అర్థాంతరంగా రద్దవుతున్న ట్రిప్పులు
తగ్గిన ప్రయాణికులు.. తగ్గుతోన్న ఆదాయం
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావం ఆర్టిసి ఆదాయం మీద పడుతోంది. దీంతో సంస్థ పెద్ద ఎత్తున నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ఉన్న 29 డిపోల్లోని 2250 బస్సుల ద్వారా ప్రతి రోజు సుమారు 25 నుంచి 30 వేల 45వేల ట్రిప్పులతో 8 లక్ష కిలో మీటర్లు తిరుగుతూ 20 నుంచి 25 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు ఆర్టిసి చేర వేస్తుంది. కరోనా కారణంగా అసలే నష్టాల్లో ఉన్న ఆర్సిటిపై వర్షాల ప్రభావం కూడా పడింది.వర్షాల కారణంగా ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో పాటు గుంతల మయంగా రోడ్లు తయారు కావడంతో బస్సులను పూర్తి స్థాయిలో ట్రిప్పులు తిప్పలేక అర్థంతరంగా వాటిని రద్దు చేయడం జరుగుతోంది. వర్షం కారణంగా పెద్ద సంఖ్యలో ట్రిప్పులు రద్దుకావడంతో సంస్థకు వచ్చే ఆదాయం ఆయా రోజుల్లో పడిపోతుంది.
అంతే కాకుండా సంస్థలో ఉన్న కొన్ని వందల బస్సులు ఫిట్నెస్ లేక పోవడం వాటితోనే సంస్థ నెట్టుకు రావడంతో అవి నడి రోడ్దు మీదనే అకస్మాత్తుగా మొరాయిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావడమే కాకుండా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతోంది.దీంతో సంస్థ కూడా పెద్ద మొత్తంలో తనకు వచ్చే ఆదాయాన్ని కోల్పోవడం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇదిలా ఉండగా ఉన్న బస్సుల షెడ్యూల్ కూడా ఒక పద్దతి ప్రకారం లేక పోవడం కూడా హైదరాబాద్లో ఆర్టిసికి నష్టాలకు కారణం అవుతోందని కార్మికులు వాపోతున్నారు. ప్రయాణికులకు అనుగుణంగా బస్సులను పెంచడంలో యాజమాన్య విఫలం అవుతోందని వారు ఆరోపిస్తున్నారు. నడుస్తున్న బస్సుల నిర్వహణ అధికారుల సమన్వయ లోపం ప్రయాణికులకు శాపంగా మారుతోంది.
అవసరమైన అన్ని రూట్లలో ఒక దాని వెంట ఒకటి వెళ్ళడం, మధ్యలో చాలా సమయం వరకు బస్సులు రాక పోవడం వంటి కారణాలతో ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ వాహనాలు వైపు దృష్టి మళ్ళిస్తున్నారు. దీంతో ఆర్టిసి నిర్వహిస్తున్న బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో తగ్గిపోవడంతో నష్టాలు రోజుకు అంతకు అంత పెరిగిపోతున్నాయి. అసలే క్రమబద్ధంగా లేని షెడ్యూల్తో నడుస్తున్నన బస్సులు చెడిపోయిన కారణంగా ట్రాఫిక్ జామ్లతో పరిస్థితి మరింత దారుణంగా మారింది.అధికారులు సమన్వయంతో బస్సులు షెడ్యూళ్ళను క్రమబద్దీకరించాలని కోరుతున్నారు. ఏది ఏమైనా అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తే కాని ప్రయాణికులు ప్రజా ప్రైవేట్ రవాణా( ఆటోలు,క్యాబ్లు) ఆశ్రయించకుండా ఉంటారు. లేని పక్షంలో వారు ప్రత్యామ్నాయ మార్గంలో భాగంగా ఆటోలను,క్యాబ్లను ఆశ్రయిస్తురానడంలో ఎటువంటి సందేహం లేదు.
పత్యేక చర్యలు చేపడుతున్నాం
వర్షాకాలంలో వస్తున్న సమస్యలు పరిష్కరించేందుకు ట్రాఫిక్ సూపర్ వైజర్లను ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు.వీరు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బస్సులకు, ప్రయాణికులకు ఎటువంటి సమస్యలు రాకుండా పర్యవేక్షిస్తుంటారని తెలిపారు.వీరు ముఖ్యంగా ట్రాఫిక్ అధికంగా ఉండే చార్మినార్, ఫరూక్నగర్, సీబీఎస్,రామ్నగర్, ఆరామ్ఘర్, కోటి మెడికల్ కాలేజ,ప్రసూతి ఆసుపత్రి, ఉమెన్స్ కాలేజ్, అఫ్జల్గంజ్, ఉప్పల్ ఎక్స్రోడ్స్, నాంపల్లి,లక్డికాపూల్, చిలుకూరు బాలాజి టెంపుల్, చిలకలగూడ్ ఎక్స్రోడ్స్, సికింద్రాబాద్, రెజిమెంటల్ బజార్ ,ఈసీఐఎల్ ఎక్స్రోడ్స్, పటాన్చెరు, లింగంపల్లి, సనత్నగర్ ,బోరబండ ,దిల్షుక్నగర్, మలక్పేట, జియాగూడ, లక్డికాపూల్, తదితర రద్దీ ప్రదేశాల్లో వీరిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతే కాకుండా 6 రిలీఫ్ వ్యాన్లు, 3 బైక్స్ను, ఎల్బినగర్, కోటి, ఈఎస్ఐ, లింగంపల్లి, సనత్నగర్ ఎక్స్రోడ్స్ ,ఎంజిబిఎస్, మైత్రివనం, సికింద్రాబాద్ వద్ద ఏర్పాటు చేసినట్లు తెలిపారు.