Tuesday, June 24, 2025

గాంధీ భవన్‌లో గొర్రెలతో వినూత్న నిరసన

- Advertisement -
- Advertisement -

ఎవరిపైన అయినా నిరసన వ్యక్తం చేయాలనుకున్నప్పుడు విభిన్న రకాలుగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేస్తుంటారు. కొంత మంది దిష్టి బొమ్మలు దగ్దం చేస్తే, మరి కొంత మంది దిగ్బంధం చేస్తే, ఇంకా కొంత మంది పురుషులైతే చొక్కాలు విప్పేసి అర్థనగ్న ప్రదర్శన చేస్తారు. కాగా సోమవారం గొల్ల, కురుమలు వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. యాదవులకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని, పిసిసి కార్యవర్గంలోనూ ప్రాధాన్యత తగ్గిందని గొల్ల, కురుమలు నిరసన వ్యక్తం చేస్తూ గొర్రెల మందను ఒక వాహనంలో తీసుకుని వచ్చి, వాటిని గాంధీ భవన్ ఆవరణలో దించారు. అంతేకాకుండా వాటిని గాంధీ భవన్ లోపలికి పంపించే ప్రయత్నం చేశారు.

అయితే గాంధీ భవన్‌లో సోమవారం చాలా కార్యక్రమాలు ఉండడం వల్ల ఉదయం నుంచే పోలీసులు బందోబస్తులో ఉన్నారు. కొంత మంది గొర్రెలను తీసుకుని రావడం, వాటిని గాంధీ భశన్‌లోకి పంపించే ప్రయత్నం చేయడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో గొల్ల, కురుమలకు పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రతినిధుల బృందాన్ని లోపలికి తన ఛాంబర్‌కు పిలిపించుకుని మాట్లాడారు. యాదవులకు ప్రభుత్వంలో సరైన గుర్తింపు లేదని వారు మహేష్ కుమార్ గౌడ్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. కార్పోరేషన్ చైర్మన్ పదవులూ దక్కలేదని వారు ఆవేదన చెందారు. కాగా మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ రానున్న రోజుల్లో తప్పకుండా గొల్ల కురుమలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేస్తానని వారికి నచ్చజెప్పారు. దీంతో కథ సుఖాంతమైందని పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. గాంధీ భవన్‌కు వచ్చిన వారిలో కొంత మంది ఆలేరు నియోజకవర్గానికి చెందిన వారున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News