Thursday, May 2, 2024

అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణపై పునరాలోచన

- Advertisement -
- Advertisement -

Rethinking revival of international air services

‘ఒమిక్రాన్’ భయాల నేపథ్యంలో అత్యవసర సమావేశంలో కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న నేపథ్యంలో వచ్చే నెల 15నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని రెండు రోజుల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా విదేశాలనుంచి ముఖ్యంగా ఒమిక్రాన్ వైరస్‌ను గుర్తించిన దేశాలనుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కఠినంగా స్క్రీనింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు హోం శాఖ ప్రతినిధి తెలిపారు. ఈ సమావేశానికి ఈ సమస్యతో సంబంధం ఉన్న వివిధ శాఖలకు చెందిన అధికారులు కూడా హాజరయ్యారని ఆయన తెలిపారు. కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌పై ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేసిన ఒక రోజు తర్వాత ఈ సమావేశం జరగడం గమనార్హం. దాదాపు 20 నెలల పాటు సుదీర్ఘ విరామం తర్వాత డిసెంబర్ 15నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ప్రభుత్వం ఈ నెల 26న ప్రకటించిన విషయం తెలిసిందే.

ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితిని ఈ సమావేశంలో సమీక్షించారని, వైరస్ కట్టడిని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవలసిన చర్యలను కూలంకషంగా చర్చించినట్లు హోం శాఖ ప్రతినిధి తెలిపారు. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలకు అనుగుణంగా అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసులను పునరుద్ధరించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం పునస్సమీక్షిస్తుందని ఆ ప్రతినిధి తెలిపారు. అంతేకాకుండా వివిధ దేశాలనుంచి ముఖ్యంగా రిస్క్ కేటగిరీలో ఉన్న దేశాలనుంచి వచ్చే ప్రయాణికుల టెస్టింగ్, నిఘాకు సంబంధించి ఉన్న నిబంధనావళి( ఎస్‌ఓఎస్)ను కూడా ప్రభుత్వం సమీక్షిస్తుందని ఆ ప్రతినిధి వరస ట్వీట్లలో తెలిపారు. నీతి ఆయోగ్ సభ్యుడు వికె పాల్, ప్రధానమంత్రి ముఖ్య శాస్త్రీయ సలహాదారు విజయ్ రాఘవన్ తదితర నిపుణులు, ఆరోగ్య, పౌర విమానయాన శాఖ, ఇతర మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News