ఇద్దరు లంక క్రికెటర్లకు చోటు
బెంగళూరు: యుఎఇ వేదికగా జరుగనున్న ఐపిఎల్ రెండో దశ మ్యాచ్ల కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆర్సిబి ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్న సైమన్ కటిచ్ వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమయ్యాడు. ఐపిఎల్ మలిదశ మ్యాచ్లకు తాను అందుబాటులో ఉండడం లేదని కటిచ్ ఇప్పటికే జట్టు యాజమాన్యానికి స్పష్టం చేశాడు. దీంతో కటిచ్ స్థానంలో టీమ్ డైరెక్టర్ మైక్ హెస్సెన్ను కోచ్గా నియమించారు. ఐపిఎల్ రెండో దశ సీజన్కు హెస్సెన్ కోచ్గా వ్యవహరిస్తాడు. ఇక ముగ్గురు క్రికెటర్లను కూడా జట్టులోకి తీసుకున్నారు.
శ్రీలంక ఆల్రౌండర్లు వానిందు హసరంగా, దుష్మంత చమీరాలకు జట్టులో చోటు లభించింది. అంతేగాక ఆస్ట్రేలియాకు చెందినటిమ్ డేవిడ్ కూడా జట్టులో చోటు సంపాదించాడు. కొంతమంది క్రికెటర్లు ఐపిఎల్ రెండో దశకు అందుబాటులో లేకుండా పోవడంతో వీరి స్థానంలో కొత్త ఆటగాళ్లను తీసుకున్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జంపాలు ఐపిఎల్కు అందుబాటులో ఉండడం లేదని ప్రకటించారు. డానియల్ సామ్స్ కూడా జట్టుకు దూరమయ్యాడు. దీంతో వీరి స్థానంలో ముగ్గురు కొత్త ఆటగాళ్లను తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆర్సిబి యాజమాన్యం శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.