Saturday, May 18, 2024

సోమవారం నుంచి వర్షాలు

- Advertisement -
- Advertisement -

మండుతున్న ఎండలతో బెంబేలెత్తిపోతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ తీపికబురందించింది. సోమవారం నుంచి వాతావరణం చల్లబడనున్నట్టు తెలిపింది. రాష్ట్రంలో ఒక మోస్తర నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. అయితే మరో 24గంటలు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇదే విధంగా కొనసాగుతాయని , వడగాల్పల తీవ్రత కూడా అధికంగా ఉంటుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరికలు చేసింది.గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నదవుతున్నాయి. గ్రేటర్‌కు ఆదివారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని, అలాగే సోమవారం నుంచి ఎల్లో అలర్ట్ వస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. మే 7, 8 తేదీల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ విధించామని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల దాకా ఎవరు బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. ఒకవైపు పెరిగిన ఈ ఎండలతో బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఎండ వేడి నుంచి రక్షణ పొందేందుకు చల్లని వస్తువులు సేవిస్తే మంచిదని, కొబ్బరి బొండాం, మంచినీళ్లు, మజ్జిగ, లస్సీ వంటి పానీయాలు సేవిస్తే ఎండ దెబ్బ నుంచి రక్షణ పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

జగిత్యాలలో అత్యధికం ఉష్ణోగ్రతలు
అత్యధికంగా జగిత్యాల జిల్లాలో భానుడు భగభగ మండుతున్నాడు. ఈ జిల్లాలో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. శనివారం కూడా ఉదయం నుంచే ఉక్కపోతతో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఈ జిల్లాలోని అల్లిపుర, వీణవంక ప్రాంతాలలో కూడా 46.8డిగ్రీలు నమోదయ్యాయి. ఎండ తాకిడికి రహదారులు బోసిపోతున్నాయి. అత్యవసరం ఉంటే తప్ప జనం బయటకు రావటం లేదు. చిన్న పిల్లలు, వృద్ధులు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. మరోవైపు జగిత్యాలతో పాటే మరికొన్ని ప్రాంతాల్లో కూడా శనివారం ఉష్ణోగ్రతలు 46.7 డిగ్రీలుగా నమోదయ్యాయి.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట, నల్లగొండ జిల్లా తెల్దేవరపల్లిలో 46.7డిగ్రీలు నమోదయ్యాయి. , నారాయణపేట 46.4 డిగ్రీలు, నిజామాబాద్ 46.4 డిగ్రీలు, పెద్దపల్లిలో 46.1 డిగ్రీ, కామారెడ్డి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో 45.9 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News