తుది గడువు పెట్టింది.
గవర్నర్ జనరల్ ఇర్విన్ దీపావళి ప్రకటన చేస్తూ రాజ్యాంగ సంస్కరణలపై లండన్‌లో జరగబోయే రౌండ్ టేండ్ సమావేశాలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధం కావాలని ప్రతిపాదన చేశాడు.
ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరించడంతో ప్రతి స్థంభన ఏర్పడింది.
1929 డిసెంబర్‌లో జరిగిన లాహోర్ సమావేశంలో పూర్ణస్వరాజ్యం తీర్మానం చేయడంతో ఉద్యమం అనివార్యమైంది.
ఈ సమావేశంలోనే ప్రతి ఏడాది జనవరి 26 స్వతంత్య్ర దినంగా పాటించాలని తీర్మానించారు.
అలాగే త్రివర్ణ పతాకం ఎగురవేశారు.
1930 ఫిబ్రవరిలో గాంధీ ఇర్విన్‌ను కలిసి 11 డి మాండ్‌లను ప్రవేశపెట్టారు. గాంధీ చేసిన ప్రయత్నం విఫలమవడంతో ఉద్యమం అనివార్యమైంది.
ఉద్యమ గమనం..
మార్చి 12, 1930న గాంధీ 78 మంది అనుచరులతో సబర్మతి నుండి దండికి బయలుదేరాడు.
ఏప్రిల్ 6న గాంధీ చట్టాన్ని ఉల్లంఘించి ఉప్పు తయారు చేయడంతో ఉద్యమం ప్రారంభమైంది.
మద్రాస్ ప్రెసిడెన్సీలో రాజాజీ నాయకత్వంలో తిరుచురాపల్లి నుండి తిండివనం వరకు ఉప్పు సత్యాగ్రహం నిర్వహించారు.
బాంబే ప్రెసిడెన్సీలో వడాల, దర్శన అను ప్రాంతాల వద్ద సరోజిని నాయుడు, విఠల్‌భాయ్ పటేల్‌లు ఉప్పు సత్యాగ్రహాలు నిర్వహించారు.
ఉద్యమంలో స్వాతంత్య్ర పోరాటం తొలిసారిగా సరిహద్దులు దాటి ఆఫ్ఘానిస్తాన్ లో ప్రవేశించింది.
సరిహద్దు గాంధీగా పిలువబడిన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ దైవ సేవకుల సంఘం, ఎర్రచొక్కాలు అను స్వచ్ఛంద సంస్థలను స్థాపించాడు.
ఉద్యమంలో భాగంగా విప్లవ కార్యకలాపా లు బలపడ్డాయి. హిందుస్తాన్ పీపుల్స్ రిపబ్లికన్ ఆర్మీకి వ్యవస్థాపకుడైన సూర్యసేన్ చిట్టగాంగ్ ఆయుధ కర్మాగారంపై దాడి చేశాడు.
కాంగ్రెస్ పార్టీ పాల్గొన కుండానే రౌండ్‌టేబుల్ సమావేశాలు ప్రారంభ మయ్యాయి.
మెజారిటీ పార్టీ కాంగ్రెస్ లేకుండా ఏ నిర్ణయం సాధ్యం కాదని గ్రహించిన తేజ్ బహదూర్ సహ్రూ, ఎంఆర్ జయకర్‌లు గాంధీ ఇర్విన్‌లకు మధ్య మధ్యవర్తిత్వం చేసి గాంధీ ఇర్విన్ ఒప్పందం చేశారు.
ఒప్పందం అనుసరించి గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రతినిధిగా రెండవ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నాడు.
ముస్లింలీగ్, హిందూ మహాసభ, డా.బిఆర్ అంబేద్కర్‌ల నుండి విమర్శలు ఎదుర్కొన్నాడు.
రాజ్యాంగ సంస్కరణలపై ప్రతిష్టంబన కొనసాగడంతో గాంధీ సమావేశం నుండి నిష్క్రమించాడు.
భారతదేశానికి తిరిగి వచ్చిన గాంధీ ఉద్యమాన్ని పునరుద్దరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గాంధీని నిర్భందించడంతో ఉద్యమం ముగిసింది.
ఉద్యమ సమీక్ష..
ఉద్యమం కొన్ని వైఫల్యాలను చవి చూసింది. ఉద్యమ వైఫల్యం వలన కార్మిక కర్షక వర్గాలు తీవ్ర నిరాశ నిస్ఫ్రుహలకు లోనయ్యారు.
కర్షకులు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నారు. ఫలితంగా ఆచార్య ఎన్‌జీ రంగా ప్రేరణతో 1936 నాటికి అఖిలభారత కిసాన్ మహాసభ ఏర్పడింది.
ఉద్యమ వైఫల్యం కార్మికులను నిరాశకు గురి చేసింది.
కాంగ్రెస్‌కు అనుబంద ట్రేడ్ యూనియన్ అయిన ఎఐటియూసి లో కాంగ్రెస్ ప్రాబల్యం తగ్గి కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరిగింది.
ఉద్యమ వైఫల్యం పరోక్షంగా కాంగ్రెస్‌లో సోషలిస్ట్ భావాలు బలపడుటకు, కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ఆవిర్భావానికి దారితీసింది.
ఆచార్య నరేంద్రదేవ్, జయప్రకాష్ నారాయ ణ ఆధ్వర్యంలో 1934 బాంబే సమావేశం లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపించారు.
జె.ఎల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి అగ్రనాయకులు కూడా గాంధేయ వాదం పట్ల విశ్వాసాన్ని కోల్పోయినారు.
క్రమంగా సామ్యవాదం వైపు మొగ్గుచూపారు. ఉద్యమంతో భారత స్వాతంత్య్ర పోరాట పరిధి విస్తరించబడింది. ఉద్యమ భావాలు సరిహద్దులు దాటి ఆఫ్ఘానిస్తాన్ ప్రవేశించింది.
తన దండి సత్యాగ్రహం ద్వారా గాంధీ స్వదేశీ వనరులు స్వదేశీయులకు ఉపయోగ పడాలని సమర్ధవంతంగా చాటి చెప్పారు.
ఉద్యమంలో కాంగ్రెస్ స్వభావంలో స్పష్టమైన మార్పు చోటు చేసుకుంది.
స్వయం పరిపాలనకు బదులు పూర్ణ స్వాతంత్య్రాన్ని తన ధ్యేయంగా ప్రకటించడంతో కాంగ్రెస్ పోరాట పంధా, ధోరణిలో మార్పులు వచ్చాయి.

క్విట్ ఇండియా ఉద్యమం

జాతీయోద్యమంలో చిట్టచివరి పోరాటం, అతిపెద్ద ప్రజా పోరాటం అయిన క్విట్ ఇండియా ఉద్యమానికి దారితీసిన పరిస్థితులు రెండవ ప్రపంచ యుద్ధంతో ముడిపడి ఉన్నాయి.
కారణాలు..
రెండో ప్రపంచ యుద్ధం నాటి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాలను సంప్రదించకుండా గవర్నర్ జనరల్ లిన్‌లిత్‌గో భారదేశం యుద్దంలో భాగస్వామ్యురాలే అని ప్రకటిస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడు.
ఇందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వా లు మూకుమ్మడిగా రాజీనామాలు చేయ డంతో రాజకీయాల్లో ప్రతిష్టంబన ఏర్పడింది.
ప్రతిష్ఠంబనను తొలగించుటకు గవర్నర్ జనరల్ లిన్‌లిత్‌గో 1940 ఆగస్టు 6వ తేదీన చేసిన ఆగస్టు ప్రతిపాదనలను కాంగ్రెస్ తిరస్కరించింది.
యుద్ధానంతరం భారతదేశానికి రాజ్యాంగ నిర్మాణ సమితి, అధినివేశ ప్రతిపత్తి వంటి ప్రతిపాదనలకు కాలపరిమితి లేదు కనుక అవి తిరస్కరించబడ్డాయి.
యుద్ధ నిర్వహణ మండలిలో కీలకమైన రక్షణ శాఖను ఇవ్వకుండా ఇతర శాఖలను ఇవ్వడం అర్ధరహితమని కాంగ్రెస్ భావించింది.
రక్షణ శాఖను భారతీయులకు ఇవ్వక పోవడం పట్ల అసంతృప్తికి గురైన గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహానికి పిలుపు నిచ్చాడు.
1942 మార్చిలో వచ్చిన క్రిప్స్ రాయభారం కూడా భారతీయ నాయకత్వాన్ని నిరుత్సాహపరిచింది.
క్రిప్ కేవలం 1940 ఆగస్టు ప్రతిపాదనలను పునరుద్ఘాటిస్తూ భారతదేశంలోని ప్రతిజాతికి తమ భవిష్యత్తును నిర్ణయించుకునే అధికారం ఉందని ప్రకటించడం కాంగ్రెస్‌ను నిరాశ పరిచింది.
క్రిప్స్ ప్రతిపాదనలను దివాలా కోరు బ్యాంక్ ఇచ్చిన చెక్కుల వంటివి అని గాంధీ విమర్శించాడు.
భారతీయుల సమస్యల పట్ల బ్రిటీష్ వారికి చిత్తశుద్ది లేదని గ్రహించాడు.
నానాటికి విస్తరిస్తున్న జపాన్ సమ్రాజ్యవా దం కాంగ్రెస్‌ను కలవర పెట్టింది.
ఆసియా ఆసియా వాసులకే అనే నినాదంతో జపాన్ ఆసియాలోని ఇంగ్లాండ్ వలసలన్నింటిని ఆక్రమించింది.
జపాన్ భారీ నుండి భారతదేశాన్ని కాపాడలేని ఇంగ్లాండ్ తాను ఓడిపోయిన ప్రాం తాల్లో స్వచ్ఛందంగా భారతీయ సైన్యాలను జపాన్‌కి స్వాధీన పరచడం కూడా నాయకత్వ ఆంధోళనకు కారణమైంది.
రెండవ ప్రపంచయుద్ధం ఒక సాకుగా అధికార రహస్యాల చట్టాన్ని ప్రవేశపెట్టడం, ప్రజాహక్కులు రద్దు చేయడం ఉద్యామానికి కారణాలయ్యాయి. యుద్ధ ప్రభావం వలన తలెత్తిన ఆర్థిక సంక్షోభం, భారతీయ సైన్యాలను వివక్షతకు గురిచేయడం..క్విట్ ఇండియా ఉద్యమాన్ని అనివార్యం చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News