రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని యోచిస్తోన్నట్టు తెలిసింది. ఢిల్లీలో శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేసిన సందర్భంలోనూ పరోక్షంగా ఇందుకు సంకేతాలు ఇవ్వడం గమనార్హం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బృందం మావోయిస్టుల సమాచారం సాకుతో ఇతరుల ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ కోసం టెలికాం రెగ్యులేటరీ అథారిటీకి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు సిట్ గుర్తించింది. వీరిలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, జడ్జిలు, న్యాయవాదులు, కేంద్ర మంత్రులు, జర్నలిస్టులు ఉన్నట్టు సిట్ దర్యాప్తులో తేలింది.
ఫోన్లు ట్యాప్ చేసినట్టు బలమైన ఆధారాలు ఉండటంతో ఈ కేసును సిబిఐ కి అప్పగించడమే సబబు అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోన్నట్టు తెలిసింది. ఈ అంశంపై ఇప్పటికే న్యాయనిపుణులతో చర్చించినట్లు సమాచారం. కాగా,ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని, దీంతో ఆయనకు గతంలో సుప్రీంకోర్టు కల్పించిన వెసులుబాటును రద్దు చేయాలని సిట్ అధికారులు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది ఈనెల 22న విచారణకు రానున్నది. ఆ రోజు సుప్రీంకోర్టు ఏం చెబుతుందో చూసాక ఈ కేసును సిబిఐకి అప్పగించే అంశం పై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.