ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో లభించిన ఒక వాహనం కేసుతోపాటు వ్యాపారవేత్త మన్సుఖ్ హిరన్ మృతి కేసులో అరెస్టయిన సస్సెండెడ్ ముంబయి పోలీసు అధికారి సచిన్ వాజే ఎన్ఐఎ కస్టడీని ముంబయి ఎన్ఐఎ కోర్టు బుధవారం ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించింది. గత నెల 13న వాజేను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ) అరెస్టు చేసింది. వాజేను బుధవారం ప్రత్యేక ఎన్ఐఎ కోర్టు న్యాయమూర్తి పిఆర్ సత్రే ఎదుట హాజరుపరచగా ఆయన ఎన్ఐఎ కస్టడీని ఈ నెల 9 వరకు కోర్టు పొడిగించింది. ఈ కేసు దర్యాప్తు కోసం వాజే రిమాండును మరింత పొడిగించాలని ఎన్ఐఎ కోర్టు అర్థించింది.
ఈ కేసులో మరో ఇద్దరు నిందితులైన సస్సెండెడ్ పోలీసు కానిస్టేబుల్ వినాయక్ షిండే, క్రికెట్ బుకీ నరేష్ గోర్కు ఎన్ఐఎ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనీల్ దేశ్ముఖ్పై ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి కూడా వాజేను ప్రశ్నించడానికి అనుమతించాలన్న సిబిఐ విజ్ఞప్తిని కూడా ఎన్ఐఎ కోర్టు అనుమతించింది. ముకేష్ అంబానీ నివాసం సమీపంలో ఫిబ్రవరి 25న మందుగుండు సామగ్రి ఉన్న ఒక స్కార్పియో లభించింది. ఈ వాహనం సొంతదారుడైన మన్సుఖ్ హిరన్ మార్చి 5వ తేదీన థాణెలోని ముంబ్రా క్రీక్లో మరణించారు.