Tuesday, May 7, 2024

విద్వేష వ్యాఖ్యలపై రాజస్థాన్‌లో రాజాసింగ్‌పై పోలీసు కేసు

- Advertisement -
- Advertisement -

కోట: ఒక మతాన్ని కించపరుస్తూ విద్వేషపూరిత ప్రసంగాన్ని చేసినందుకు బిజెపి నుంచి సస్పెండ్ అయిన తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై రాజస్థాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గానికి రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా ఇటీవల రాజస్థాన్‌లోని కోటలో జరిగిన శౌర్య వాహన్ ర్యాలీ, స్వాభిమాన్ సభలో రాజాసింగ్ చేసిన విద్వేషపూరిత ప్రసంగంపై కేసు నమోదైంది. మత సామరస్యానికి విఘాతం కలిగించే రీతిలో రాజాసింగ్ ప్రసంగించినట్లు ఫిర్యాదుదారుడు ఆరోపించారు. మతం, వర్ణం, జన్మస్థానం, నివాసం, భాష తదితర అంశాల ప్రాతిపదికన వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొడుతున్నారన్న ఆరోపణతో ఐపిసిలోని సెక్షన్ 153ఎ కింద రాజాసింగ్‌పై కున్హడి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

రాజాసింగ్ ఆ సభలో ప్రసంగిస్తూ.. లవ్ జిహాద్‌ను, ఉగ్రవాద సంస్థలను అడ్డుకుని దేశాన్ని, హిందూ మతాన్ని కాపాడుకునేందుకు ప్రతి యువకుడు మహారాణా ప్రతాప్‌గా మారాలంటూ పిలుపునిచ్చారు. దేశంలో ఉగ్రవాద సంస్థలు ఉన్నంతవరకు దేశం అభివృద్ధి సాధించలేదని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News