Thursday, May 2, 2024

ఆటో మొబైల్ షాపులు షురూ

- Advertisement -
- Advertisement -

Permits to Auto mobile shops

 

లాక్‌డౌన్ యథాతథం
ఎసిలు అమ్మే దుకాణాలకూ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో కరోనా యాక్టివ్ కేసులు ఎల్‌బి నగర్, మలక్‌పేట, చార్మినార్, కార్వాన్‌లకే పరిమితం
కోలుకుంటున్న వారే ఎక్కువ
వైరస్‌పై అంతగా భయపడవలసిన పని లేదు
17 తర్వాత కేంద్రం నుంచి మరిన్ని మార్గదర్శకాలు, అప్పుడు రాష్ట్రంలో తాజా వ్యూహం ఖరారు :
సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శనివారం నుంచి ఎసిలు అమ్మే షాపులు, ఆటోమోబైల్ షో రూములు, ఆటో మోబైల్ స్పేర్ పార్ట్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, ఆర్‌టిఎ కార్యాలయాలు నడుస్తాయని తెలిపారు. మిగతా లాక్ డౌన్ నిబంధనలు మాత్రం యధావిధిగా అమలవుతాయన్నారు. కేంద్రం విధించిన తాజా లాక్ డౌన్ గడువు ఈ నెల 17 తో ముగుస్తున్నందున కేంద్రం మరికొన్ని మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉందన్నారు. అప్పుడు వాటిని పరిశీలించి, రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించి తగు వ్యూహం ఖరారు చేసి రాష్ట్రంలో అమలు చేస్తామన్నారు.

కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఈటల రాజేందర్, కెటి రామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఎంఎయుడి కమిషనర్ సత్యనారాయణ, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, పోలీస్ కమిషనర్లు అంజనీ కుమార్, సజ్జనార్, మహేష్ భగవత్, సీనియర్ ఐపిఎస్ అధికారి జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భఁగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలోని నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో ప్రస్తుతం మరెక్కడా కరోనా ఆక్టివ్ కేసులు లేవన్నారు. ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనలు యధావిధిగా అమలు చేయాలన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు కొనసాగిస్తూనే, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఈ సందర్భంగా సిఎం ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ హైదరాబాద్ నగరంలోని కేవలం నాలుగు జోన్లకే పరిమితం అయిందన్నారు.

దీని గురించి ప్రజలు అంతగా భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా వైరస్ సోకిన వారికంటే కోలుకుంటున్న వారే మన రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారన్నారు. రాష్ట్రంలో కరోనా వచ్చిన వారిలో మరణించిన వారి శాతం కేవలం 2.38 మాత్రమేనని…. ఇది దేశ సగటు 3.5 శాతం కన్నా తక్కువ అని పేర్కొన్నారు. కాబట్టి కరోనా గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని సిఎం కెసిఆర్ తెలిపారు. అయితే ఈ వైరస్ ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు….. కాబట్టి కరోనాతో కలిసి జీవించే వ్యూహం అనుసరించక తప్పదని సిఎం వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ప్రధానంగా ఎల్.బి.నగర్, మలక్ పేట, చార్మినార్, కార్వాన్ జోన్లలోనే ప్రస్తుతం ఆక్టివ్ కేసులున్నాయన్నారు. ఈ జోన్లలో 1442 కుటుంబాలున్నాయని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి, జనగామ, మంచిర్యాల జిల్లాలకు చెందిన వలస కూలీలకు కొందరికి వైరస్ సోకినట్లు తేలింది తప్ప, ఆ జిల్లా వాసులకు ఎవరికీ పాజిటివ్ లేదని సిఎం తెలిపారు. ఆ వలస కూలీలు కూడా హైదరాబాద్ లోనే చికిత్స పొందుతున్నారన్నారు. కాబట్టి ఆ మూడు జిల్లాల్లో పాజిటివ్ కేసులు ఉన్నట్లు పరిగణించడానికి లేదన్నారు. పాజిటివ్ కేసులున్న నాలుగు కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి, చికిత్స చేస్తున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు.
విమాన ప్రయాణికులు, రైళ్ళ ద్వారా వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి..

విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో, వివిధ రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా రాష్ట్రానికి వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సిఎం కెసిఆర్ సూచించారు. విమానాల ద్వారా హైదరాబాద్ చేరుకునే తెలంగాణ వాసులకు పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. వైరస్ లక్షణాలు ఉంటే ఆసుపత్రికి తరలించాలని, లేకుంటే హోమ్ క్వారంటైన్‌లో ఉంచాలన్నారు. హైదరాబాద్ లో దిగే ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని విమానాశ్రయం నుంచే నేరుగా ప్రత్యేక బస్సుల ద్వారా తమ సొంత రాష్ట్రాలకు పంపించాలని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. రైళ్ల ద్వారా తెలంగాణకు చేరుకునే వలస కార్మికులకు పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని తమ సొంత రాష్ట్రాలకు పంపించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు.

సీజనల్ వ్యాధులను ప్రబలకుండా..

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. నెలకు ఐదుసార్లు సోడియం హైపోక్లోరైడ్ పిచికారి చేయాలన్నారు. ఈ నెల చివరి నాటికి రెండు సార్లు, జూన్ నెలలో ఐదు సార్లు పిచికారి చేయాలని సూచించారు. చెత్తా చెదారం వెంటవెంటనే తొలగించడంతో పాటు దోమలు రాకుండా విరివిగా ఫాగింగ్ చేయాలని సిఎ కెసిఆర్ అన్నారు. . గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇది కరోనా వ్యాప్తి నివారణకు, సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుందన్నారు.

ప్రజాప్రతినిధులు నిరంతరం పర్యవేక్షించాలి

పట్టణాల్లో మేయర్లు, చైర్ పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్, ఎంపిటిసి, ఎంపిపి, జెడ్‌పిటిసి, జెడ్‌పి చైర్ పర్సన్లు పరిశుభ్రత కార్యక్రమాల పర్యవేక్షణలో క్రియాశీలకంగా వ్యవహరించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. వారి వారి పరిధిలో గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రజలను చైతన్య పరచాలని సిఎం కెసిఆర్ సూచించారు. ప్రభుత్వం యంత్రాంగంతోనూ సక్రమంగా పని చేయించాలన్నారుయ. మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పట్టణాలు, గ్రామాల పారిశుధ్య పనులపై తగిన సూచనలు చేయాలని సిఎం చెప్పారు.

ఆర్ధిక పరిస్థితి బాగా లేకున్నా..

లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య పనులు, ఇతర అత్యవసర పనులు చేయడానికి నిధుల కొరత లేకుండా చేస్తున్నామని సిఎం కెసిఆర్ అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు నెలవారీగా ఇవ్వాలని నిర్ణయించిన నిధులను విడుదల చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన నిధులను ఇప్పటికే విడుదల చేశామన్నారు. జూన్ మాసానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయాలని ఇప్పటికే ఆర్థిక శాఖను ఆదేశించామని ముఖ్యమంత్రి చెప్పారు.

బస్తీ దవాఖానాలకు మంచి స్పందన..

హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖానాలకు మంచి స్పందన వచ్చిందని సిఎం అన్నారు. ప్రస్తుతం 123 బస్తీ దవాఖానాలు నడుస్తున్నాయని , మరో 45 బస్తీ దవాఖానాలు వెంటనే ప్రారంభించాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావులను ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఆదేశించారు

వచ్చే నెల 20 నుంచి హరితహారం..

రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 20 నుంచి తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిర్వహించాలని అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. దీనిపై అన్ని ప్రభుత్వ శాఖలు నిర్ధిష్ట విధానంతో ముందుగు సాగాలన్నారు. పెద్దఎత్తున మొక్కలను నాటడంతో పాటు ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News