Saturday, May 4, 2024

మాల్దీవుల ఎన్నికల్లో ముయిజ్జు పార్టీదే విజయం

- Advertisement -
- Advertisement -

మాల్దీవులలో ఆదివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో అధికారంలో ఉన్న అధ్యక్షులు మెహమ్మద్ ముయిజ్జు పార్టీ ఘన విజయం సాధించింది. 93 మంది సభ్యుల పార్లమెంట్‌లో ముయిజ్జు పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పిఎన్‌సి) పార్టీకి 68 సీట్లు, మిత్రపక్ష పార్టీలు ఎంఎన్‌పి, ఎండిఎలకు కలిపి మూడు సీట్లు దక్కాయి. ఈ విధంగా అధికార పార్టీకి మొత్తం మీద 71 స్థానాలలో విజయంతో తిరుగులేని ఆధిక్యత సాధించింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముయిజ్జు చైనా అనుకూలతనే చాటుకుంటూ వచ్చారు. పలు సందర్భాలలో భారతదేశ వ్యతిరేకతను ప్రదర్శించారు. ఇక తమ దేశంపై భారతదేశ పెద్దన్న పాత్ర కుదరదని తేల్చిచెప్పారు. ఇప్పటి ఎన్నికల ఫలితాలు ముయిజ్జు చైనా అనుకూల విధానాలకు ప్రజల మద్దతుగా భావిస్తున్నారు. అధికార పార్టీ మూడింట రెండొంతుల బలం సంతరించుకోవడంతో ఈ ఎన్నికల పట్ల నిశిత పరిశీలనకు దిగిన భారతదేశానికి షాక్ తగిలినట్లు అయింది.

తమ దేశంపై భారతదేశ ఆధిపత్యాన్ని నీరుగార్చడం జరుగుతుందని 45 సంవత్సరాల ముయిజ్జు పలుసార్లు తమ చైనా జిందాబాద్ వైఖరిని సమర్థించుకున్నారు. ఇప్పటి ఎన్నికలలో భారత అనుకూలమైన మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ (ఎండిపి) ఈసారి కేవలం 15 స్థానాలనే గెల్చుకుంది. ఈ పార్టీకి సభలో ఇంతకు ముందు 65 స్థానాలు ఉన్నాయి. ఈ పార్టీకి సారధిగా మాజీ అధ్యక్షులు ఇబ్రహీం మెహమ్మద్ సొలిహ్ నాయకత్వం వహిస్తున్నారు. అత్యంత ప్రధానమైన మాలే ప్రాంతంలో కూడా అధికార పార్టీనే ప్రాబల్యం చాటుకుంది. మాల్దీవులలో తన సానుకూల ప్రభుత్వం రావడంతో చైనా ఈ ప్రాంతంలో మరింతగా సముద్ర , తీర ప్రాంత సైనిక పాటవం పెంచుకునేందుకు, ఈ క్రమంలోనే మారిషస్‌కు మరింత సాయం అందిస్తూ వ్యూహాత్మక పాత్ర వహిస్తుందని స్పష్టం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News