Tuesday, April 30, 2024

పరారీకి యత్నించిన ఢిల్లీ బాలిక అత్యాచార నిందితులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఒక మైనర్ బాలికపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడడంతోపాటు బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ప్రభుత్వ అధికారి ఒకరు పోలీసులు అరెస్టు చేయడానికి ముందు అక్కడి నుంచి తన భార్యతో కలసి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించినట్లు సిసి టివి కెమెరాలలో రికార్డయినట్లు వర్గాలు మంగళవారం తెలిపాయి.
ఢిల్లీ ప్రభుత్వ అధికారి ప్రేమోదయ్ ఖాఖా, ఆయన భార్య సీమా రాణిలను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

అయితే..తమను పోలీసులు అరెస్టు చేయడానికి ముందు ముందస్తు జామీను కోసం ఒక న్యాయవాదిని సంప్రదించేందుకు వారిద్దరూ ఇంటి నుంచి బయల్దేరారు. ఆగస్టు 13వ తేదీన వీరిపై కేసు నమోదు కాగా సస్పెండ్ కాక ముందు ఖాఖా మహిళా, శిశు అభివృద్ధి శాఖలో డిప్యుటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాల మేరకు ఖాఖాను సస్పెండ్ చేశారు.
బురారీ ప్రాంతంలోని శక్తి ఎన్‌క్లేవ్‌లో ఈ జంట నివసిస్తోంది. బాధిత మైనర్ బాలిక వీరి ఇంట్లోనే నివసిస్తోంది. ఖాఖాను మామ అనే పిలిచే బాలిక తన తండ్రిని 2020 అక్టోబర్ 1వ తేదీన కోల్పోయింది. ఆ బాలిక తండ్రి, ఖాఖా స్నేహితులు. బాధిత బాలికను కలుసుకుని మాట్లాడేందుకు సెయింట్ స్టీఫెన్ ఆసుపత్రికి వెళ్లిన ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ పోలీసులు అనుమతి నిరాకరించడంతో సోమవారం రాత్రంతా ఆసుపత్రి వద్దే ధర్నా చేశారు. అయితే ఆమె మంగళవారం తన ధర్నాను విరమించుకున్నారు.

బాలిక ప్రస్తుతం వైద్యుల పరిశీలనలో ఉన్నందున ఎవరినీ కలుసుకోవడానికి బాలిక తల్లి అంగీకరించడం లేదని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఇలా ఉండగా నిందితులలో ఒకరైన సీమా రాణిని సోమవారం కోర్టులో హాజరుపచగా ఆమెకు జుడిషియల్ కస్టడీ విధించారని, ఖాఖాను మంగళవారం కోర్టులో హాజరుపరుస్తామని డిసిపి సాగర్ సింగ్ కల్సీ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News