పరిశీలనలో ఉందన్న రాజ్యసభ చైర్మన్
న్యూఢిల్లీ: ఆక్సిజన్ కొరత కారణంగా దేశంలో కొవిడ్ పేషంట్లు ఎవరూ మృతి చెందలేదంటూ చేసిన ప్రకటనపై కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రిపై కాంగ్రెస్ సభ్యుడు కెసి వేణు గోపాల్ ఇచ్చిన సభాహక్కుల నోటీసు పరిశీలనలో ఉన్నట్లు రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు శుక్రవారం తెలిపారు. శుక్రవారం సభ ప్రారంభం కాగానే వేణుగోపాల్ లేచి సభను తప్పుదోవ పట్టించినందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ పై 187 నిబంధన కింత సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టేందుకు తాను నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. సభలో తాను లేవనెత్తిన ఒక ప్రశ్నకు సంబంధించి తాను ఈ నోటీసు ఇచ్చినట్లు ఆయన చెప్పారు.
కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలో తీవ్ర ఆక్సిజన్ కొరత కారణంగా రోడ్డుపై కానీ, ఆస్పత్రుల్లో కానీ పెద్ద ఎత్తున కరోనా రోగులు మరణించిన విషయం వాస్తవమేనా అన్నది తన ప్రశ్న అని ఆయన చెప్పారు. అయితే ఆక్సిజన్ కొరత కారణంగా ఎవరూ చనిపోలేదని మంత్రి సమాధానమిచ్చినట్లు ఆయన చెప్పారు. కాగా నోటీసు తనకు అందినట్లు చైర్మన్ చెప్తూ దాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ‘నోటీసును మంత్రికి పంపాక ఆయననుంచి సమాధానాన్ని కోరుతాను. ఆ ప్రక్రియ సాగుతోంది.దానికో పద్ధతి ఉంది’ అని వెంకయ్య చెప్పారు. ఢిల్లీ, గోవా, హర్యానా, కర్నాటక రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతకు సంబంధించి మీడియాలో వచ్చిన ఆరు కథనాలను వేణుగోపాల్ తన నోటీసులో ప్రస్తావిస్తూ, వాస్తవం ఇలా ఉండగా, మంత్రి ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను వక్రీకరించడానికి ప్రయత్నించారన్నారు.