కేంద్రానికి రాహుల్ సూచన
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆరు రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి మద్దతు తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు మనం ఎప్పటికీ రుణపడి ఉంటామని, ఇకనైనా ప్రభుత్వం అహంకారం వీడి అన్నదాతలకు న్యాయం చేయాలని కోరారు. ‘మనకు అన్నం పెట్టే రైతన్న నేడు రోడ్డెక్కాడు. కానీ టీవీల్లో అబద్ధపు ప్రచారాలు ఇంకా కొనసాగుతున్నాయి. కర్షకుల శ్రమకు మనం ఎప్పటికీ రుణపడి ఉన్నాం. అలాంటి అన్నదాతలకు న్యాయం, హక్కులు కల్పించి రుణం తీర్చుకోవాలే కానీ.. వారిపై లాఠీచార్జ్లు, భాష్పవాయువులు ప్రయోగించి కాదు. ఇకనైనా మేల్కొనండి. అహంకారమనే గద్దె దిగి రైతులకు హక్కు కల్పించి రుణం తీర్చుకోండి’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు.