Thursday, May 2, 2024

వరదలతో 30 మంది చనిపోయినా కెసిఆర్ ఎందుకు పరామర్శించడంలేదు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వరదలతో అల్లాడుతుంటే సిఎం కెసిఆర్ పట్టించుకోవడంలేదని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శనివారం రేవంత్ ఉప్పల్, ఎల్ బి నగర్ నియోజకవర్గాలలో పర్యటించారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు. కెసిఆర్‌కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదన్నారు. వరదలపై సమీక్షలు చేయకుండా రాజకీయాలపై దృష్టి పెట్టారని ఎద్దేవా చేశారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కెటిఆర్ బర్త్ డే పార్టీల్లో మునిగిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

Also Read: భద్రకాళి చెరువుకు గండి…. పలు కాలనీలు జలమయం

వరదలతో 30 మంది చనిపోయినా కెసిఆర్ ఎందుకు పరామర్శించడంలేదని రేవంత్ ప్రశ్నించారు. వరద బాధితుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడంలేదా? అని అడిగారు. హైకోర్టు అక్షింతలు వేసినా కెసిఆర్‌కు బుద్ధి రాలేదని చురకలంటించారు. సోమవారంలోగా ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో కదలిక రావాలని, లేకపోతే సోమవారం పార్లమెంట్‌లో నితిన్ గడ్కరీకి నివేదిస్తామన్నారు. వరద సాయం కింద తెలంగాణకు రూ. వెయ్యి కోట్లు ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. వరద సాయం తీసుకురావాల్సిన బాధ్యత తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ఉందని, వెంటనే ప్రధానిని కలిసి నిధులు తీసుకరావాలని రాష్ట్ర బిజెపి నాయకులకు సూచించారు. బిఆర్‌ఎస్, బిజెపి కుమ్మక్కు రాజకీయాలకు పరాకాష్ట అని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News