2017 కన్నా పెరిగిన కేసుల సంఖ్య
బాలికలపై అత్యాచారాలు మహారాష్ట్రలో అత్యధికం
ఒక్క ఏడాదిలో 26 శాతం పెరిగిన బాల్యవివాహాల కేసులు
నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో డేటా వెల్లడి
న్యూఢిల్లీ : 2018 లో దేశంలో ప్రతిరోజూ 109 మంది బాలబాలికలు లైంగిక వేధింపులకు గురయ్యారని నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో డేటా వెల్లడించింది. అంతకు ముందు సంవత్సరం కన్నా ఈ సంఘటనల కేసులు 22 శాతం పెరిగాయని వివరించింది. లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ చట్టం ( పోక్సో) కింద 2017లో 32, 608 కేసులు నమోదు కాగా, 2018 లో 39,827 కేసులు నమోదయ్యాయి. 2012 నుంచి అమలులో ఉన్న ఈ చట్టం లైంగిక నేరాలు, లైంగిక హింస, పోర్నోగ్రఫీ నుంచి బాలబాలికలకు రక్షణ కల్పిస్తుంది. ఈ కేసులను ప్రత్యేకంగా విచారించడానికి ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక ప్రాసిక్యూటర్లు అవసరం. బాధితులకు రక్షణ కల్పించే వారు కూడా అవసరమే. 2018 లో పిల్లలపై అత్యాచార సంఘటనలు 21,401 వరకు జరిగినట్టు రికార్డు అయింది.
ఈ కేసుల్లో బాలికలపై అత్యాచార సంఘటనలు 21401 కాగా, బాలురుపై 204 సంఘటనలు జరిగాయి. బాలికలపై అత్యాచారాలు అత్యధికంగా 2832 వరకు మహారాష్ట్రలో జరగ్గా, 2023 వరకు ఉత్తర ప్రదేశ్లో, 1457 తమిళనాడులో జరిగాయి. 2008 నుంచి 2018 వరకు దశాబ్ద కాలంలో ఆరు రెట్లు బాలలపై నేరాలు పెరిగాయి. 2008 లో 22, 500 కేసులు నమోదు కాగా, 2018 లో 1,41, 764 కేసులు నమోదయ్యాయి. 2017 లో 1, 29, 032 నేరాల కేసులు నమోదయ్యాయి. ఒకవైపు బాలలపై లైంగిక నేరాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే విషయమే అయినప్పటికీ ఆయా నేరాలు నమోదు కావడం ప్రజల్లో ఈ వ్యవస్థపై నమ్మకాన్ని తెలియచేస్తుందని డైరక్టర్ ఆఫ్ పాలసీ రీసెర్చి అండ్ అడ్వొకెసీ సిఆర్వై (చైల్డురైట్స్ అండ్ యు) ప్రీతి మహరా చెప్పారు.
దీనివల్ల ప్రభుత్వం పిల్లల రక్షణకు మరిన్ని చర్యలు పకడ్బందీగా తీసుకోడానికి వీలైందని అన్నారు. 2018 లో నమోదైన కేసుల్లో 44.2 శాతం పిల్లల కిడ్నాప్లు, బలవంతంగా బందీ చేయడం కేసులేనని, మొత్తం 67,134 మంది పిల్లలు అదృశ్యమైన కేసులని, అదే సంవత్సరం 71, 176 మంది పిల్లలను పట్టుకోడమైందని డేటా వెల్లడించింది. 2018 లోనే పోర్నోగ్రఫీ కేసులు 781 నమోదు కాగా, అంతకు ముందు 2017లో 331 కేసులు నమోదయ్యాయి. దేశం లోని మొత్తం కేసుల్లో రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, రాష్ట్రాల్లో 51శాతం కేసులు నమోదయ్యాయి. షెల్టర్ హోమ్ల్లో మహిళల, బాలల లైంగిక వేధింపుల కేసులు 30 శాతం పెరిగాయి. 2017 లో 544 కేసులు నమోదు కాగా, 2018లో 707 కేసులు నమోదయ్యాయి. బాల్యవివాహాల నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో 26 శాతం పెరుగుదల కనిపించింది. 2017 లో 395 కేసులు నమోదు కాగా, 2018 లో 501 కేసులు నమోదయ్యాయి.