Saturday, July 27, 2024

నేడు రైతుల ఖాతాల్లోకి పంటనష్ట పరిహారం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతన్నలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పంట పరిహారం నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నంబరుతో లింకేజీ లేకపోతే తక్షణమే బ్యాంకు వెళ్లి అనుసంధానం చేసుకోవాలని రై తులకు వ్యవసాయ శాఖ సూచించింది. రాష్ట్రంలో వడగళ్ల వానలకు దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టపరిహారం చెల్లించేందుకు సర్కారు చర్యలకు ఉపక్రమించింది. రెవెన్యూ శాఖ సహజ ప్రకృతి విపత్తుల నిర్వహణ కింద 15 కోట్ల 81 లక్ష ల 41 వేల రూపాయలను రైతులకు పరిహారంగా మంజూరు చేస్తూ ఆర్థికపరమైన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది యాసంగి సీజన్‌లో భాగంగా మార్చి 16 నుంచి 24వ తేదీ వరకు కురిసిన వడగండ్ల వర్షాల ప్రభావంతో కామారెడ్డి, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, సంగారెడ్డి తదితర పది జిల్లాల్లో పంట నష్టం జరిగింది. క్షేత్రస్థాయిలో సర్వే చేసిన అనంతరం 15 వేల 814.03 ఎకరాల విస్తీర్ణంలో వివిధ వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 15 కోట్ల 81 లక్షల 40 వేల రూపాయలు రైతులకు పంట నష్టపరిహారం కింద చెల్లించాల్సి ఉన్న దృష్ట్యా, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆగిపోయింది. రైతుల ఇబ్బందులు పరిగణలోకి తీసుకుని ఆ మొత్తం విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరగా ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో తదనుగుణంగా నష్టపరిహారం మొత్తాన్ని నేరు గా రైతుల బ్యాంకు ఖాతాల్లో మంగళవారం లోపు పూర్తి స్థాయిలో జమ చేయడానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.ఇందుకు సంబంధించి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నంబరుతో లింకేజీ లేకపోతే తక్షణమే బ్యాంకు వెళ్లి రైతులు అనుసంధానం చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. ప్రతి రైతు కూడా ఆ మొత్తం నష్టపరిహారం సాయం వ్యవసాయ సంబంధ పెట్టుబడుల కోసం వినియోగించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకొని ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా పంట నష్టం సంభవించిన నెలన్నర రోజుల వ్యవధిలోనే ఈ నష్టపరిహారం అందించడం రైతులకు పెద్ద ఉపశమనం కలుగనుంది.

మూడు జిల్లాలకే అత్యధికంగా నిధులు
రాష్ట్రంలో పంట నష్టం పరిహారం కింద మూడు జిల్లాలకే అత్యధికంగా నిధులు జమ కానున్నాయి. ఇందులో కామారెడ్డి జిల్లాకు మొత్తం 10,328 ఎకరాలకు సంబంధించిన 9107మంది రైతులకు పరిహారం అందనుంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో 1652 ఎకరాలకు సంబంధించిన 1809మంది రైతులకు పరిహారం అందనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1014 ఎకరాలకు సంబంధించి 1036మంది రైతులకు నష్ట పరిహారం లభించనుంది. మిగిలిన జిల్లాల్లో సిద్దిపేట జిల్లాలో 746 ఎకరాలుకుగాను 793మంది రైతులకు , మెదక్ జిల్లాలో 714 ఎకరాలకుగాను 957మంది రైతులకు ,అదిలాబాద్ జిల్లాలో 545 ఎకరాలకు గాను 370మంది రైతులకు , నిర్మిల్ జిల్లాలో 332 ఎకరాలకు గాను 519మంది రైతులకు,మంచిర్యాల జిల్లాలో 244ఎకరాలకుగాను 376మంది రైతులకు , కరీంనగర్‌జిల్లాలో 160 ఎకరాలకుగాను 160మంది రైతులకు , సంగారెడ్డి జిల్లాలో 76 ఎకరాలకుగాను 119 మంది రైతులకు పంట నష్టం పరిహారం అందించే చర్యలను ప్రభుత్వం ప్రారంభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News