జెఎన్యు హింసాకాండపై దేశ విదేశీ వర్సిటీల్లో నిరసనల వెల్లువ
న్యూఢిల్లీ : జెఎన్యులో ఆదివారం సాయంత్రం చెలరేగిన హింసాకాండ దేశ విదేశాల్లోని యూనివర్శిటీల్లో ఆందోళనల ప్రకంపనలకు దారి తీసింది. దేశం లోని పాండిచ్చేరి యూనివర్శిటీ నుంచి లండన్ లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వరకు విద్యార్థుల నుంచి ఆగ్రహావేశాలు చెలరేగాయి. దేశం లోని పాండిచ్చేరి యూనివర్శిటీ, బెంగళూరు యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్, అలిగడ్ ముస్లిం యూనివర్శిటీ, బెనారస్ హిందూ యూనివర్శిటీ, చండీగఢ్ యూనివర్శిటీ, బెంగళూరు లోని నేషనల్ లా యూనివర్శిటీ, పుణె లోని సావిత్రిబాయి పులే యూనివర్శిటీ, టిఐఎస్ఎస్ ముంబై, జాదవ్ పూర్ యూనివర్శిటీ, ప్రెసిడెన్సీ యూనివర్శిటీ, కోల్కతా, ఐఐటి ముంబై విద్యార్థులు ఆందోళనల బాట పట్టారు. జెఎన్యు క్యాంపస్లో జరిగిన హింసాకాండకు నిరసనగా శాంతియుత ధర్నాలు చేశారు.
ఈరోజు వారిది, రేపు మాది, హింస ఏ రూపంలో ఉన్నా ఖండించ దగిందని పాండిచ్చేరి యూనివర్శిటీ విద్యార్థి రైజా ఆందోళన వెలిబుచ్చారు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, కొలంబియా యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ ససెక్స్, విద్యార్థులు క్యాంపస్ లోని విద్యార్థులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ పోస్టర్లు ప్రదర్శిస్తూ శాంతియుత ర్యాలీలు నిర్వహించారు. నేపాల్ లోని జెఎన్యు విద్యార్థులు ఖాట్మండు లోని మైతీఘర్ మండల వద్ద సమావేశమై నిరసన తెలిపారు. ముంబై లో గత అర్ధరాత్రి విద్యార్థులు గేట్వే ఆఫ్ ఇండియా వద్ద సమావేశమై జెఎన్యు విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. ఈ నిరసనలో మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవాడ్ పాలుపంచుకున్నారు.
వారితో కూర్చుని డిమాండ్లపై చర్చించారు. బుద్ధి పూర్వకంగా ప్రజలు భయపడితే అరాచకం ప్రబలడానికి దారి తీస్తుందని ఆయన పాత్రికేయులకు వివరించారు. హింసను ఖండిస్తూ విద్యార్థులు నినాదాలు చేశారు. పుణె లోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు కూడా ధర్నా చేశారు. పంజాబ్ యూనివర్శిటీ వద్ద కొందరు విద్యార్థులు ఒక సెమినార్లో హర్యానా స్పీకర్ గ్యాన్చంద్ గుప్తా ప్రసంగిస్తుండగా అడ్డు తగిలి బిజెపి, ఆర్ఎస్ఎస్, ఎబివిపిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోల్కతా లో ఎఐఎస్ఎ, ఎస్ఎఫ్ఐల అనుబంధ .జాదవ్పూర్ యూనివర్శిటీ విద్యార్థులు మానిక్తల ఏరియా లోని ఎబివిపి కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన సాగించారు. ప్రెసిడెన్సీ యూనివర్శిటీ విద్యార్థులు కూడా వీరితో కలిసి ప్రదర్శన సాగించారు.