అబుదాబి: ఆసియాకప్ గ్రూప్బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సూపర్4కు అర్హత సాధించాయి. గురువారం అఫ్గానిస్థాన్తో జరిగిన కీలక మ్యాచ్లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యాన్ని లంక 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ 52 బంతుల్లో 10 ఫోర్లతో అజేయంగా 74 పరుగులు చేసి లంకను గెలిపించాడు. కుశాల్ పెరీరా (28), కమిందు మెండిస్ 26 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు. అంతకుముదు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.
Also Read: హైదరాబాద్ విలవిల
ఓపెనర్లు రహమానుల్లా గుర్బాజ్ (14), సాధిఖుల్లా అటల్ (18) పరుగులు సాధించారు. వన్డౌన్లో వచ్చిన కరీం జన్మత్ (1) నిరాశ పరిచాడు. అంతేగాక దర్విష్ రసూలి (9), అజ్మతుల్లా (6) కూడా విఫలమయ్యారు. ఇక సమన్వయంతో బ్యాటింగ్ చేసిన ఇబ్రహీం జద్రాన్ ఓ సిక్స్తో 24 పరుగులు చేశాడు. మరోవైపు మహ్మద్ నబి, కెప్టెన్ రషీద్ ఖాన్లు కీలక సమయంలో అద్భుత బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నారు. నబి ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగిన నబి వరుస సిక్సర్లతో స్కోరును పరిగెత్తించాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన నబి 22 బంతుల్లోనే ఆరు భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో 60 పరుగులు చేసి ఔటయ్యాడు. రషీద్ రెండు ఫోర్లు, సిక్స్తో 24 పరుగులు చేశాడు.