Thursday, May 2, 2024

మావోయిస్టు పార్టీలో పదోన్నతులు

- Advertisement -
- Advertisement -

Promotions in the Maoist party

పార్టీలో మార్పుచేర్పులపై ఇంటెలిజెన్స్ ఆరా..!
హరిభూషణ్ స్థానంలో సీనియర్లకు అవకాశం

మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా సోకి మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ నేత హరిభూషణ్ మృతి చెందడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు మావోయిస్టు పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్టీలోని సీనియర్ నేతలు లోకేటి చందర్, దామోదర్, బండి ప్రకాశ్, సాంబయ్యలలో ఒకరికి రాష్ట్రకార్యదర్శిగా నియమించేందుకు సన్నాహాలు చేస్తోంది. కాగా రాష్ట్ర నూతన కార్యదర్శిగా ఎవరిని నియమిస్తారన్న విషయాలపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. మంచి ఊహకర్తగా పేరున్న హరిభూషణ్ స్థానంలో అదే స్థాయి వ్యక్తి కోసం పార్టీ అన్వేషిస్తోంది.

ఇందులో భాగంగా పార్టీలోని సీనియర్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. మావోయిస్టు పార్టీకి పోలీసుల ఎన్ కౌంటర్‌కు తోడు కరోనా కాటు తీవ్ర ప్రభావం చూపించింది. కేంద్ర స్థాయి నాయకుల నుంచి కొత్తగా దళంలో చేరినవారు కరోనా బారిన పడినట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించిన విషయం విదితమే. తాజాగా బడే చొక్కారావుకు సైతం కరోనా సోకినట్లు పోలీసు ఇంటెలిజెన్స్ పేర్కొంటున్నాయి. అలాగే ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో ఆ పార్టీ కార్యకలాపాలు ఉధృతంగా సాగుతున్న సమయంలో కేంద్ర కమిటీ నాయకుడు కత్తి మోహన్‌రావు అలియాస్ ప్రకాశ్ గుండెపోటుతో మరణించగా, హరిభూషణ్, మహిళా నాయకురాళ్లు సమ్మక్క అలియాస్ భారతక్క, శారద కరోనాతో చనిపోయారు.

పార్టీ పునః నిర్మాణం ః

కరోనా మావోయిస్టు పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టిన క్రమంలో కేంద్ర స్థాయి మావోయిస్టులు ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ నిర్మాణ పనులపై దృష్టి పెట్టాలని ప్లాన్ చేస్తోంది. చనిపోయినవారి స్థానంలో కొత్తవారిని నియమించేందుకు ఇప్పటికే కేంద్ర కోర్ కమిటీ సభ్యులు రంగంలోకి దిగినట్లుగా సమాచారం. కరోనా దెబ్బతో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే అతని స్థానంలో ఆ పార్టీ ఎవరిని నియమిస్తుందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విప్లవోద్యమంలో చివరి వరకు చురుకుగా పోరాడిన హరిభూషణ్ ఈనెల 21న కోవిడ్‌తో మృతి చెందడంతో అతని స్థానంలో సమర్థులకు అవకాశం కల్పించేందుకు ఆ పార్టీ కసరత్తు ప్రారంభించింది.

లోకేటి చందర్ అలియాస్ స్వామి

హరిభూషణ్ స్థానంలో రాష్ట్ర కార్యదర్శిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన లోకేటి చందర్ అలియాస్ స్వామిని నియమించవచ్చనే చర్చ మొదలైంది. నిజామాబాద్ జిల్లా కార్యదర్శిగా స్వామి చాలాకాలం పనిచేయగా, ఆయన సహచరి లోకేటి లక్ష్మి అలియాస్ సులోచన కూడా ఉద్యమంవైపే నడిచింది. మైదాన ప్రాంతాల నుంచి దళాలను ఎత్తివేసే సమయంలో దండకారణ్యానికి తరలివెళ్లినా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ కమిటీని కూడా స్వామి లీడ్ చేశాడు. మూడు దశాబ్దాలుగా ఉద్యమంలో పనిచేస్తున్న స్వామి ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కీలక బాధ్యతల్లో ఉండగా, ఉద్యమ అవసరాల రీత్యా ఆయనకు అవకాశం కల్పించవచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

తెరపైకి మరోపేరు 

హరిభూషణ్ స్థానంలో 1991 నుంచి పార్టీలో కీలకంగా ఉన్న కొంకటి వెంకట్ అలియాస్ రమేష్ పేరు తెరపైకి వచ్చింది. కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యుడిగా, ఆనుపురం కొంరయ్య అలియాస్ సుధాకర్ (ఏకే) ఎన్‌కౌంటర్ తర్వాత జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేసిన ఆయన అప్పటి ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీలో సభ్యుడిగా పని చేశాడు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ దండకారణ్యంలో కీలకంగా ఉన్న రమేష్ పేరు కూడా వినిపిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News