Wednesday, June 18, 2025

స్థానిక సమరం.. ఎవరికి అనుకూలం?

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో రాజకీయ వాతావరణం మళ్లీ గ్రామ స్థాయి నుంచి వేడెక్కుతోంది. స్థానిక సంస్థల ఎన్నిక లకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న క్రమంలో నే ఇది రాజుకుంటోంది. 2014, 2019లో జరిగిన స్థానిక ఎన్నికలకు భిన్నంగా ఇవి మూడు ప్రధాన పక్షాలకు సవాల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ ఎస్) కి ఈ ఎన్నికలు అతిపెద్ద సవాల్.

స్థానికసంస్థ ల ఎన్నికలు పాలకపక్షానికి అనుకూలంగా ఉంటా యనే మాట ప్రచారంలో ఉన్నా సదరు ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం ఇప్పుడు కాంగ్రెస్‌కు సవాలే! ఇక మూడో పక్షమైన బిజెపికి ఈ ఎన్నికలు ఎంతటి సవాలో అంతటి అవకాశం. నగర- పట్టణ పార్టీ అనే ముద్ర ఉన్నప్పటికీ, అసెంబ్లీలో కాకపోయినా పార్లమెంటు ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత ఓట్లనూ పెద్ద మొత్తంలో కైవసం చేసుకుంటూ గణనీయ స్థానాలు గెలుస్తున్న బిజెపి గ్రామీణ ప్రాంతాల్లోనూ సంస్థాగతంగా బలపడటానికి స్థానిక ఎన్నికలు ఒక గొప్ప అవకాశమే! ఉన్నత చట్టసభల ఎన్నికలకు భిన్నంగా జరిగే స్థానిక ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తేలడాన్ని బట్టి పార్టీల రాజకీయ
భవిష్యత్తు ఆధారపడనుంది.

ప్రజాప్రతినిధులుగా వార్డు సభ్యుల నుంచి సర్పంచ్లు, ఎంపిటిసి, జడ్‌పిటిసి లు ఎన్నికయ్యే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తెలంగాణలో సన్నాహాలు ఊపందుకుంటున్నాయి. వాటిని వెంటనే జరిపించడం లేదా జాప్యం చేయడమన్నది పాలకపక్షమైన కాంగ్రెస్ చేతుల్లో ఉంది. ఎంత జాప్యం చేస్తే అధికార పక్షానికే అంత నష్టం అన్నది వారు గ్రహించాల్సిన రాజకీయ సూక్ష్మం. కాలం గడిచిన కొద్దీ ప్రజావ్యతిరేకత పెరుగుతుందన్నది రాజకీయ పరిశీలన. ‘మేం అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం, వాటి ఫలాలు అందుతున్న క్రమంలోనే మాకు మరింత ప్రజామద్దతు పెరుగుతుంది కనుక ఆలస్యం మాకు మేలే’ అనే ధీమా కాంగ్రెస్ నాయకుల్లో ఉన్నట్టుంది.

స్థానిక ఎన్నికలపై ప్రకటనలివ్వడంపైనే పార్టీలో ఎంత గందరగోళముందో చూస్తూనే ఉన్నాం! పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తొలిసారి తన ఒరలోంచి కత్తి తీసి ఝులిపించారు. విధాన నిర్ణయం జరుగకుండానే, స్థానిక ఎన్నికలంటూ అట్లెట్లా ప్రకటిస్తారని మంత్రి శ్రీనివాస రెడ్డిపై మండిపడ్డారు. ఆయనతోపాటు మంత్రి సీతక్క ఎన్నికల గురించి బహిరంగంగా మాట్లాడారు. ఇది సరైన పద్ధతి కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తప్పుబట్టారు. బిసి రిజర్వేషన్లపై పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం వర్తింపజేస్తూ ఎన్నికలకు వెళతారా?ఈ విషయంలో తమ ప్రతిపాదనకు కేంద్ర నిర్ణయానికై నిరీక్షిస్తారా? తదుపరి న్యాయపరమైన చిక్కులు రాకుండా న్యాయస్థానాల నుంచి స్పష్టత తర్వాతే అమలుకు వెళతారా? ఇవన్నీ ప్రస్తుతానికి ప్రశ్నలే! ఇతర పక్షాలైన బిఆర్‌ఎస్, బిజెపిలు మాత్రం సత్వర స్థానిక ఎన్నికలకు నిరీక్షిస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసి అధికారుల పాలనను చవిచూస్తున్న రాష్ట్ర ప్రజానీకం కూడా ఎన్నికలు జరిగి, ప్రజాప్రతినిధులు రావాలనే కోరుకుంటున్నారు. జడ్‌పిటిసి, ఎంపిటిసి పదవుల కన్నా సర్పంచ్ పదవులపైన స్థానిక నాయకత్వంలో ఆసక్తి మెండుగా కనిపిస్తోంది.

స్థానిక ఎన్నికల్లో ఎప్పుడూ ఒకే రకం వాతావరణం ఉండదు. తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో జరిగిన 2014 ఎన్నికలకు, తర్వాత 2019లో జరిగిన ఎన్నికలకూ పూర్తి వ్యత్యాసముంది. 2014లో బిఆర్‌ఎస్ (నాటి టిఆర్‌ఎస్), కాంగ్రెస్ పార్టీల మధ్య క్షేత్రంలో పోటీ నువ్వా నేనా అన్నట్టుండింది. మొత్తం 443 జడ్‌పిటిసిలకు గాను టిఆర్‌ఎస్ 191 గెలిస్తే కాంగ్రెస్‌కు 176 స్థానాలు లభించాయి. నాడు అంతోఇంతో ఉనికిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి 53 స్థానాలు దక్కగా, 23 స్థానాలు ఇతరులు గెలుచుకున్నారు. టిఆర్‌ఎస్ కన్నా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఎంపిటిసి స్థానాలు దక్కాయి. మొత్తం 6497 స్థానాలకు గాను టిఆర్‌ఎస్‌కు 1860 లభించగా, కాంగ్రెస్ పార్టీ 2315 స్థానాలు కైవసం చేసుకుంది. టిడిపికి కూడా గుర్తించదగిన స్థాయిలో 1061 స్థానాలు దక్కాయి. తర్వాతి కాలంలో టిడిపి తెలంగాణలో బాగా బలహీనపడింది.

కొన్ని జిల్లాలు, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. బిజెపికి లభించిన స్థానాలతో కలుపుకొని ఇతరులకు 1251 ఎంపిటిసి స్థానాలు ఆ ఎన్నికల్లో లభించాయి. ఇక 2019 స్థానిక ఎన్నికల నాటికి కథ పూర్తిగా మారింది. కొత్త జిల్లాల ఏర్పాటు క్రమంలో ప్రభుత్వం కొన్ని జడ్‌పిటిసిలను పెంచింది. 2019 ఎన్నికల్లో 446 స్థానాలు పాలక టిఆర్‌ఎస్‌కు లభించగా, కాంగ్రెస్ పార్టీ గెలుపు 75 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. బిజెపి 8 జడ్‌పిటిసి ల్లో గెలుపొందింది. ఈ వ్యత్యాసం ఎంపిటిసిల్లోనూ స్పష్టం గా కనిపించింది. పాలకపక్షం 3,556 చోట్ల నెగ్గితే, కాంగ్రెస్ అభ్యర్థులు 1377 స్థానాల్లో గెలిచారు. బిజెపికి 211 ఎంపిటిసిలు దక్కాయి.

సర్పంచ్‌ల ఎన్నిక పార్టీల ప్రాతిపదికన కాకపోయినా…. ఆయా రాజకీయపక్షాలు గెలుపొందిన అభ్యర్థుల ప్రకటన ప్రకారం పాలక టిఆర్‌ఎస్‌కు చెందిన సర్పంచ్ అభ్యర్థులు 7,774 మంది గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్‌లు 2709, బిజెపికి చెందిన సర్పంచ్ అభ్యర్థులు 163 గెలుపొందారు. సంస్థాగతంగా ఆలోచించినప్పుడు ఆయా పార్టీకు ఇదొక పెద్ద దన్ను! అసెంబ్లీ, పార్లమెంటు వంటి ఉన్నత చట్టసభల ప్రతినిధులకు సామాన్య ప్రజలకు మధ్యలో ఈ స్థానిక ప్రజాప్రతినిధుల వ్యవస్థ ఒక వారధిగా ఉండటం వల్ల ఆయా పార్టీలు సంస్థాగతంగా బలోపేతం కావడానికి అవకాశం లభిస్తుంది.
అసెంబ్లీ, లోక్‌సభ రెండు వరస ఎన్నికల ఓటమితో కుదేలయి ఉన్న బిఆర్‌ఎస్‌కు స్థానిక ఎన్నికలు పెద్ద సవాల్. ఇక్కడ కూడా విఫలమైతే పార్టీ ఉనికికే ప్రమాదం. ఎందుకంటే, ఇక్కడ మూడో పక్షంగా బిజెపి దూసుకువస్తోంది.

సంస్థాగతంగా బిఆర్‌ఎస్ బలహీనపడితే, ఆ రాజకీయ శూన్యతలోకి విస్తరించడానికి సిద్ధంగా ఉంది. స్థానిక ఎన్నికలే పార్టీ కిందిస్థాయి నాయకులు-, కార్యకర్తల రాజకీయ ఉనికికి ఆధారం! దివంగత నేత జయలలిత (తమిళనాడు), మాయావతి (ఉత్తరప్రదేశ్) వంటి నాయకులు స్థానిక ఎన్నికల్ని బహిష్కరించి కూడా తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాలేదా? అని బిఆర్‌ఎస్‌లో కొందరు భావిస్తున్నారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌సిపి అసెంబ్లీ ఓటమి- గెలుపు- ఓటమి మధ్య స్థానిక ఎన్నికల్లో పరిస్థితి ఇదే చెబుతోంది కదా అని తమ వాదన సమర్థించుకుంటారు. ముఖాముఖి తలపడే పార్టీలున్నపుడు పరిస్థితికి, ముక్కోణపు పోటీ వాతావరణానికి తేడా ఉంటుందనే మతలబును బిఆర్‌ఎస్ అర్థం చేసుకోవాలి. స్థానిక ఎన్నికల్ని బహిష్కరించినా, అలక్ష్యం చేసినా… క్షేత్రం వీడి పారిపోయినట్టే లెక్క. ఇపుడు పాలకపక్షం కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొని పార్టీ పరిస్థితిని మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. వరుస పరాజయాల తర్వాత…. అగ్రనాయకులెదుర్కొంటున్న కేసులొకవైపున ఉంటే, పార్టీ అధినేత కుటుంబ కలహాలు,- ఆధిపత్య పోరాటాలు పతాకస్థాయిలో ఉన్నాయి. వాటిని అధిగమించి, పార్టీని ఒకతాటిపైకి తేవడమే కాకుండా ఉత్సాహంగా శ్రేణుల్ని ముందుకు నడపాల్సి ఉంటుంది. 2001లో పార్టీ ఆవిర్భావంతోనే లభించిన స్థానిక ఎన్నికలను సానుకూలంగా మలచుకొని, ఉద్యమ పార్టీగా ఉంటూ కూడా నిజామాబాద్, కరీంనగర్ జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకున్న చరిత్ర టిఆర్‌ఎస్ ది. మరిప్పుడేం చేస్తారో!

కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టు క్షేత్రంలో ‘అంతా సానుకూలం’ పరిస్థితేమీ లేదు. ప్రభుత్వ వ్యతిరేక భావన జనం మాటల్లో వ్యక్తమవుతోంది. నిర్దిష్టంగా ‘ఇదీ కారణం’ అని చెప్పకపోయినా… హామీలు ఇచ్చిన స్థాయి లో, తాము ఆశించిన స్థాయిలో ప్రభుత్వం పనిచేయటంలేదనే భావన వివిధ వర్గాల్లో ఉంది. పాలకపక్షం చెప్పుకుంటున్న అభివృద్ధి- సంక్షేమాన్ని ప్రజలు ఏ మేరకు అంగీకరిస్తున్నారు? అన్నది స్థానిక ఎన్నికల్లో కొంత స్పష్టమవుతుంది. ఎటుతిరిగి స్థానిక ఎన్నికలు పాలకపక్షానికి అనుకూలమనే వాదన 2014 స్థానిక సంస్థలతో పోలిస్తే 2019లో టిఆర్‌ఎస్‌కు లభించిన విజయాల్ని బట్టి తేటతెల్లమవుతోంది. కానీ, అన్నిసార్లూ అలాగే జరుగాలని లేదు. 2023 అసెంబ్లీ గెలుపుతో పోలిస్తే 2014 లోక్‌సభ ఎన్నికల నాటికే కాంగ్రెస్ బలం తగ్గినట్టు ఫలితాలు చెప్పాయి. తాము సాధించామని చెబుతున్న ‘సామాజిక న్యాయం’ ఇపుడు ప్రజాక్షేత్రంలో పరీక్షకు నిలువనుంది. అమలు ఆయావర్గాలకు సంతృప్తినిస్తోందా? లేదా?అన్నది మిగతా అసెంబ్లీ, లోక్‌సభ వంటి ఎన్నికల్లో కన్నా స్థానిక ఎన్నికల్లోనే విస్పష్టంగా జనాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సంచలన విజయాలతో రాజకీయ ప్రస్తానం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అప్పటిదాకా తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి పార్లమెంటు స్థానాన్నే కాకుండా సొంత జిల్లా మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానాన్నీ కాంగ్రెస్ కోల్పోయింది. తర్వాత ఎన్నికలు జరిగిన ఎంఎల్‌సి (పట్టభద్రుల, ఉపాధ్యాయుల) స్థానాల్ని కూడా కాంగ్రెస్ గెలువలేకపోయింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు బిజెపికి ఓ అవకాశం. రాష్ట్రవ్యాప్తంగా తమకు సంస్థాగత నిర్మాణం, వ్యవస్థ ఉన్నాయని బిజెపి నిరూపించుకునే సందర్భం. దేశ ప్రధానమంత్రి, పార్టీ అత్యున్నత నేత ‘మోడీ’ పేరు చెప్పుకుంటే లోక్‌సభ స్థానాలు వస్తున్నాయే తప్ప పార్టీకి అసెంబ్లీ సీట్లు రావటం లేదు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, చేవెళ్ల, మహబూబ్‌నగర్ వంటి లోక్‌సభ నియోజకవర్గాల పరిధి గ్రామీణ ప్రాంతాల్లో లభించిన ఓట్లను, ఓటు బ్యాంకుల్ని స్థిరం చేసుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బిజెపికి ముఖ్యం.

అందుకు ఇదొక చక్కని అవకాశం. పార్టీ సంస్థాగత ఎన్నికలతో అట్టడుగుస్థాయి నిర్మాణం ప్రక్రియ ఇటీవలే ముగిసింది. కేంద్రంలో ఎలాగూ అధికారంలో ఉన్నాం కనుక, బడానేతల్ని తెచ్చి, బహిరంగ సభలు పెడితే చాలనే భావన నుంచి పార్టీ బయటపడాలి. కింది స్థాయిలో పనిచేసే కార్యకర్తలు, నాయకులకూ అధికారం రుచి చూపి, కింది స్థాయిలోనూ పార్టీ వ్యవస్థను బలోపేతం చేసే అవకాశాన్ని పార్టీ నాయకత్వానికి స్థానిక ఎన్నికలు కల్పిస్తాయి. ఈ దిశలో బిజెపి కృషి చేయకుంటే ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్ తిరిగి లేచి, కోలుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అది తెలంగాణలో బిజెపి ఎదుగుదలకు రాజకీయంగా ప్రతిబంధకమే! ఎలా చూసినా, రాబోయే స్థానిక ఎన్నికలు మూడు ప్రధాన పక్షాలకు గట్టి సవాల్‌నే విసురుతున్నాయి.

దిలీప్‌రెడ్డి

సమకాలీనం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News