Saturday, June 21, 2025

యుద్ధాలు వద్దంటున్న జనం

- Advertisement -
- Advertisement -

యుద్ధాలు ఎన్ని అనర్థాలకు దారితీస్తున్నాయో ప్రపంచం ప్రత్యక్షంగా చూస్తోంది. నియంతలైన దేశాధినేతల రణదాహం ముందు జనక్షేమం ఓడిపోతోంది. దేశాలు మందుపాతరల గనులుగా, పట్టణాలు శ్మశానాలుగా, భవనాలు బూడిద కుప్పలుగా క్షణాల్లో మారిపోతున్నాయి. బాంబుల దాడులతో జనం బెంబేలెత్తిపోతున్నారు. తలదాచుకొనే చోటులేక పరుగులు తీస్తున్నారు. విషవాయువులు కమ్ముకుని అంటువ్యాధులు పీడిస్తున్నాయి. ఇన్ని అనర్ధాలు జరుగుతున్నా దేశాల పాలక నియంతలకు బుద్ధి రావడం లేదు. ప్రత్యర్థులను చంపడమే లక్షంగా ముందుకు సాగుతున్నారు.

అన్నవస్త్రాల కన్నా అణ్వాయుధాలే ఇప్పుడు అవసరమవుతున్నాయి. ప్రపంచం మొత్తంమీద కేవలం తొమ్మిది దేశాల్లోనే అణుబాంబులున్నాయని, వీటిని ప్రయోగిస్తే భూగోళం ఎందుకూ పనికిరాక విధ్వంసానికి గురవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం (Ukraine Russia War) గత మూడేళ్లుగా సాగుతున్నందుకు రష్యా పైచేయి సాధించినట్టు కనిపిస్తున్నా ఆర్థిక సంక్షోభం కమ్ముకొస్తోంది. సైన్యంలో చేరేవారికి భారీ మొత్తంలో బోనస్‌లు ఇవ్వడం, యుద్ధం లో మరణించిన సైనిక కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం కల్పించడం తదితర చర్యలు రష్యా ఖజానాను ఖాళీచేయిస్తున్నాయి. అటుఇటు కొన్ని వేలమంది సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ గణాంకాలు బయటకు రావడం లేదు.

జరగవలసిన విధ్వంసం అంతా జరిగాక ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చలకు సిద్ధమని ప్రకటించడం ఎవరిని రక్షించడానికి? ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంలో పాలస్తీనా చిరునామా చెరిగిపోతోంది. పాలస్తీనా ప్రజలు ఆకలి మంటలకు ఆహుతై పోతున్నా కనీసం ఆహారం కూడా వారికి అందకుండా ఇజ్రాయెల్ రాక్షస క్రీడ సాగిస్తోంది. ఇప్పుడు గత ఏడెనిమిది రోజులుగా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం బీభత్సంగా సాగుతుండడంతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇజ్రాయెల్ రణజ్వాలలకు అమెరికా ఆజ్యం పోస్తోంది. ఈ యుద్ధాలన్నిటికీ కాలుదువ్వుతున్నది పాలకుల కండకావరం తప్ప ప్రజలు కాదు. అనర్ధాలను భరిస్తున్నదీ ప్రజలే.

ఏదేమైనా ఈ యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్‌కు అండగా జోక్యం చేసుకోవడానికి అమెరికన్ ప్రజలు ఒప్పుకోవడం లేదు. ఎక్కువ శాతం మంది తిరస్కరిస్తున్నారు. అమెరికాకు ఇరాన్ ఆగర్భశత్రువని కొంత మంది అమెరికన్లు అభిప్రాయపడుతుండగా, అమెరికా మిలిటరీ ఈ యుద్ధంలో ప్రవేశించడం మంచిది కాదని 60 శాతం మంది హితవు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో యూగవ్ అనే సంస్థ నిర్వహించిన శాంపిల్ సర్వేలో అమెరికా వయో వృద్ధులు 60 శాతం మంది యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోరాదని తమ అభిప్రాయాన్ని స్పష్టం చేస్తున్నారు. డెమొక్రాట్స్ 65 శాతం మంది, ఇండిపెండెంట్లు 61 శాతం మంది, రిపబ్లికన్లు 53 శాతం మంది యుద్ధానికి వ్యతిరేకత చూపిస్తున్నారు.

యుద్ధంలో అమెరికా జోక్యాన్ని వయోవృద్ధులు కేవలం 16% మంది మాత్రమే సమర్ధిస్తున్నారు. అలాగే డెమొక్రాట్స్15 శాతం మంది, ఇండిపెండెంట్లు 11 శాతం మంది, రిపబ్లికన్లు 23 శాతం మంది దీనికి అంగీకరిస్తున్నారు. అమెరికా నేరుగా ఇరాన్‌తో యుద్ధానికి దిగే అవకాశం ఉందని తెలియడంతో చమురు మార్కెట్ తాజాగా అస్థిరతతో అల్లాడుతోంది. బ్రెంట్ క్రూడ్ బారెల్ దాదాపు 77 డాలర్లకు చేరింది. హోర్ముజ్ జలసంధిలో నౌకా రవాణా మార్గాల్లో మార్పులు రావచ్చు. దాంతో రవాణా వ్యయం విపరీతంగా పెరిగే ప్రమాదం ఏర్పడుతుంది. అంతర్జాతీయ చమురు మార్కెట్‌కు మధ్యప్రాచ్యం కీలకమైన మార్గం. ధరలు పెరుగుతుంటే ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. అలాగే ప్రపంచ దేశాలకు చమురు నౌకా రవాణా, ఇంధనం అందుబాటు క్లిష్టతరమవుతుంది. 2019లో అమెరికా ఆంక్షలు విధించడంతో ఇరాన్ నుంచి భారత్‌కు చమురు దిగుమతులు లేకపోయినప్పటికీ, మధ్యప్రాచ్య నుంచి ప్రకంపనలు ప్రభావం చూపిస్తాయి.

ఆయా దేశాల నుంచి సరఫరాకు ఆటంకాలు ఏర్పడితే మన దేశం భారీగా అంతర్జాతీయ మార్కెట్‌కు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. వారం కిందట బ్రెంట్ క్రూడ్ ధరలు 69.4 డాలర్లు ఉండగా, ఇప్పుడు (జూన్ 18) 77 డాలర్లకు పెరిగింది. మార్కెట్‌లో ధరలు కొన్ని రోజుల్లోనే 8 డాలర్ల వంతున పెరిగాయి. బ్రెంట్ ధర బ్యారెల్‌కు 10 డాలర్ల వంతున పెరగవచ్చని భావిస్తున్నారు. గత శుక్రవారం ఇజ్రాయెల్ దాడులు చేసిన దగ్గర నుంచి ఇరాన్ నుంచి రోజువారీ చమురు ఎగుమతులు 44 శాతం వరకు పెరిగాయి. ప్రపంచం మొత్తం మీద చమురు నిల్వల్లో 12 శాతం, మధ్యప్రాచ్యం మొత్తం చమురు నిల్వల్లో 24 శాతం వరకు ఇరాన్‌లో 154 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉంటాయి.

తొమ్మిదో భారీ చమురు ఉత్పత్తి దేశంగా రోజూ 3.3 మిలియన్ బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తుంది. అలాగే రోజూ 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును, శుద్ధి చేసిన ఇంధనాన్ని ఎగుమతి చేస్తుంది. జూన్ 13న ఇజ్రాయెల్ దాడుల తరువాత ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ట్యాంకరు రేట్లు పెరిగాయి, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకా రవాణా అగమ్యగోచరమవుతుందని వ్యాపారులు అంటున్నారు. హోర్మూజ్ జలసంధిని కూడా మూసివేసే ఆప్షన్ తమవద్ద ఉందని ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేయడం తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ జలసంధిని మూసివేయడం కూడా ఓ మార్గమని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ సభ్యుడు బెహ్నంసయీదీ గురువారం మీడియాకు వెల్లడించడం అంత తేలికగా తీసుకోరాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News