Sunday, April 28, 2024

కరోనా కేసుల్లో చైనాను దాటేశాం

- Advertisement -
- Advertisement -

Coronavirus

దేశవ్యాప్తంగా 85వేలు దాటిన వైరస్ బాధితులు
చైనా కేసులు 82,933
2,649 మంది వైరస్‌కు బలి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా కేసులు మాత్రం పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో దాదాపు నాలుగు వేలకు పైగా పాజిటివ్ కేసులతో 85 వేల మంది బాధితులు నమోదయ్యారు. దీంతో భారత్ చైనాను దాటి పోయినట్టయింది. అక్కడ ఇప్పటి వరకు 82,933 కేసులు మాత్రమే నమోదయ్యాయి. వైరస్ సోకి 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 81,970 కి చేరుకోగా, వైరస్ బారిన పడి ఇప్పటివరకు 2,649 మంది ప్రాణాలు కోల్పోయారు.

కాగా వైరస్‌నుంచి కోలుకొని ఇప్పటివరకు 27,919 మంది డిశ్చార్జి కాగా,51,401 మంది చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. ముంబయిలో గత 24 గంటల్లో కొత్తగా 933 కేసులు నమోదైనాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 17,512కు చేరుకుంది. ఒక్క ధారవి మురికివాడలోనే తాజాగా 84 కేసులు వెలుగు చూశాయి. దీంతో అక్కడ మొత్తం కేసులు 1145కు చేరుకున్నాయి. ఇక తమిళనాడులో తాజాగా 385 కేసులు, అయిదు మరణాలు నమోదైనాయి.

దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 10,108కి చేరుకోగా,71 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక గుజరాత్‌లో గత24 గంటల్లో340 కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 9,932కు చేరుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో వైరస్ కారణంగా 606 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా కేరళలోను కొత్తగా కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ తాజాగా మరో 26 కేసులు వెలుగు చూశాయి. లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు, వలస కూలీల తరలింపు, విదేశాలనుంచి భారత్‌కు ప్రయాణికుల తరలింపు లాంటి వాటి వల్ల కరోనా కేసులు పెరుగుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

గత 24 గంటల్లో మరణించిన వంద మందిలో మహారాష్ట్రలో 44 మంది,గుజరాత్‌లో 20 మంది, ఢిల్లీలో 9, పశ్చిమ బెంగాల్‌లో 8, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో చెరో ఐదు, రాజస్థాన్‌లో నాలుగు, తమిళనాడు, కర్నాటకలలో ఇద్దరేసి, ఆంధ్రప్రదేశ్‌లో ఒకరు ఉన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో అత్యధికంగా 1019 ఉండగా, గుజరాత్‌లో 586 మంది, మధ్యప్రదేశ్‌లో 237 మంది, పశ్చిమ బెంగాల్‌లో 215 మంది, రాజస్థాన్‌లో 125 మంది, ఢిల్లీలో 115 మంది, ఉత్తరప్రదేశ్‌లో 88 మంది మృతి చెందారు.

దుబాయ్‌నుంచి వచ్చిన 20 మందికి కరోనా

ఇదిలా ఉండగా దుబాయినుంచి మంగుళూరుకు వచ్చిన విమానంలో 20 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. గత మంగళవారం 179 మంది ప్రయాణికులతో ఈ విమానం దుబాయినుంచి మంగుళూరుకు చేరుకుంది. ప్రయాణికుల్లో 38 మంది గర్భిణీలు కూడా ఉన్నారు. ప్రయాణికులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 20 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ప్రభుత్వం మిగతా ప్రయాణికులను క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News